Zealandia: కొత్తా ఖండమండీ!

గోండ్వానా విడిపోవటం మొదలైనప్పుడు జీలాండియా, ఆస్ట్రేలియా కలిసే ఉండేవి. అనంతరం ఆస్ట్రేలియా నుంచి విడిపోయి జీలాండియా ఏర్పడింది. దీని భూభాగం సముద్రంలో నెమ్మదిగా మునిగి పోతున్నప్పుడు ఆకారమూ మారుతూ వచ్చింది.

Updated : 04 Oct 2023 07:31 IST

విడిపోయిందిలా..

గోండ్వానా విడిపోవటం మొదలైనప్పుడు జీలాండియా, ఆస్ట్రేలియా కలిసే ఉండేవి. అనంతరం ఆస్ట్రేలియా నుంచి విడిపోయి జీలాండియా ఏర్పడింది. దీని భూభాగం సముద్రంలో నెమ్మదిగా మునిగి పోతున్నప్పుడు ఆకారమూ మారుతూ వచ్చింది. పైకి తేలిన చిన్న ద్వీపాలన్నీ కలిసి చివరికి  న్యూజిలాండ్‌లో  భాగమయ్యాయి.

చుట్టుపక్కల ప్రాంతం కన్నా ఎత్తుగా ఉండటం, ప్రత్యేకమైన భూ స్వభావం, చుట్టుపక్కల సముద్రపు అడుగు కన్నా భూభాగం పైపొర మందంగా ఉండటం, నిర్దిష్టమైన ప్రాంతం.. ఇవన్నీ జీలాండియాను ఖండంగా గుర్తించేలా చేశాయి.

జీలాండియా(Zealandia) విస్తీర్ణం సుమారు 49 లక్షల కిలోమీటర్లు. రెండో సూక్ష్మ ఖండమైన మడగాస్కర్‌ కన్నా ఆరు రెట్లు పెద్దది.

అమెరికాకు చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్త బ్రూస్‌ పీటర్‌ లుయెండీక్‌ 1995లో జీలాండియా భావనను, పేరును ప్రతిపాదించారు.

ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పమైన అరేబియా ద్వీపకల్పం, భారత ఉపఖండం  కన్నా జీలాండియా చాలా పెద్దది. సూక్ష్మ ఖండం కన్నా ఖండంగా గుర్తించటానికి అన్ని అర్హతలు జీలాండియాకు ఉన్నాయని ధ్రువీకరించారు.

ది 1820. రష్యా నౌకలో ప్రయాణిస్తున్నవారికి దూరంగా భారీ మంచు దిబ్బ కనిపించింది. అదే అంటార్కిటికా ఖండం. అక్కడి నుంచీ ఆధునిక ఏడు ఖండాల భావన స్థిరపడిపోయింది. పాఠాల్లో ఇదే చదువుకుంటున్నాం. యూరప్‌, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా.. ఇలా ప్రపంచాన్నంతా ఖండాలుగా ఖాయం చేశారు. కానీ 2017లో కథ అనూహ్య మలుపు తిరిగింది. జీలాండియా అనే కొత్త ఖండం ప్రవేశంతో ఏడు ఖండాల సిద్ధాంతం ప్రమాదంలో పడింది. ఆస్ట్రేలియాకు ఆగ్నేయాన ఉండే ఇది ఎనిమిదో ఖండమనే భావన పురుడు పోసుకుంది. దీన్నే టి రియూ-ఎ-మాయూ లేదా టాస్‌మాంటిస్‌ అనీ అంటారు. నిజానికి శాస్త్రవేత్తలు చాలాకాలంగా జీలాండియా ఉనికిని ఊహిస్తూనే వస్తున్నప్పటికీ 375 సంవత్సరాలుగా ఇది అదృశ్యంగానే ఉంది. ఎందుకంటే ఇది 94% వరకు పసిఫిక్‌ మహా సముద్రంలో.. 1 నుంచి 2 కిలోమీటర్ల లోతున మునిగిపోయి ఉంటుంది మరి. మిగతా ఆరు శాతమే పైకి కనిపిస్తుంది. న్యూజిలాండ్‌.. దాని చుట్టుపక్కలుండే న్యూ క్యాలెడోనియా, నార్‌ఫోక్‌ ఐలాండ్‌, లార్డ్‌ హోవె ఐలాండ్‌ దీని మీదే ఉన్నాయి. క్రమంగా జీలాండియా గుట్టు బట్టబయలవుతోంది. భూ విజ్ఞాన, భూకంప శాస్త్రవేత్తలతో కూడిన అంతర్జాతీయ బృందం సముద్రంలోంచి సంగ్రహించిన రాళ్లు, అవక్షేపాల నమూనాలను పరిశీలించి జీలాండియా పటాలను తిరిగి రూపొందించింది. తొలి క్రెటేషియస్‌ యుగానికి సంబంధించిన అతి పురాతన గులక రాళ్ల దగ్గరి నుంచి చివరి క్రెటేషియస్‌ యుగానికి చెందిన ఇసుక రాళ్లు, ఎరోజన్‌ కాలానికి చెందిన లావా రాళ్లను నిశితంగా పరిశీలించింది. వీటి స్వభావాలు దక్షిణ అంటార్కిటికా భూభాగం తీరుతెన్నులతో పోలి ఉన్నట్టు గుర్తించింది. దీని ఆధారంగా న్యూజిలాండ్‌ దక్షిణ తీరంలోని క్యాంప్‌బెల్‌ పీఠభూమి సమీపంలో అదృశ్య భూభాగం ఆచూకీని పసిగట్టింది. సమగ్ర వివరాలతో జీలాండియా కొత్త పటాన్ని రూపొందించింది. ఈ పటంలో భూమి ఎత్తు పల్లాల  వంటి వివరాలనూ పొందుపరచటం విశేషం. ఈ క్రమంలోనే జీలాండియా ఎలా ఏర్పడింది? 2.5 కోట్ల ఏళ్లుగా సముద్రపు అలల కిందే ఎందుకు ఉండిపోయింది? అనే రహస్యాలకు సంబంధించిన సూచనలు సైతం బయట పడ్డాయి.

ఖండాలు ఎనిమిది.

అదేంటి? ఏడే కదా?

అది నిజమే గానీ కొత్తగా వీటికి మరో ఖండం జత చేరనుంది.

పేరేంటో?

జీలాండియా.  

ఇప్పటివరకూ ఎక్కడుంది?

సముద్రపు నీటిలో దాగుంది.  

ఇప్పుడే బయటపడిందా?

ఇంకా సముద్రం అడుగుననే ఉంది. దీని గురించి ఇంతకుముందే తెలుసు. చాలాకాలంగా శాస్త్రవేత్తలు దీని ఉనికిని ఊహిస్తున్నారు. కాకపోతే ఇటీవలే కొత్త పటాన్ని రూపొందించారు.

మరి దీని వివరాలు, విశేషాలేంటి?

కోట్ల ఏళ్ల క్రితం

జీలాండియా సుమారు 8.3 కోట్ల సంవత్సరాల క్రితం.. చివరి క్రెటేషియస్‌ యుగంలో ఏర్పడింది. అయితే దీని ప్రస్థానం అంతకన్నా ముందే మొదలైంది. అప్పట్లో మన భూభాగమంతా ఒకే ముద్దలా ఉండేది. దీన్నే గోండ్వానా మహా ఖండంగా పిలుచుకుంటారు. ఇది విడిపోయి, విస్తరిస్తూ ఖండాలుగా ఏర్పడింది. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతి చిన్న, పలుచటి, కొత్త జీలాండియా ఖండం పుట్టుకొచ్చింది. సుమారు 10 కోట్ల ఏళ్ల క్రితం అంటార్కిటికా నుంచి, సుమారు 8 కోట్ల ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా నుంచి విడిపోయిందని భావిస్తున్నారు. అప్పట్లో కొంతకాలమిది పూర్తిగా లేదా కొంత భాగం ద్వీపంగా ఉండేదని అనుకుంటున్నారు. అయితే 2.5 కోట్ల సంవత్సరాల క్రితం మహా సముద్రం నీటిలో మునిగిపోయింది. పైకి కనిపించే న్యూజిలాండ్‌ దీనిలో భాగమేననే భావన 2002లో పురుడు పోసుకుంది. నీటి లోతును తెలిపే బ్యాతీమెట్రీ అధ్యయనంతో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే జీలాండియాకు మీదున్న సముద్రం లోతు తక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో ఇది మహా సముద్ర భూ ఫలకాలకు సంబంధించింది కాదని, ఖండ భూ ఫలకాలతో ముడిపడినది కావొచ్చనే భావన బలపడింది. సాధారణంగా మహా సముద్ర భూ ఫలకాల రాళ్లు పలుచగా ఉంటాయి. కానీ జీలాండియా రాళ్లు మందంగా ఉండటం, రాళ్లలోని అంశాలు భిన్నంగా ఉండటంతో దీన్ని కొత్త ఖండంగా భావించాలని ప్రతిపాదించారు. అయితే 94% నీటి అడుగున ఉండిపోవటమే పెద్ద చిక్కుగా మారింది. దశాబ్దం పాటు పరిశోధనలు చేసినా ఇది మొదట్లో ఎలా ఏర్పడిందనేది రహస్యంగానే మిగిలిపోయింది. దీని గుట్టు తేలకపోవటానికి ప్రధాన కారణం- గోండ్వానా నుంచి విడిపోయినప్పుడు ఏర్పడిన
విచిత్రమైన ఘటనే.

సాగటంతో పలుచగా

అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం 2019లో జీలాండియా దక్షిణ భాగాన్ని పటంగా రూపొందించింది. వీరి పరిశోధనలో ఒక చిత్రమైన విషయం బయటపడింది. జీలాండియా ఏదో ఒక సమయంలో భూఫలకాల బలాల మూలంగా సాగిపోయిందని తేలింది. ఫలితంగా మిగతా ఖండాల మాదిరిగా కాకుండా పలుచటి ఖండంగా మారింది. అంతేకాదు.. పగుళ్ల మూలంగా సముద్రపు అడుగు పైపొరగా ఏర్పడింది. ఈ క్రమంలో వంపులు తిరిగింది. జీలాండియా అసలు రూపాన్ని తెలుసు కోవటంలో ఇదే సవాలుగా మారింది.

రాళ్ల తీరు, అయస్కాంత లోపాలతో..

తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఉత్తర జీలాండియా ప్రాంతం నుంచి పురాతన రాళ్లను సేకరించి, విశ్లేషించి వాటి వయసును లెక్కించారు. అతి పురాతన గులకరాళ్లు తొలి క్రెటాషియస్‌ (సుమారు 13-11 కోట్ల ఏళ్ల క్రితం) యుగానికి.. ఇసుక రాళ్లేమో చివరి క్రెటాషియస్‌ (సుమారు 9.5 కోట్ల ఏళ్ల క్రితం) చెందినవని గుర్తించారు. లావా గడ్డకట్టం వల్ల ఏర్పడిన రాళ్లు ఈయూసీన్‌ (సుమారు 4 కోట్ల ఏళ్ల క్రితం) కాలానికి సంబంధించినవని తేల్చారు. వాయువ్యం నుంచి ఆగ్నేయం వరకూ భూభాగం చాలా చోట్ల వేర్వేరుగా ఉండటం, పశ్చిమ అంటార్కిటికా భూ స్వభావానికి సరిపోవటం మూలంగా ఈ ప్రాంతం ఒకప్పుడు జీలాండియాతో కలిసి ఉండేదనే నిర్ణయానికి వచ్చారు. జీలాండియా చుట్టుపక్కల సముద్రం అడుగున అయస్కాంత లోపాలనూ శాస్త్రవేత్తలు లెక్కించారు. భూ అయస్కాంత క్షేత్ర బలంలో ఏర్పడే తేడాలు ఖండ భూఫలకాలు ఎలా కదిలాయనే దాన్ని సూచిస్తాయి. వీటి ఆధారంగానే జీలాండియా సాగిన తీరును శాస్త్రవేత్తలు అంచనా వేయగలిగారు. ఇది లక్షలాది సంవత్సరాల పాటు సాగటమే కాదు, దీని దిశ కూడా మారటం గమనార్హం. ఇలా జీలాండియా రహస్యాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. చాలాభాగం సముద్ర ఉపరితలానికి కిలోమీటర్ల లోతులో ఉండటం వల్ల అన్ని రహస్యాలూ తేలటానికి ఇంకాస్త సమయం పట్టొచ్చు.

భారత ఉపఖండం కన్నా పెద్దది

భూమి పైపొర మందం, సాంద్రత వంటి వివిధ స్వభావాలను పరిగణనలోకి తీసుకొని చూస్తే ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పమైన అరేబియా ద్వీపకల్పం, భారత ఉపఖండం కన్నా జీలాండియా చాలా పెద్దది. సూక్ష్మ ఖండం కన్నా ఖండంగా గుర్తించటానికి అన్ని అర్హతలు జీలాండియాకు ఉన్నాయని న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జియాలజిస్టులు ధ్రువీకరించారు. దీని విస్తీర్ణం సుమారు 49 లక్షల కిలోమీటర్లు. ఇది మడగాస్కర్‌ కన్నా ఆరు
రెట్లు పెద్దది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని