Navneet Rana: ‘మరోసారి అలా చేస్తే చంపేస్తా’.. ఎంపీ నవనీత్‌ రాణాకి హత్యా బెదిరింపులు!

మహారాష్ట్రలో మాతోశ్రీ- హనుమాన్‌ చాలీసా వివాదంతో వార్తల్లోకెక్కిన అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా.. తాజాగా తనకు ఫోన్‌లో హత్య బెదిరింపులు వచ్చాయని ఆరోపిస్తూ దిల్లీలో ఫిర్యాదు చేశారు. రాణా బుధవారం ఈ మేరకు పోలీసులను ఆశ్రయించగా...

Published : 27 May 2022 01:49 IST

దిల్లీ: మహారాష్ట్రలో మాతోశ్రీ- హనుమాన్‌ చాలీసా వివాదంతో వార్తల్లోకెక్కిన అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా.. తాజాగా తనకు ఫోన్‌లో హత్య బెదిరింపులు వచ్చాయని ఆరోపిస్తూ దిల్లీలో ఫిర్యాదు చేశారు. రాణా బుధవారం ఈ మేరకు పోలీసులను ఆశ్రయించగా.. ఒకరోజు తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు దిల్లీ డీసీపీ అమృత గుగులోత్ గురువారం వెల్లడించారు. ఫిర్యాదు ప్రకారం.. మంగళవారం సాయంత్రం 5.27 నుంచి 5.47 గంటల మధ్య ఎంపీ మొబైల్‌ నంబర్‌కు 11 కాల్స్‌ వచ్చాయి. అవతలి వ్యక్తి అనుచితంగా మాట్లాడినట్లు, దుర్భాషలాడినట్లు, మహారాష్ట్రకు వస్తే చంపేస్తానని బెదిరించినట్లు అందులో పేర్కొన్నారు. మళ్లీ హనుమాన్ చాలీసా పఠిస్తే చంపేస్తానని హెచ్చరించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంతో తాను మానసిక వేదనకు గురయ్యాయని ఎంపీ ఫిర్యాదులో పేర్కొన్నారు.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రే ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠించి తీరతామంటూ కొద్దిరోజుల క్రితం నవనీత్‌ రాణా దంపతులు సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. దీంతో.. రెండు వర్గాల మధ్య కలహాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారంటూ వారిపై ముంబయి పోలీసులు ఏప్రిల్‌ 23న రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై దాడి చేశారన్న ఆరోపణలపై ఏప్రిల్‌ 24న రెండో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఇరువురిని అరెస్టు చేసిన పోలీసులు.. బాంద్రాలోని మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరుచగా వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. అనంతరం ఈనెల 4న బెయిల్‌పై విడుదలయ్యారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ముంబయి ఖేర్‌ ప్రాంతంలోని రాణా దంపతుల ఫ్లాట్‌లో కొంతభాగాన్ని ముంబయి నగరపాలక సంస్థ అక్రమ నిర్మాణంగా తేల్చింది. దాన్ని వారం రోజుల్లోగా తొలగించాలని.. లేని పక్షంలో ఆ పని తామే చేస్తామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని