పుడమిని తాకిన శక్తిమంతమైన సౌరతుపాను

ఆరేళ్లలో ఎన్నడూ లేనంత శక్తిమంతమైన సౌర తుపాను తాజాగా భూమిని తాకింది. ఫలితంగా భూ అయస్కాంత క్షేత్రంలో తీవ్ర అవరోధాలు తలెత్తాయని అమెరికా వాతావరణ సంస్థ పేర్కొంది.

Updated : 27 Mar 2024 05:59 IST

వాషింగ్టన్‌: ఆరేళ్లలో ఎన్నడూ లేనంత శక్తిమంతమైన సౌర తుపాను తాజాగా భూమిని తాకింది. ఫలితంగా భూ అయస్కాంత క్షేత్రంలో తీవ్ర అవరోధాలు తలెత్తాయని అమెరికా వాతావరణ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ సౌర తుపాను చుట్టూ ఉన్న పరిస్థితులు బలహీనపడుతున్నాయని, తుపాను మాత్రం ఒక మోస్తరు స్థాయిలో కొనసాగుతోందని తెలిపింది. ఈ సౌర జ్వాల వల్ల భూమిపై కొన్నిచోట్ల హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు విఘాతం కలగొచ్చని చెప్పారు. సుదూరంలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ టవర్లతో సంబంధాలను సాగించడానికి విమానాలు ఈ తరంగాలనే ఉపయోగిస్తుంటాయి. అయితే లోహ విహంగాల్లో చాలావరకూ ఉపగ్రహ ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థను ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తుంటాయి. ఈ సౌరతుపాను వల్ల శాటిలైట్‌ సేవల సంస్థలు తమ ఉపగ్రహాల గమనాన్ని నిశితంగా పరిశీలించడం కష్టం కావొచ్చు. పవర్‌ గ్రిడ్లకు ఇబ్బందులు కలగొచ్చు. ధ్రువ ప్రాంతాల్లో వర్ణరంజితమైన ఆరోరాలు కూడా ఏర్పడతాయని పరిశోధకులు వివరించారు. 11 ఏళ్లకోసారి సూర్యుడి అయస్కాంత తీరుతెన్నులు మారిపోతుంటాయి. ఈ కాలచక్రానికి అనుగుణంగా సౌర చర్యలు కూడా మార్పులకు లోనవుతుంటాయి. ప్రస్తుతం అవి గరిష్ఠ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ దశను ‘సోలార్‌ మ్యాగ్జిమం’గా పేర్కొంటారు. ఈ కాలంలో భూఅయస్కాంత తుపాన్లు ఉత్పన్నమవుతుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని