WTC Finals: భారత్‌ గెలవాలి కానీ.. : యువీ

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించాలని మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఛాంపియన్‌షిప్‌ ఆలోచన మంచిదని, దాంతో టెస్టు క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లొచ్చని యువీ పేర్కొన్నాడు...

Published : 06 Jun 2021 19:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించాలని మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఛాంపియన్‌షిప్‌ ఆలోచన మంచిదని, దాంతో టెస్టు క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లొచ్చని యువీ పేర్కొన్నాడు. తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన అతడు ఫైనల్స్‌లో టీమ్‌ఇండియా గెలవాలని ఉన్నా.. న్యూజిలాండ్‌కే కాస్త ఎక్కువ అనుకూలత ఉందన్నాడు. ‘టెస్టు క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లడం మంచి ఆలోచన. టీమ్‌ఇండియా బలంగా ఉందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇటీవలి కాలంలో కోహ్లీసేన విదేశాల్లో నిజంగా అద్భుతంగా రాణిస్తోంది. ఎక్కడైనా విజయం సాధిస్తామనే ధీమా ఆటగాళ్లలో నెలకొంది. అయితే, ఇంగ్లాండ్‌లోని పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. మరోవైపు డ్యూక్‌బాల్‌ కూడా ప్రభావం చూపిస్తాయి’ అని మాజీ క్రికెటర్‌ చెప్పుకొచ్చాడు.

టీమ్‌ఇండియా ఆటగాళ్లు అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి కాస్త సమయం దొరకడంతో భారత్‌ గెలవాలని కోరుకుంటున్నట్లు యువీ ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీసేన న్యూజిలాండ్‌ను కచ్చితంగా ఓడించాలని, టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌ కూడా బలంగా ఉందన్నాడు. బౌలింగ్‌ పరంగా ఇరు జట్లూ సమానంగా ఉన్నాయని తెలిపాడు. అయితే, భారత ఆటగాళ్లు ఐపీఎల్‌ ఆడి నేరుగా టెస్టు క్రికెట్‌ ఆడాలంటే కాస్త కష్టమని సందేహం వెలిబుచ్చాడు. పరిస్థితులకు బాగా అలవాటు పడితేనే అక్కడి పిచ్‌లను అర్థం చేసుకునే వీలు ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్‌ఇండియా నేరుగా టెస్టు క్రికెట్‌ ఆడటం అంత తేలిక కాదని చెప్పాడు. మరోవైపు న్యూజిలాండ్‌ ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడుతున్న నేపథ్యంలో ఆ జట్టుకు కాస్త ఎక్కువ అవకాశాలున్నాయన్నాడు. ఇదిలా ఉండగా, టీమ్‌ఇండియా ఇప్పటికే సౌథాంప్టన్‌ చేరుకొని హోటల్లో మూడు రోజుల కఠిన క్వారంటైన్‌ కూడా పూర్తిచేసుకోనుంది. దాంతో రేపటి నుంచి సుమారు పది రోజులు నెట్స్‌లో తీవ్రంగా సాధన చేసే అవకాశం లభించింది. మరి యువీ ఆశించినట్లు కోహ్లీసేన కివీస్‌ను ఓడిస్తుందో లేదో అప్పటిదాకా వేచి చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని