భారత్‌×ఆసీస్‌: అక్రమ్‌ ఫేవరెట్‌ ఎవరంటే?

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియానే ఫేవరెట్‌ అని పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు వసీమ్‌ అక్రమ్‌ అన్నాడు. సిరీస్‌ మొత్తం హోరాహోరీగా సాగుతుందని అంచనా వేశాడు. టీమ్‌ఇండియా పేసర్లు అద్భుతంగా రాణిస్తుండటమే ఇందుకు కారణమన్నాడు....

Published : 08 Nov 2020 02:11 IST

కరాచీ: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియానే ఫేవరెట్‌ అని పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు వసీమ్‌ అక్రమ్‌ అన్నాడు. సిరీస్‌ మొత్తం హోరాహోరీగా సాగుతుందని అంచనా వేశాడు. టీమ్‌ఇండియా పేసర్లు అద్భుతంగా రాణిస్తుండటమే ఇందుకు కారణమన్నాడు. ఐపీఎల్‌ ముగియగానే కోహ్లీసేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఆతిథ్య జట్టుతో 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టుల్లో తలపడనుంది.

‘ఆస్ట్రేలియా బౌలింగ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంది. వారికి ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్ హేజిల్‌వుడ్ సహా టాప్‌క్లాస్‌ బౌలర్లు ఉన్నారు. ఏదేమైనప్పటికీ భారత్‌-ఆసీస్‌ పోరు హోరాహోరీగా సాగుతుంది. అయితే ఫేవరెట్‌ మాత్రం ఆస్ట్రేలియానే’ అని అక్రమ్‌ అన్నాడు. టీమ్‌ఇండియా ఫాస్ట్‌ బౌలర్ల వల్ల సిరీస్‌ పోటాపోటీగా మారుతుందని ఆయన అంచనా వేశాడు.

‘జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, నవదీప్‌ సైని, ఇతర బౌలర్లు బాగున్నారు. భారత జట్టులో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. వారి దేహభాష సైతం మారింది. 1990ల్లో మేం మైదానంలోకి అడుగుపెడుతున్నప్పుడు ఉండే ఆత్మవిశ్వాసం వారిలో కనిపిస్తోంది. వాళ్ల శారీరక భాష వారెంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారో చూపిస్తోంది. భారత ఆటగాళ్లు ఏమైనా చేయగలరు’ అని ఆయన అన్నాడు.

డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ రాకతో ఆసీస్‌ బలం పెరుగుతుందని అక్రమ్‌ అన్నారు. ఆసీస్ వికెట్లు కఠినంగా ఉంటాయి కాబట్టి కూకాబుర్ర బంతి పాతబడ్డాక పరుగులను నియంత్రించడం కష్టమని పేర్కొన్నాడు. పాక్‌లో ఎందుకు అత్యుత్తమ పేసర్లు రావడం లేదో ఆయన వివరించాడు. టీ20లపై ఎక్కువగా దృష్టిపెట్టడం, షార్ట్‌కట్ల కోసం ప్రయత్నించడంతో టాప్‌క్లాస్‌ బౌలర్లు రావడం లేదన్నాడు. ఎక్కువ ఓవర్లు వేస్తేనే కండరాలు దృఢంగా మారి వేగం పెరుగుతుందన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని