KTR: యశ్వంత్ సిన్హాకు మద్దతు వెనక అనేక కారణాలు: కేటీఆర్‌

రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హాకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

Updated : 27 Jun 2022 16:41 IST

దిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హాకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. విపక్షాల మద్దతుతో రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెరాస తరఫున ఎంపీ నామా నాగేశ్వరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కేటీఆర్‌ సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీ తరఫున సంఘీభావం తెలిపిన అనంతరం యశ్వంత్‌ సిన్హాను హైదరాబాద్‌కు ఆహ్వానించినట్లు కేటీఆర్‌ తెలిపారు. 

నామినేషన్‌ ప్రక్రియ అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘యశ్వంత్‌ సిన్హాకు మద్దతు ఇచ్చేలా ఒక ప్రధాన నిర్ణయం తీసుకోవడం వెనక అనేక కారణాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక నియంతలా, నిరంకుశ విధానాలతో పాలన సాగిస్తోంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 8 ఏళ్లలో అప్రజాస్వామికంగా అన్యాయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు దాదాపు 8 రాష్ట్రాల్లో భాజపాకు మెజారిటీ లేకపోయినా అక్కడి పరిస్థితులను తలకిందులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ఈ విషయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని భాజపా సద్వినియోగం చేసుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొని విపక్షాలపై ఉసిగొల్పి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుంటోంది. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి పార్టీ దాన్ని తిరస్కరించాల్సిన అవసరం ఉంది. అందుకే భాజపా ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థిని తిరస్కరిస్తూ విపక్షాలు బలపర్చిన అభ్యర్థిని బలపరిచాం. అయితే అధికార ఎన్డీయే కూటమి ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదు’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.

గిరిజనుల మీద భాజపాకు ప్రేమ ఉంటే..

‘‘రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన అభ్యర్థికి మద్దతిస్తున్నామని భాజపా పదేపదే చెబుతోంది. మా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గిరిజన జనాభా పెరిగింది. అందుకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతం పెంచాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రం వద్దకు పంపించి నాలుగేళ్లు అయింది. భాజపాకు నిజంగానే గిరిజనులపై ప్రేమ ఉంటే ఈ పాటికే ఆమోదించాల్సింది. ఇప్పటివరకు చేయలేదు కదా.. చేస్తారో.. లేదో చెప్పడం లేదు. పార్లమెంట్‌లో మా పార్టీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేసినా ఎలాంటి స్పందన లేదు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని పునర్విభజన చట్టంలో పొందుపరిచారు. ఈరోజు వరకు దానికి కూడా అతీగతీ లేదు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు.. అందులోనూ గిరిజన జనాభా ఎక్కువగా ఉండే మండలాలు.. ఇవన్నీ తీసుకెళ్లి పోలవరంలో ముంచిన నాడు గిరిజనుల మీద ప్రేమ ఏమైంది?కాబట్టి నోరుతో నవ్వుతూ.. నొసలుతో వెక్కిరించే భాజపా వైనం, వ్యవహారం తెలంగాణ, దేశంలోని గిరిజనులకు బాగా తెలుసు’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని