ముందు నుంచే ప్రాక్టీస్‌ చేశాం: వెంకటేశ్‌ ప్రసాద్‌

టీమ్‌ఇండియా మాజీ పేసర్‌, బౌలింగ్‌ కోచ్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ ఇటీవల రవిచంద్రన్‌ అశ్విన్‌తో ‘డీఆర్‌ఎస్‌ విత్‌ ఆశ్‌’ అనే కార్యక్రమంలో యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన సంగతి...

Published : 17 Jul 2020 15:32 IST

బ్యాట్స్‌మన్‌ కూడా ఆసక్తి చూపించారు
2007 టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా బౌలౌట్‌పై వివరణ..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ పేసర్‌, బౌలింగ్‌ కోచ్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ ఇటీవల రవిచంద్రన్‌ అశ్విన్‌తో ‘డీఆర్‌ఎస్‌ విత్‌ ఆశ్‌’ అనే కార్యక్రమంలో యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వెంకటేశ్‌ 1996 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ ఆమిర్‌ సోహేల్‌ను ఔట్‌ చేసిన విధానం నుంచీ భారత జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా తాను ఎదిగిన తీరును వివరించాడు. ఆ క్రమంలోనే 2007 టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా పాక్‌తో లీగ్‌ స్టేజ్‌లో తలపడిన ఓ మ్యాచ్‌ గురించి స్పందించాడు. ఆ మ్యాచ్‌ టైగా మారడంతో బౌలౌట్‌ విధానంలో టీమ్‌ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరు జట్లూ నిర్ణీత 20 ఓవర్లలో చెరో 141 పరుగులు చేయగా, మ్యాచ్‌ టైగా మారి ఫలితం కోసం బౌలౌట్‌ విధానానికి వెళ్లింది. అప్పుడు టీమ్‌ఇండియా సెహ్వాగ్‌, రాబిన్‌ ఉతప్ప, హర్భజన్‌ సింగ్‌తో బౌలింగ్‌ చేయించి మూడుసార్లు వికెట్లను పడగొట్టింది. పాక్‌ బౌలర్లు ఒక్కరు కూడా వికెట్లు పడగొట్టకపోవడంతో ధోనీసేన 3-0తో గెలుపొందింది.

ఇదే విషయంపై అశ్విన్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ను ప్రశ్నించాడు. బౌలౌట్‌ విధానంలో రెగ్యులర్‌ బౌలర్లను  కాకుండా సెహ్వాగ్‌, ఉతప్పలను ఎంచుకోవడం ఏంటని అడిగాడు. దానికి స్పందించిన మాజీ పేసర్‌. అప్పుడు ఏం జరిగిందనే విషయంపై స్పష్టతనిచ్చాడు. ఆ టోర్నీలో నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకున్నామని, తద్వారా ఏదైన మ్యాచ్‌ టైగా మారితే బౌలౌట్‌ విధానం అమలు చేస్తారని తెలిసిందని చెప్పాడు. అయితే, అంతకన్నా ముందే టీమ్‌ఇండియా ఆ బౌలౌట్‌ పద్ధతిని ప్రాక్టీస్‌ చేసేదని వెంకటేశ్‌ అన్నాడు. అప్పుడు చాలా మంది బ్యాట్స్‌మన్‌ కూడా బౌలింగ్‌ చేయడానికి ఆసక్తి చూపించారని, అందులో ధోనీ, సెహ్వాగ్‌, ఉతప్ప లాంటి బ్యాట్స్‌మన్‌ ఉన్నారన్నాడు. అలా తాను వెనుక నుంచి ఎవరు నిలకడగా వికెట్లకు నేరుగా విసురుతున్నారో గమనించేవాడినని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే తాను సెహ్వాగ్‌, ఉతప్ప, భజ్జీ నిలకడగా వికెట్లకు తాకేలా బంతులేస్తున్నారని గ్రహించి ఆ విషయాన్ని ధోనీకి చెప్పినట్లు మాజీ కోచ్‌ పేర్కొన్నాడు. ఆ విషయంలో ధోనీని ఒప్పించడం తనకు పెద్ద ఇబ్బంది కాలేదన్నాడు. చివరికి ధైర్యం చేసి వారినే పాకిస్థాన్‌పై బౌలౌట్‌కు పంపామని వెల్లడించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని