ENG vs SL: శ్రీలంకతో కీలక మ్యాచ్‌.. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లాండ్

ప్రపంచ కప్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓడిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్.. శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో తడబడుతోంది. 

Updated : 26 Oct 2023 16:20 IST

బెంగళూరు: ఈ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టిన ఇంగ్లాండ్ (England).. సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించేలా ఉంది. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓడిన ఇంగ్లిష్ జట్టు.. శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లోనూ తడబడుతోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ఇంగ్లాండ్ సెమీస్‌ ఆశలు గల్లంతైనట్టే. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 25 ఓవర్లలో 112  పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. జానీ బెయిర్‌స్టో (30; 31 బంతుల్లో 3 ఫోర్లు), డేవిడ్ మలన్ (28; 25 బంతుల్లో 6 ఫోర్లు) కాసేపు నిలకడగానే ఆడినా ఎక్కువ సమయం క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. జోరూట్ (3,) జోస్ బట్లర్ (8), లియామ్ లివింగ్‌స్టోన్ (1) ఘోరంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో ఆ జట్టు 85 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మొయిన్ అలీ (15; 15 బంతుల్లో), బెన్‌ స్టోక్స్ నిలకడగా ఆడటంతో స్కోరు 100 దాటింది. తర్వాత మొయిన్ అలీ కూడా ఔటయ్యాడు. ప్రస్తుతం బెన్‌స్టోక్స్ (33*; 55 బంతుల్లో), క్రిస్ వోక్స్‌ (0*) క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార 2, ఏంజెలో మాథ్యూస్‌ 2, కాసున్ రజిత ఒక్కో వికెట్ పడగొట్టారు.

మొదటి ఆరు ఓవర్లలో ఇంగ్లాండ్ 44/0 స్కోరుతో పటిష్టమైన స్థితిలోనే ఉంది. ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేసిన లంక బౌలర్‌ ఏంజెలో మాథ్యూస్‌ తన తొలి ఓవర్‌లోనే మలన్‌ను ఔట్‌ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ గాడితప్పింది. మలన్‌.. వికెట్‌కీపర్‌ కుశాల్ మెండిస్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తర్వాత వచ్చిన జో రూట్‌ రనౌటయ్యాడు. నిలకడగా ఆడిన ఓపెనర్‌ బెయిర్‌స్టో కూడా కొద్దిసేపటికే వెనుదిరిగాడు. అతడు రజిత బౌలింగ్‌లో మిడాన్‌లో ధనంజయకు చిక్కాడు. లాహిరు కమార తన వరుస ఓవర్లలో బట్లర్‌, లివింగ్‌ స్టోన్‌లను పెవిలియన్‌కు పంపాడు. బట్లర్.. కుశాల్‌ మెండిస్‌కు క్యాచ్‌ ఇవ్వగా.. లివింగ్‌స్టోన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. నిలకడగా ఆడిన మొయిన్ అలీని 25 ఓవర్‌లో మాథ్యూస్‌ వెనక్కి పంపాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని