మహిళా ప్రధానుల భేటీపై జర్నలిస్టు అత్యుత్సాహం.. ఘాటుగా జవాబు..!

ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారిన్‌ న్యూజిలాండ్‌ పర్యటనకు వచ్చారు. ఇందులో భాగంగా ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెన్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.

Published : 02 Dec 2022 00:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యూజిలాండ్‌, ఫిన్లాండ్‌ దేశాల ప్రధానమంత్రులు జెసిండా ఆర్డెన్‌, సనా మారిన్‌ తొలిసారిగా ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. ఇద్దరు మహిళా ప్రధానులు ఇలా భేటీ అవడం ఆసక్తిగా మారింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ జర్నలిస్టు అత్యుత్సాహం ప్రదర్శించగా.. ఇరు దేశాధినేతలు ఘాటుగా బదులిచ్చారు. అసలేం జరిగిందంటే..

ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారిన్‌ న్యూజిలాండ్‌ పర్యటనకు వచ్చారు. ఇందులో భాగంగా ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెన్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం వీరిద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్‌ వారిని విచిత్రమైన ప్రశ్న అడిగారు. ‘‘మీ భేటీపై చాలా మంది ఆశ్చర్యంగా ఉన్నారు. దాదాపు ఒకే వయసు వారు.. ఒకే అభిరుచులు ఉన్న రాజకీయవేత్తలు అయినందున మీరు సమావేశమయ్యారా? లేదా ఈ భేటీతో ఇరు దేశాల మధ్య మరిన్ని ఒప్పందాలు జరిగాయని కివిస్‌ ప్రజలు అంచనా వేయొచ్చా?’’ అని ఆ విలేకరి ప్రశ్నించారు.

దీంతో జెసిండా ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. ‘‘మీరు ఇదే ప్రశ్న బరాక్‌ ఒబామా(అమెరికా మాజీ అధ్యక్షుడు), జాన్‌ కీ(న్యూజిలాండ్‌ మాజీ ప్రధాని)ని అడగ్గలరా? ఒకే వయసు వారు అవడం వల్లే మీరు భేటీ అయ్యారా? అని వారిని ప్రశ్నించగలరా? రాజకీయాల్లో పురుషులే ఎక్కువగా ఉన్నారన్నది వాస్తవమే. కానీ ఇద్దరు మహిళలు సమావేశం అయినప్పుడు.. అది కేవలం మహిళలైనందు వల్లే జరిగిన భేటీ కాదు’’ అని జెసిండా ఘాటుగా బదులిచ్చారు. ఆ తర్వాత సనా మారిన్‌ మాట్లాడుతూ.. ‘‘మేం ఇద్దరం రెండు దేశాలకు ప్రధానమంత్రులం. అందుకే సమావేశమయ్యాం’’ అని చెప్పారు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. జర్నలిస్టుకు సరైన సమాధానమిచ్చారంటూ పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు న్యూజిలాండ్‌ మాజీ ప్రధాని జాన్‌ కీ ఆయనతో పలుమార్లు భేటీ అయ్యారు.

జెసిండా 2017లో న్యూజిలాండ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా.. సనా 2019లో ఫిన్లాండ్‌ పీఎంగా ఎన్నికయ్యారు. ఐరాస గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం 13 దేశాలకు మహిళలు దేశాధినేతలుగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని