దర్యాప్తు పూర్తయ్యే వరకు గ్రూప్‌-1 పరీక్ష వాయిదా వేయండి!

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి ‘సిట్‌’తోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు పూర్తయ్యేదాకా గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

Updated : 02 Jun 2023 04:59 IST

యూపీఎస్సీ లాంటి సంస్థకు నిర్వహణ బాధ్యత అప్పగించాలి
హైకోర్టులో వేర్వేరుగా 3 పిటిషన్లు
విచారణ 5వ తేదీకి వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి ‘సిట్‌’తోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు పూర్తయ్యేదాకా గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేకాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎస్‌పీఎస్సీ ఈ పరీక్ష నిర్వహించడంపై అభ్యంతరం ఉందని, యూపీఎస్సీ లాంటి మూడో సంస్థకు ఈ బాధ్యతను అప్పగించాలని పిటిషనర్లు కోరారు. గత ఏడాది అక్టోబరులో జరిగిన పరీక్షలను రద్దు చేయడంతోపాటు ఈనెల 11న పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ జారీచేసిన వెబ్‌నోట్‌ను రద్దు చేయాలని కోరుతూ అశోక్‌కుమార్‌ మరో నలుగురు, టి.రమేశ్‌, జె.సుధాకర్‌లు వేర్వేరుగా 3 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గురువారం జస్టిస్‌ కాజా శరత్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. గత ఏడాది పరీక్షలు జరిగాక ప్రశ్నపత్రాలు లీక్‌ అయిన విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న సిట్‌ ఇప్పటికే 49 మంది దాకా అరెస్ట్‌ చేసిందని, ఈ సంఖ్య 100కు చేరవచ్చన్నారు. సిట్‌ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా పరీక్షలు రద్దుచేసి తాజాగా నిర్వహించడానికి టీఎస్‌పీఎస్సీ నిర్ణయించిందన్నారు. లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల పాత్ర కూడా ఉందని.. పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రత్యేక సంస్థకు అప్పగించాలని కోరారు.

ఓవైపు దర్యాప్తు జరుగుతోందని, నిందితులందరూ ఇంకా బయటపడలేదని, అయినా పరీక్ష నిర్వహించడానికి కమిషన్‌ సిద్ధపడుతోందన్నారు. కేవలం ఎన్‌ఆర్‌ఐల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. పరీక్షలకు సంబంధించి 5 లక్షల మంది ఆశావహులున్నారన్నారు. పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ లీకేజీ వ్యవహారంలో 49 మంది ఉద్యోగులు లేరని, కేవలం ఇద్దరు శాశ్వత, ఇద్దరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారన్నారు. దీనికి బాధ్యులైనవారిని సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ, రహస్య విభాగాల పర్యవేక్షణ నిమిత్తం చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ అధికారి, అసిస్టెంట్‌ కంట్రోలర్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు జరిగినట్లు చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 5వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని