Harish Rao: కోట్లాది కొలువులు.. ఖాతాల్లో రూ.లక్షల కొద్దీ డబ్బు.. ఏవీ?: హరీశ్‌రావు

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. నిన్న భాజపా సభలో డైలాగుల కోసం, ప్రాస కోసం నడ్డా  పాకులాడిన్నట్లుందని విమర్శించారు. 

Updated : 16 Dec 2022 18:23 IST

హైదరాబాద్‌: ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు కౌంటర్‌ ఇచ్చారు. భాజపా సభలో నడ్డా డైలాగుల కోసం పాకులాడిన్నట్లుందని విమర్శించారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘భారాసకు వీఆర్‌ఎస్‌ అంటే మాకు ఓటమి లేదని నడ్డా అంగీకరించినట్లే. వీఆర్‌ఎస్‌ అంటే స్వచ్ఛంద విరమణ. మేం స్వచ్ఛంద విరమణ చేస్తే తప్పా మాకు ఓటమి లేదని నడ్డానే అన్నారు’’ అని హరీశ్‌రావు తెలిపారు. 

‘‘మీరేం హామీ నెరవేర్చారని.. మా గురించి మాట్లాడుతున్నారు. రైతుల ఆదాయం పెంచుతామని చెప్పి పెట్టుబడిని రెట్టింపు చేశారు. రూ.లక్షల డబ్బు ఖాతాల్లో వేస్తామన్నారు, కోట్ల కొద్దీ కొలువులిస్తామన్నారు.. అవన్నీ ఏవీ? ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్రంలో కల్యాణలక్ష్మీ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో చెప్పలేదు కదా.. అయినా ఇచ్చాం. రైతుబంధు, రైతుబీమా ఇస్తామని కూడా చెప్పలేదు. మేనిఫెస్టోలో లేకపోయినా కేసీఆర్‌ కిట్‌ ఇస్తున్నాం. కేసీఆర్‌ కిట్‌ అద్భుతమని కేంద్రమే 2 అవార్డులు ఇచ్చింది. భాజపాకు ఎంతసేపు రాజకీయాలు తప్ప అభివృద్ధి లేదు. కేసీఆర్‌ మాత్రం ప్రతి నిమిషం ప్రజల కోసం ఆలోచిస్తారు. అందులో భాగంగానే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అవన్నీ అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో చేసుకుంటూ పోతున్నాం’’ అని హరీశ్‌రావు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని