PAK vs NZ: మా ఆటగాళ్లను నిందించకండి.. అది ప్రభుత్వ ఆదేశం

పాకిస్థాన్‌ పర్యటనను రద్దు చేసుకున్నందుకు న్యూజిలాండ్‌ క్రికెటర్లను నిందించకూడదని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే వాళ్లు నడుచుకున్నారని కివీస్‌ పేసర్‌ మెక్లెనగన్‌ అన్నాడు...

Published : 20 Sep 2021 11:28 IST

క్రైస్ట్‌చర్చ్‌: పాకిస్థాన్‌ పర్యటనను రద్దు చేసుకున్నందుకు న్యూజిలాండ్‌ క్రికెటర్లను నిందించకూడదని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే వాళ్లు నడుచుకున్నారని కివీస్‌ పేసర్‌ మెక్లెనగన్‌ అన్నాడు. ‘‘పాక్‌ నుంచి తిరిగి వెళ్లేందుకు సిద్ధమైన న్యూజిలాండ్‌ జట్టును సురక్షితంగా విమానాశ్రయానికి చేర్చిన పాకిస్థాన్‌ భద్రతా దళాలకు ధన్యవాదాలు. అదే దారి, అదే భద్రత.. మరి ఈ రోజు ప్రమాదం ఎందుకు జరగలేదు’’ అని వ్యంగ్యంగా పాక్‌ బ్యాట్స్‌మన్‌ హఫీజ్‌ చేసిన ట్వీట్‌కు మెక్లెనగన్‌ సమాధానమిచ్చాడు. ‘‘ఇలా అనడం సరికాదు. ఆటగాళ్లను లేదా క్రికెట్‌ సంఘాన్ని నిందించడం మానుకోవాలి. మా ప్రభుత్వాన్ని నిందించండి. వాళ్లకు అందిన సూచనల ప్రకారం ఆటగాళ్లు నడుచుకున్నారు. పాక్‌లో ఆడి సత్తాచాటాలని ఈ యువ ఆటగాళ్లు అనుకున్నారు. కానీ అవకాశం లేకుండా పోయింది’’ అని అతను బదులిచ్చాడు.

పాక్‌లో ప్రమాదం ఉందని తెలిసే: తమ జట్టు ఆటగాళ్లకు తీవ్రమైన ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉందనే సూచనల నేపథ్యంలోనే సిరీస్‌ను రద్దు చేసుకుని పాకిస్థాన్‌ను వీడామని న్యూజిలాండ్‌ క్రికెట్‌ సీఈఓ డేవిడ్‌ వైట్‌ వెల్లడించాడు. శనివారం రాత్రి ఇస్లామాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన 34 మంది సభ్యుల న్యూజిలాండ్‌ బృందం దుబాయ్‌ చేరుకుంది. అక్కడ 24 గంటల ఐసోలేషన్‌ తర్వాత అందులో 24 మంది వచ్చే వారం స్వదేశం చేరనున్నారు. శుక్రవారం తొలి వన్డే ఆరంభానికి కొన్ని నిమిషాల ముందు పర్యటనను రద్దు చేసుకుని పాక్‌ నుంచి వెళ్లిపోతున్నామని న్యూజిలాండ్‌ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ‘‘జట్టుకు ప్రమాదం ఉందని నిర్దిష్టమైన, విశ్వసనీయమైన సూచనలు మాకు అందాయి. దీంతో సిరీస్‌ రద్దు చేసుకోవాలనే నిర్ణయం తీసుకునే ముందు న్యూజిలాండ్‌ ప్రభుత్వ అధికారులతో చర్చించాం. మా పరిస్థితి గురించి పీసీబీకి చెప్పిన తర్వాత.. మా ప్రధానితో పాక్‌ ప్రధాని ఫోన్‌లో మాట్లాడారని తెలిసింది’’ అని డేవిడ్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని