ఒకవేళ ధోనీ ఐపీఎల్‌లో సరిగ్గా ఆడకపోతే..?

లాక్‌డౌన్‌ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌ పడమూడో సీజన్‌పై స్పష్టత రావడంతో అందరి కళ్లూ ఇప్పుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోనీపై...

Published : 25 Jul 2020 10:53 IST

మాజీ సారథిపై డీన్‌జోన్స్‌ ఏమన్నాడంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: లాక్‌డౌన్‌ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌ 13వ సీజన్‌పై స్పష్టత రావడంతో అందరి కళ్లూ ఇప్పుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోనీపై పడ్డాయి. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8వరకు ఆ మెగా ఈవెంట్‌ను యూఏఈలో నిర్వహిస్తున్నట్లు గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ శుక్రవారం మీడియాకు తెలిపారు. మరోవైపు గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత క్రికెట్‌కు దూరమైన ధోనీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ఐపీఎల్‌లో రాణించి మళ్లీ జాతీయ జట్టులోకి వస్తాడని ఆశగా వేచి చూస్తున్నారు. ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డీన్‌జోన్స్‌ స్పందించారు. 

‘ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్‌ సెలక్టర్లు రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ ధోనీ ఈ ఐపీఎల్‌లో చెలరేగితే అతడి పునరాగమనానికి అవకాశాలు ఉన్నాయి. కానీ, అతడు విఫలమైతే మాత్రం కచ్చితంగా టీమ్‌ఇండియా తలుపులు మూసుకుపోతాయి. ఇప్పటికైతే మహీకి అవకాశం ఉంది. ఈ విరామం కూడా అతడికి అద్భుతంగా కలిసిరావొచ్చు. దీంతో మంచి విశ్రాంతి దొరికింది. అయితే, ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. వయసు పెరిగే కొద్దీ ఒక ఆటగాడు విరామం తీసుకొని మళ్లీ రాణించడం చాలా కష్టం’ అని జోన్స్‌ పేర్కొన్నారు. అలాగే ధోనీ ఒక సూపర్‌స్టార్‌ అని, అతడో గొప్ప ఆటగాడని మెచ్చుకున్నాడు. అయితే, ఇప్పుడు మాత్రం టీమ్‌ఇండియా.. పంత్‌, రాహుల్‌ వైపే చూస్తుందని చెప్పాడు. ఇకపోతే భారత జట్టుకు అసలైన సమస్య మంచి ఫినిషర్‌ లేకపోవడమేనని స్పష్టంచేశాడు. ఆ విషయంలో హార్దిక్‌ పాండ్యను తీసుకుంటే అతడే సరిపోతాడని జోన్స్‌ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉండగా, ఏడాది పాటు ఆటకు దూరమైన ధోనీ మార్చిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్వహించిన శిక్షణా శిబిరంలో సాధన చేశాడు. అక్కడ ఎంతో కష్టపడ్డాడని తోటి ఆటగాళ్లు, ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ఇప్పుడు ఐపీఎల్‌ తేదీలు ఖరారవడంతో ఈసారి అతడు చెలరేగిపోతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని