CWG 2022 : అమ్మాయిల ఫైనల్‌ పోరు సమయంలో.. రోహిత్‌ సేన ఇలా..

కామన్వెల్త్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్‌లో భారత్‌ రజత పతకం సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌ పోరులో

Updated : 08 Aug 2022 10:36 IST

(ఫొటో : ట్విటర్‌)

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్‌లో భారత్‌ రజత పతకం సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌ పోరులో 9 పరుగుల తేడాతో హర్మన్‌ప్రీత్‌ సేన ఓటమి పాలైంది. అయితే.. తొలి మ్యాచ్ నుంచి మంచి ప్రదర్శన కనబరిచి ఫైనల్‌ వరకూ చేరిన అమ్మాయిలు క్రికెట్‌ అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఇక చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఫైనల్‌ పోరును ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులతోపాటు భారత క్రికెట్‌ పురుషుల జట్టు కూడా ఆసక్తిగా వీక్షించడం విశేషం.

క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతున్న ఈ మ్యాచ్‌ను రోహిత్‌ సేన ఫ్లోరిడాలో మొబైల్‌ ఫోన్‌లో వీక్షించింది. రోహిత్ ఫోన్‌ను చేతిలో పట్టుకొని కూర్చోగా.. మిగతా ఆటగాళ్లంతా అతడి చుట్టూ గుమిగూడి మరీ మ్యాచ్‌ను తిలకించారు. ఆ సమయంలో అందరి ముఖాల్లో.. ఆ తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ కనిపించింది. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఈ ఫొటోను పంచుకుంది. ‘కామన్వెల్త్‌లో మహిళల ఫైనల్‌.. ఎడ్జ్‌బాస్టన్‌లో ఉత్కంఠ. ఫైనల్‌ మ్యాచ్‌ను సీనియర్‌ మెన్స్‌ టీమ్‌ ఫాలో అవుతోందిలా’ అంటూ దానికి కాప్షన్‌ ఇచ్చారు.

ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ల్లో హర్మన్‌ప్రీత్‌ సేన 9 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు షెఫాలి (11), స్మృతి (6) త్వరగా వెనుదిరిగినా.. జెమీమా (33)తో కలిసి హర్మన్‌ప్రీత్‌ (65) పోరాడడంతో 14 ఓవర్లకు 112/2తో భారత్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. గార్డ్‌నర్‌ (3/16), షట్‌ (2/27) భారత్‌ను దెబ్బ కొట్టారు.

మరోవైపు టీమ్‌ఇండియా పురుషుల జట్టు జోరు కొనసాగుతోంది. వెస్టిండీస్‌ పర్యటనను ఘనంగా ముగించింది. ముందే టీ20 సిరీస్‌ గెలిచిన భారత్‌ ఆదివారం, చివరిదైన అయిదో మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (64; 40 బంతుల్లో 8×4, 2×6) చెలరేగడంతో మొదట భారత్‌ 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఛేదనలో వెస్టిండీస్‌ తడబడింది. రవి బిష్ణోయ్‌ (4/16), అక్షర్‌ పటేల్‌ (3/15), కుల్‌దీప్‌ యాదవ్‌ (3/12) ధాటికి 15.4 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని