New Parliament: ‘మేం రావట్లేదు’: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై విపక్షాల సంయుక్త ప్రకటన

New Parliament Building Opening: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుక రాజకీయ రగడకు దారితీసింది. దీనిపై కేంద్రప్రభుత్వ చర్యను ఖండిస్తూ విపక్షాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. 

Updated : 24 May 2023 19:09 IST

దిల్లీ: పార్లమెంటు నూతన భవనాన్ని(new Parliament building) రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించనుండటాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దీనిపై మొదలైన రాజకీయ రగడ మరోస్థాయికి చేరింది. ఈ నెల 28న జరగబోయే ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ 19 విపక్షపార్టీలు(opposition parties) సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.(New Parliament Building Opening)

‘పార్లమెంట్ కొత్త భవనాన్ని(new Parliament building) రాష్ట్రపతితో కాకుండా ప్రధాని మోదీ ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. ఈ తీరు రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడం కిందికే వస్తుంది. ఈ అప్రజాస్వామిక చర్యలు ప్రధాని మోదీకి కొత్తేం కాదు. పార్లమెంట్‌లో విపక్ష నేతలు భారత ప్రజల సమస్యలను లేవనెత్తినప్పుడు వారిపై అనర్హత వేటు వేశారు. సస్పెండ్ చేశారు. వారి మాటలను మ్యూట్ చేశారు. పార్లమెంట్‌ నుంచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కనపెట్టినప్పుడు.. ఇక కొత్త భవనంలో మాకు ఏ విలువా కనిపించడం లేదు’ అని విపక్ష పార్టీలు తమ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశాయి.

మేం రేపు నిర్ణయించుకుంటాం: బీఆర్‌ఎస్‌

పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవంలో పాల్గొనాలా..? లేక ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాలా..? అనే దానిపై తాము రేపు నిర్ణయించుకుంటామని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు మీడియాకు తెలిపారు.

ఇదిలా ఉంటే..  తన చర్యను కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది. జాతీయ స్ఫూర్తి, దేశ పురోగతిపై గర్వించడమనేది కాంగ్రెస్‌కు కొరవడిందని కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పురి విమర్శించారు. పార్లమెంటు అనుబంధ భవనాన్ని 1975 అక్టోబరు 24న ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారనీ, ఆమె తనయుడు రాజీవ్‌గాంధీ కూడా ప్రధానిగా 1987 ఆగస్టు 15న పార్లమెంటు గ్రంథాలయానికి శంకుస్థాపన చేశారని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. అప్పట్లో ప్రభుత్వాధినేతలు చేయగా లేనిది ఇప్పుడు చేస్తే తప్పేమిటని కాంగ్రెస్‌ని ప్రశ్నించారు.

మరోసారి ఆలోచించుకోండి: ప్రహ్లాద్‌ జోషి

విపక్ష పార్టీలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి స్పందించారు. ఆ పార్టీలు తమ నిర్ణయంపై మరోసారి ఆలోచించుకోవాలని ఆయన కోరారు.

ఆ 19 పార్టీలు ఏవంటే..?

కాంగ్రెస్‌, డీఎంకే, ఆప్‌, శివసేన(యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, జేఎంఎం, కేరళ కాంగ్రెస్‌(మణి), వీసీకే(Viduthalai Chiruthaigal Katchi), ఆర్‌ఎల్‌డీ, టీఎంసీ, జేడీ(యూ), ఎన్‌సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఐయూఎంఎల్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఆర్‌ఎస్‌పీ, ఎండీఎంకే .. ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన జాబితాలో ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని