వెనుకబాటు నుంచి వెలుగు బాటలోకి

పక్కనున్న మహారాష్ట్రలో నాలుగైదురోజులకోసారి కానీ నీళ్లు రావు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడైనా తాగునీటి సమస్య ఉందా? ధర్నాలు, నీటికోసం ప్రజాప్రతినిధులు,  అధికారుల వాహనాలను అడ్డుకోవడం ఎక్కడైనా చూస్తున్నామా? తాగు నీటి కష్టాలను వందశాతం పరిష్కరించాం కనుకే మంచినీళ్ల పండగ జరుపు కొంటున్నాం.

Updated : 27 May 2023 11:10 IST

అద్భుతాలు చేశాం.. అందుకే దశాబ్ది ఉత్సవాలు
మేం చేసింది చెప్పుకోవడంలో తప్పేముంది?
సాగు, తాగునీరు, విద్యుత్తు.. ఏ రంగంలోనైనా గతంలోని    సమస్యలు ఇప్పుడున్నాయా?
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదం సాకారం
ప్రతిపక్షాలది అసత్య ప్రచారం.. మేకపోతు గాంభీర్యం
వాళ్లకి అభ్యర్థులే లేరు.. విపక్ష హోదా వస్తే ఎక్కువ
‘ఈనాడు’ ముఖాముఖిలో మంత్రి హరీశ్‌రావు
ఈనాడు - హైదరాబాద్‌

పక్కనున్న మహారాష్ట్రలో నాలుగైదురోజులకోసారి కానీ నీళ్లు రావు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడైనా తాగునీటి సమస్య ఉందా? ధర్నాలు, నీటికోసం ప్రజాప్రతినిధులు,  అధికారుల వాహనాలను అడ్డుకోవడం ఎక్కడైనా చూస్తున్నామా? తాగు నీటి కష్టాలను వందశాతం పరిష్కరించాం కనుకే మంచినీళ్ల పండగ జరుపు కొంటున్నాం.

‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు వ్యక్తమైన అనేక అనుమానాలను పటాపంచలు చేసి తొమ్మిదేళ్లలో ప్రభుత్వం అద్భుతాలు సృష్టించింది. తెలంగాణ సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశంలో చర్చనీయాంశం కావడమే కాదు తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని అక్కడి ప్రభుత్వాలపై ఒత్తిడి వస్తోంది. అనూహ్య విజయాలు సాధించిన ప్రభుత్వం ఇందులో భాగస్వాములైన, లబ్ధి పొందిన ప్రజలందరితో కలిసి దశాబ్ది ప్రారంభ ఉత్సవాలను ఘనంగా జరుపుకోనుంది’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలోని విపక్షాలకు ఒక ఎజెండా లేదని, అసత్య ప్రచారాలతో తమను తాము కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నాయని విమర్శించారు. వారికి పోటీ చేయడానికి అభ్యర్థులే లేరని మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల ప్రారంభ నేపథ్యంలో ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి పలు విషయాలను విశ్లేషించారు.

దశాబ్ది ప్రారంభ ఉత్సవాల ప్రాధాన్యమేంటి?
రాదనుకున్న తెలంగాణను తెచ్చుకున్నాం. ఉద్యమకారులు పరిపాలన చేయలేరని, నక్సలైట్ల రాష్ట్రం అవుతుందని, మతకల్లోలాలు జరుగుతాయని, కరెంటు ఉండదని, పరిశ్రమలు మూతపడతాయని.. ఇలా రకరకాల మాటలు రాష్ట్ర ఆవిర్భావ సమయంలో విన్నాం. వీటన్నింటినీ పటాపంచలు చేసి తొమ్మిదేళ్లలో అద్భుతాలు సృష్టించాం. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా పడిన కష్టాలను దూరం చేయగలిగాం. ఇంత గొప్పగా రాష్ట్ర ప్రతిష్ఠను, గౌరవాన్ని పెంచే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన సాగింది. ఈ విజయాలను ప్రజల ఆనందోత్సాహాల మధ్య అద్భుతంగా జరపాలన్నది ప్రభుత్వ నిర్ణయం. తొమ్మిది సంవత్సరాలు పూర్తయి దశాబ్దిలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలను 21 రోజులపాటు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలే కేంద్రబిందువులుగా తొమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధి, నెరవేరిన లక్ష్యాలు, నాటి.. నేటి పరిస్థితి ఏంటన్నది ప్రజల కళ్లకు కట్టినట్లు చెప్పాలనేది ప్రభుత్వ నిర్ణయం.

దశాబ్దం ముగిసే సమయంలో ఉత్సవాలు చేస్తారు. కానీ ప్రారంభంలోనే చేయడానికి కారణమేంటి? ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారన్న అభిప్రాయం కొందరి నుంచి వ్యక్తమవుతోంది కదా?
గిట్టని వాళ్లు ఏదో మాట్లాడవచ్చు. కానీ మేం ప్రజల్లోకి వెళ్తాం. చేసింది చెప్పుకోవడంలో తప్పేముంది? తెలంగాణలో ప్రతి కుటుంబం ఆనందంగా ఉంది. నాటి రోజుల్లో మహిళలు ఎండాకాలంలో మంచినీటి కోసం పడిన కష్టాలు వర్ణనాతీతం. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. సంక్షేమంలో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించాం. కల్యాణలక్ష్మి, ఆసరా, కేసీఆర్‌ కిట్‌, రైతుబంధు, వికలాంగుల పింఛన్‌.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో, దేశంలో ఎక్కడా లేని విధంగా చేశాం. ఎంత పేదవారైనా తిండికి ఇబ్బందిపడే పరిస్థితి లేదు. ఒకప్పుడు కరవు కాటకాలు, భూగర్భజలాలు ఇంకిపోవడం, కరెంటు కోతలు, పంటలు ఎండిపోవడం వంటి పరిస్థితులుండేవి. ఇప్పుడు పండిన పంటను నిల్వ చేసుకోవడానికి గోదాములు కూడా సరిపోని పరిస్థితి. నాట్లు, కోతలకు పక్క రాష్ట్రాల నుంచి కూలీలు రావాల్సిన పరిస్థితి. ఇది కచ్చితంగా అద్భుతమైన విజయం. ఈ విజయోత్సవాల్లో రైతులు పాలుపంచుకొంటారు.

కానీ రైతుకు ప్రభుత్వ సహకారం లేదంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి కదా..?
గతంలో ఎరువులు దొరక్క ఎక్కడ చూసినా రైతుల క్యూలైన్లు, భయపడి పోలీసుస్టేషన్లలో పెట్టి విక్రయించే పరిస్థితి. ఇప్పుడు ఎక్కడైనా ఆ పరిస్థితి ఉందా? కరెంటు కోసం కళ్లలో వత్తులు వేసుకొని ఎదురు చూడటం, ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలిపోవడం, పంటలు ఎండిపోవడం నాడు నిత్యకృత్యం. ఇప్పుడు ఎక్కడైనా ఆ పరిస్థితి ఉందా? 15,500 మెగావాట్ల లోడు వచ్చినా ఇబ్బంది లేకుండా రైతుకు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. ఇలా వ్యవసాయంలో గుణాత్మకమైన మార్పు సాధించాం. రైతుబంధు కింద నగదు బదిలీ చేసిన మొదటి నాయకుడు కేసీఆర్‌, మొదటి ప్రభుత్వం తెలంగాణ. ఇక్కడ రైతుకు అన్ని రకాల భరోసా ఉంది. పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. అక్కడ యాసంగిలో వడ్లు కొననే కొనరు. ఆ రైతులు ఇక్కడ అమ్ముకొంటున్నారు. మనం 2 సీజన్లలోనూ కొంటున్నాం. మహారాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ తరహా విధానం కావాలని కొందరు అడిగితే.. అధ్యయనం చేయడానికి అధికారులతో కమిటీని నియమించారు.

తెలంగాణ ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో.. ఆ దిశలో పయనం కొనసాగుతోందా?
వంద శాతం. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ వచ్చింది. దీనికి తగ్గట్లుగానే కృష్ణా, గోదావరి జలాలను మళ్లించే గొప్ప ప్రయత్నం జరిగింది. కృష్ణాలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేసుకున్నాం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల చివరిదశలో ఉంది. సీతారామ ఎత్తిపోతల కూడా కొద్దిరోజుల్లోనే పూర్తి కానుంది. కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు, ఎస్సారెస్పీ రెండోదశను పూర్తి చేశాం. ఇప్పుడు సగం తెలంగాణకు కాళేశ్వరం నీళ్లందుతాయి. కృష్ణా, గోదావరిలో రాష్ట్ర వాటా సాధించుకున్నాం. మిషన్‌ కాకతీయ కార్యక్రమంతో అందరి ప్రశంసలు పొందాం. మన నీళ్లను మన బీడు భూములకు మళ్లించుకొంటామని ఏ మాటలైతే చెప్పామో, ఏ పాటలైతే పాడామో వాటిని అక్షరాలా నిజం చేసింది తెలంగాణ ప్రభుత్వం.

రాష్ట్రానికి నిధుల లభ్యత, వాటి వినియోగంపై మీ విశ్లేషణ ఏమిటి?
తెలంగాణ రాకుంటే ఇన్ని నిధులు వచ్చేవి కాదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు.. తెలంగాణలోని పది జిల్లాల్లో తొమ్మిది వెనుకబడినవే. ఈ రోజు మొత్తం తెలంగాణ అభివృద్ధికి చిహ్నంగా నిలిచింది. ఆ రోజు వెనకబడేలా చేశారు. ఇక్కడి నిధులు ఇక్కడే వెచ్చిస్తుండడంతో అన్ని జిల్లాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. తలసరి ఆదాయం రూ.3.05 లక్షలైంది. తలసరి విద్యుత్తు వినియోగం, వ్యవసాయ ఉత్పత్తి, విద్య, వైద్యంలో అగ్రగామిగా ఉన్నాం. అంటే మొదటి మూడు స్థానాల్లో నిలిచాం. ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్యలో నంబర్‌ వన్‌గా నిలిచాం. దేశంలో అత్యధిక గురుకుల కళాశాలలున్నది తెలంగాణలోనే. సంపద పెంచి పేదలకు పంచే ప్రయత్నం చేశాం. ఆనాడు సంపద అవినీతి రూపంలో నాయకులు, అధికారుల దగ్గరకు వెళ్లింది. కాంగ్రెస్‌ ఉన్న పదేళ్లలో ఇసుక ఆదాయం రూ.50 కోట్లు దాటలేదు. కానీ తెలంగాణ వచ్చాక మొదటి అయిదేళ్లలోనే రూ.5000 కోట్ల దాకా తీసుకెళ్లాం. మేమొచ్చాక పారదర్శకత పెంచి ప్రతి రూపాయి ఖజానాలోకి చేరేలాగా చేశాం. గతంలో పదేళ్లలో పెట్టిన పెట్టుబడి వ్యయం ఇప్పుడు రెండేళ్లలోనే పెట్టాం. మన నిధులు మనకు దక్కడం వల్లే ఇది సాధ్యమైంది. తెలంగాణలో రహదారులు ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడైనా గుంతలు కనిపిస్తున్నాయా, ఆ రోజు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా గోతులే. పక్క రాష్ట్రాల్లో ఇప్పటికీ అదే పరిస్థితి. మండల కేంద్రానికి రెండు వరుసల రోడ్లు, జిల్లా కేంద్రానికి నాలుగు వరుసల రోడ్లు వేశాం.

ఉద్యోగ నియామకాల మాటేమిటి?
రాష్ట్రం ఏర్పడిన మొదటి అయిదేళ్లలో 1.50 లక్షల ఉద్యోగాలిచ్చాం. ప్రస్తుతం 80 వేల ఉద్యోగాలు భర్తీచేసే ప్రక్రియ కొనసాగుతోంది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేశాం. ఆరోగ్యరంగంలో రెండువేల మంది వైద్యులను నియమించాం. ఒక్క ఖాళీ కూడా లేకుండా భర్తీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రైవేటు రంగంలో భారీగా పెట్టుబడులు రావడంతో కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. కేంద్రం సహకరించకపోయినా, మద్దతు దొరక్కపోయినా తెలంగాణ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఐటీ, తయారీ, టెక్స్‌టైల్‌ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. నిర్మాణరంగం పెరిగి ఇతర రాష్ట్రాల నుంచి 5, 6 లక్షల మంది వచ్చి పని చేసే పరిస్థితి. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి స్థానికులకు 95 శాతం రిజర్వేషన్‌ కల్పించడం ద్వారా మా ఉద్యోగాలు మాకే దక్కాలన్న నినాదాన్ని అమలయ్యేలా చేశాం. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో పెద్ద నోట్ల రద్దు, కరోనా ప్రభావం వల్ల రెండేళ్లు పోయినా తక్కువ కాలంలోనే లక్ష్యాన్ని చేరుకోగలిగాం.

అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించిందంటారా?
అన్ని జిల్లాలను ప్రభుత్వం సమదృష్టితో చూస్తోంది. 33 జిల్లాల్లోనూ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నాం. ఈ సంవత్సరం ఆసిఫాబాద్‌, భూపాలపల్లిలో కూడా మెడికల్‌ కాలేజీలు వచ్చాయి. అంటే మారుమూల ప్రాంతాలకు కూడా వైద్యవిద్య విస్తరిస్తోంది. మిషన్‌ కాకతీయ కింద రాష్ట్రంలోని ప్రతి చెరువును బాగు చేశాం. మిషన్‌ భగీరథ కింద ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి మారుమూల గ్రామానికి తాగునీరు అందించాం. ప్రతి మండలానికి రెండు వరుసల రోడ్డు, రాష్ట్రమంతా నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్నాం. హైటెక్‌ సిటీలో ఏ విధంగా విద్యుత్తు సరఫరా ఉంటుందో ఆదిలాబాద్‌, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌.. ఇలా ఎక్కడైనా ఒకే రకంగా కరెంటు సరఫరా అవుతోంది. 33 జిల్లాల్లోనూ కలెక్టరేట్‌ భవనాలు నిర్మిస్తున్నాం.

పునర్విభజన జరిగి తొమ్మిదేళ్లు పూర్తవుతోంది. విభజన చట్టంలోని అంశాలు ఓ కొలిక్కి రాకపోవడానికి కారణాలేమిటి?
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మొండివైఖరిని అవలంబిస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన ఏ హక్కునూ కోల్పోవడానికి మేం సిద్ధంగా లేం. రాజధానిలోని హెచ్‌వోడీల కార్యాలయాల్లో వాటా కావాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతోంది. విభజన చట్టం ప్రకారం ఎక్కడ ఉన్నవి అక్కడి ప్రభుత్వానికే అని చెప్పారు. కానీ దీనికి భిన్నంగా మొండిగా వాటా అడుగుతున్నారు. న్యాయపోరాటం చేసి రాష్ట్ర ప్రయోజనాలను, హక్కులను కాపాడుకుంటాం. విభజన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదు. ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్రానికి 4000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్తు ఇవ్వాలని చట్టంలో చెప్పారు. తొమ్మిదేళ్లయ్యింది. ఇప్పటివరకు ఒక్క మెగావాట్‌ కూడా ఇవ్వలేదు. కేంద్రం నిర్లక్ష్యం వల్ల, ఆ విద్యుత్తు ప్రాజెక్టు రాకపోవడం వల్ల ఎక్కువ ధరపెట్టి బయట విద్యుత్తు కొనాల్సి వస్తోంది. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు, వరంగల్‌లో కోచ్‌ ఫ్యాక్టరీ ఇలా ఏమీ లేకుండా రాష్ట్రానికి కేంద్రం తీవ్రమైన అన్యాయం చేసింది. ఓ పెద్దన్న పాత్ర పోషించి విభజన సమస్యలను పరిష్కరించడంలో కూడా విఫలమైంది.

రాష్ట్రంలో అవినీతి ఎక్కువగా ఉందని విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి..?
కాంగ్రెస్‌కు, భాజపాకు అవినీతి గురించి మాట్లాడే హక్కులేదు. కాంగ్రెస్‌ హయాంలో ఇసుక విధానమే దీనికి నిదర్శనం. రైతుబంధు కింద రూ.80 వేల కోట్లు ఇస్తే ఇందులో దళారులు ఎక్కడున్నారు? కల్యాణలక్ష్మి కింద నేరుగా రూ.లక్ష చెక్కు ఇస్తున్నాం, ఆసరా కింద రూ.2000 నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమవుతోంది. ఇందులో ఎక్కడైనా అవినీతికి ఆస్కారం ఉందా? ప్రతి రూపాయి లబ్ధిదారులకు చేరేలా ప్రభుత్వం పారదర్శకతతో వ్యవహరిస్తోంది. ప్రతిపక్షాలకు సమస్యలు లేవు. కరెంటు, మంచినీళ్లు, ఇలా దేనిపైనా ఆందోళనకు అవకాశం లేదు. రోడ్లు బాగా లేవని చెప్పడానికి లేదు. రైతులకు ఎరువులు దొరకడం లేదనో, ఇంకో సమస్యో చెబుదాం అంటే అక్కడా అవకాశం లేదు. దీంతో ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతున్నారు. ఎన్నిసార్లు న్యాయస్థానాలకు వెళ్లినా ఒక్కటైనా నిలిచిందా? ప్రతిపక్షాలకు ఒక ఎజెండా లేక.. మమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక దింపుడు కల్లం ఆశలా అవినీతి అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.

వచ్చేఎన్నికల్లో అధికారంలోకి వస్తామని భాజపా, కాంగ్రెస్‌ ధీమా వ్యక్తం చేస్తున్నాయి కదా?
ఆ మాట చెప్పకపోతే వాళ్లకున్న కార్యకర్తలు కూడా జారిపోతారు. అందుకే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. భారాస హ్యాట్రిక్‌ సాధిస్తుంది, మూడోసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్‌కు 50 శాతం స్థానాల్లో, భాజపాకు 75 శాతం స్థానాల్లో అభ్యర్థులే లేరు. మా పార్టీలో చేరండంటూ అందరి ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. కాళ్లు, చేతులు పట్టుకుంటున్నారు. రహస్య సమావేశాలు పెట్టుకొంటున్నారు. పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు కూడా లేని పార్టీలు అధికారంలోకి రావడం కలలో కూడా జరగదు. వాళ్లకి ప్రతిపక్ష హోదా రావడమే కష్టం. కేసీఆర్‌ లాగా రాష్ట్రంపై పూర్తి అవగాహన ఉండి, అన్ని అంశాలపై పట్టు ఉండి, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడెవరున్నారు? కేసీఆర్‌తో సరితూగడం కాదు, ఆయన దరిదాపునకు వచ్చే వారు కూడా ఎవరూ లేరు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అంకితమైన కేసీఆర్‌పైన ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉంది. గతంలో కంటే ఎక్కువ స్థానాలు సాధించడం ఖాయం.

రానున్న రోజుల్లో ఎక్కువగా ఎలాంటి అభివృద్ధి పనులపై దృష్టి సారించబోతున్నారు?
వైద్యకళాశాలలు, నాలుగు సూపర్‌ స్పెషాల్టీ ఆసుపత్రులు, కలెక్టరేట్లను పూర్తి చేస్తాం. రెండువేల పడకలతో నిర్మిస్తున్న వరంగల్‌ హెల్త్‌ సిటీని దసరా లేదా ఏడాది ఆఖరుకు ప్రజలకు అందిస్తాం. మూడు, నాలుగు నెలల్లో పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేసి ప్రజలకు నీళ్లందిస్తాం. సీతారామ ఎత్తిపోతలను త్వరితగతిన అందుబాటులోకి తెస్తాం. 4000 మె.వా. యాదాద్రి అల్ట్రా మెగాపవర్‌ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. విద్య, వైద్యంపై మరింత ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తాం. కరోనా కారణంగా కొంత ఆలస్యమైంది. వచ్చే టర్మ్‌లో ఈ రెండింటి లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్తాం.

వ్యవసాయ రంగంలో అయితే ఎంతో గొప్ప మార్పు సాధించాం. దేశంలోనే అత్యధికంగా వరి సాగు చేసే రాష్ట్రంగా నిలిచాం. వ్యవసాయ వృద్ధిరేటులో దక్షిణాదిలో మొదటి స్థానంలో ఉన్నాం. యాసంగిలో 94 లక్షల ఎకరాల్లో వరి పండితే అందులో 57 లక్షల ఎకరాలు తెలంగాణలోనే 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని