‘రెండు వేల’ కళ్లతో నిఘా

తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్‌ జిల్లా(ఛత్తీస్‌గఢ్‌)లో మావోయిస్టు కొరియర్ల నుంచి డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్‌(డీఆర్‌జీ) బృందం ఇటీవల రూ.6 లక్షల విలువైన రూ.2 వేల నోట్లను స్వాధీనం చేసుకుంది.

Published : 03 Jun 2023 05:26 IST

మావోయిస్టుల వద్ద పెద్దనోట్లు భారీగా ఉంటాయనే అనుమానాలు
సరిహద్దు జిల్లాల్లో సానుభూతిపరులపై కన్నేసిన పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్‌ జిల్లా(ఛత్తీస్‌గఢ్‌)లో మావోయిస్టు కొరియర్ల నుంచి డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్‌(డీఆర్‌జీ) బృందం ఇటీవల రూ.6 లక్షల విలువైన రూ.2 వేల నోట్లను స్వాధీనం చేసుకుంది. ఇద్దరు మావోయిస్టు కొరియర్లు వీటిని బ్యాంకులో జమచేసే ప్రయత్నం చేస్తుండగా ఆ బృందం వారిని పట్టుకుంది. బాసగూడకు చెందిన ఆ ఇద్దరి నుంచి 11 బ్యాంకు పాసుపుస్తకాలను స్వాధీనం చేసుకున్న డీఆర్‌జీ బృందం సభ్యులు, వారు అప్పటికే దాదాపు రూ.1.80 లక్షలు వివిధ బ్యాంకుల్లో జమచేసినట్లు గుర్తించారు. ఈ పరిణామంతో తెలంగాణ పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిఘా విస్తృతం చేసి మావోయిస్టు సానుభూతిపరుల కదలికలపై దృష్టి సారించింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి తదితర జిల్లాల సరిహద్దు ప్రాంతాలపై కన్నేసి ఉంచింది.

గత అనుభవాల నేపథ్యంలో

గతంలో ఆర్‌బీఐ రూ.1000 నోట్లను రద్దు చేసినప్పుడు మావోయిస్టులు ఇలాంటి ప్రయత్నాలనే చేశారు. 2016 డిసెంబరులో మహబూబ్‌నగర్‌ జిల్లా మాతంగోడ్‌ గ్రామంలో మావోయిస్టు పార్టీకి చెందిన రూ.12 లక్షల విలువైన పాత నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ముగ్గురు సానుభూతిపరులు పోలీసులకు పట్టుబడ్డారు. ఇప్పుడు కూడా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు జిల్లాల్లోని సానుభూతిపరులకు రూ.10-20 వేల చొప్పున పెద్దనోట్లు ఇచ్చి బ్యాంకుల్లో జమచేయించే ప్రయత్నాల్లో మావోయిస్టులున్నట్లు నిఘా వర్గాలకు సమాచారమందడంతో వారిపై నిఘా పెంచారు. ‘సాధారణంగా మావోయిస్టులకు ఎక్కువగా పెద్దనోట్ల రూపంలోనే విరాళాలు సమకూరుతాయి. సులభంగా తరలించేందుకు వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు, వ్యాపారులు అలాంటి పెద్దనోట్లనే ఇస్తారు. ఉదాహరణకు గత నెల 10న భూపాలపల్లి పోలీసులు కాటారం మండలం గంగారం వద్ద మావోయిస్టు సానుభూతిపరుల నుంచి రూ.76.57 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆ సొమ్ములో సగం వరకు రూ.2వేల నోట్ల రూపంలోనే ఉంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల వద్ద పెద్దనోట్లు భారీగా ఉండి ఉంటాయని అంచనా వేస్తున్నాం. ప్రస్తుత నిర్బంధ పరిస్థితుల్లో ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం కేంద్రంగానే మావోయిస్టుల కార్యకలాపాలు ఎక్కువగా సాగుతున్నాయి. అక్కణ్నుంచి ఉన్న వీలైనన్ని మార్గాల్లో వాళ్లు పెద్దనోట్ల మార్పిడికి ప్రయత్నించవచ్చని అనుమానిస్తున్నాం. ఛత్తీస్‌గఢ్‌ పోలీసులను సమన్వయం చేసుకుంటూ సానుభూతిపరుల్ని ఓ కంట కనిపెట్టే పనిలో ఉన్నాం’ అని ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని