KTR: అన్నిసార్లు అవకాశమిస్తే కాంగ్రెస్‌ ఏం చేసింది?: మంత్రి కేటీఆర్‌

ఒకప్పుడు పాలమూరు అంటే మైగ్రేషన్‌.. ఇప్పుడు ఇరిగేషన్‌ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పాలమూరు పచ్చబడుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.

Updated : 06 May 2023 19:58 IST

మహబూబ్‌నగర్‌: ఒకప్పుడు పాలమూరు అంటే మైగ్రేషన్‌.. ఇప్పుడు ఇరిగేషన్‌ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పాలమూరు పచ్చబడుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. పల్లెపల్లెనా పల్లేర్లు మొలిచే.. పాలమూరులోనా అని ఒకప్పుడు పాటలు ఉండేవని.. ఇప్పుడు పల్లెపల్లెనా పసిడి పంటలు పండే.. అని పాడుకుంటున్నారని కేటీఆర్‌ అన్నారు. ఒకప్పుడు పాలమూరు బిడ్డలు ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లేవారని.. ఇప్పుడు కర్నూలు, రాయచూరు నుంచి కూలీలు పాలమూరుకు వస్తున్నారని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు అడుగుతున్నారు. కాంగ్రెస్‌కు ఒక్కటి కాదు.. 11 సార్లు దేశ ప్రజలు అవకాశం ఇచ్చారు. 55 ఏళ్లు అవకాశం ఇస్తే ఏం చేశారో ఆ పార్టీ నేతలు చెప్పాలి. పాలమూరు ప్రజల ఆశీర్వాదంతోనే కేసీఆర్‌ దిల్లీకి వెళ్లి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చారు. కేసీఆర్‌ అంటే.. కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు. భారాస అంటే.. భారత రైతు సమితి. 10 వేల మందికి కొలువులు ఇచ్చే పరిశ్రమకు దివిటిపల్లిలో శంకుస్థాపన చేశాం. ఉద్ధంపూర్‌, కరివెన రిజర్వాయర్లలో 30 టీఎంసీల నీరు నింపుతున్నాం. మహబూబ్‌నగర్‌లో 7,900 మందికి రెండు పడకల గదుల ఇళ్లను ఇచ్చాం’’ అని కేటీఆర్‌ వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని