IND vs PAK : నంబర్‌ 4లో బ్యాటింగ్‌కు వారిద్దరే రావాలి.. యువకులు కాదు : సీనియర్లపై మండిపడ్డ గంభీర్‌

దాయాది పాకిస్థాన్‌(IND vs PAK)తో మ్యాచ్‌లో సీనియర్లు ఘోరంగా విఫలమవడంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 03 Sep 2023 15:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఆసియా కప్‌(Asia Cup 2023)లో తన తొలి మ్యాచ్‌.. అదీనూ చిరకాల ప్రత్యర్థిపై. ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్‌(IND vs PAK)లో సత్తా చాటాల్సిన టీమ్‌ఇండియా(Team India) టాప్‌ ఆర్డర్‌ ఘోరంగా విఫలమైంది. పాకిస్థాన్‌ పేస్‌ దాడిని తట్టుకోలేక 66 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. దీంతో భారత టాప్‌ ఆర్డర్‌ పేలవ ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌(Gautam Gambhir) టీమ్‌ఇండియా సీనియర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌పైనా విమర్శలు గుప్పించాడు.

సీనియర్లు కఠినమైన స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగాలని గంభీర్‌ సూచించాడు. ‘ఇషాన్‌ కిషన్‌ ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడో చూడండి. విండీస్‌తో వన్డేల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి అర్దశతకాలు నమోదు చేశాడు. సీనియర్‌ ఆటగాళ్లు కఠినమైన స్థానాల్లో బ్యాటింగ్‌కు రావాలి. యువ బ్యాటర్లు కాదు. నంబర్‌ 4 స్థానంలో బ్యాటింగ్‌ చేయాలంటే.. అది రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీయే అయి ఉండాలి. సీనియర్లు ఆ బాధ్యతలు తీసుకోవాలి. యువ ఆటగాళ్లు రాణించాలంటే వారు ఆడే స్థానాలనే కేటాయించాలి’ అని గంభీర్‌ ఈ మ్యాచ్‌కు కామెంట్రీ చేస్తూ పేర్కొన్నాడు.

ఇదేనా సన్నద్ధత?

ఇక ఇటీవల టాప్‌ ఆర్డర్‌లో రాణిస్తున్న ఇషాన్‌ కిషన్‌.. నిన్న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 5వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అదరగొట్టిన (82; 81 బంతుల్లో 9×4, 2×6) విషయం తెలిసిందే. టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలినా.. బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్‌ నిర్మించాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య (87; 90 బంతుల్లో 7×4, 1×6)తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని జోడించి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించాడు. వీరిద్దరూ పోరాడి ఉండకపోయి ఉంటే.. టీమ్‌ఇండియా పరిస్థితి ఇంకా దయనీయంగా ఉండేది. ఈ మ్యాచ్‌లో సీనియర్లు విఫలమవడంతోనే గంభీర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

ఇక వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ రద్దయిన విషయం తెలిసిందే. భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు మధ్య మధ్యలో ఆటంకం కలిగించిన వరుణుడు.. పాక్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభం కాకుండా చేశాడు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేసి చెరో పాయింట్‌ ఇచ్చారు. అయితే.. ఆట మధ్యలో ఇరు జట్ల ఆటగాళ్లు సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఇలా కనిపించడంపై గంభీర్‌ స్పందించాడు. టీమ్‌ఇండియా ఆటగాళ్లు 140 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. మైదానం లోపల స్నేహపూర్వక చర్యలు ప్రదర్శించకూడదని.. అలాంటివి ఎప్పుడూ మైదానం బయటే ఉండాలని సూచించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు