Nobel Prize 2022: ‘పౌర హక్కుల పరిరక్షణ’కు.. నోబెల్‌ శాంతి పురస్కారం!

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి.. పౌర హక్కుల కోసం కృషి చేస్తోన్న బెలారస్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్‌ బియాలియాత్‌స్కీతో పాటు రష్యా, ఉక్రెయిన్‌లకు చెందిన మానవ హక్కుల సంస్థలు ‘మెమోరియల్‌’, ‘సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌’కు దక్కింది.

Published : 07 Oct 2022 16:14 IST

ఓస్లో: ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి(Nobel Peace Prize).. పౌర హక్కుల(Human Rights) కోసం కృషి చేస్తోన్న ఓ వ్యక్తితో పాటు రెండు సంస్థలకు వరించింది. బెలారస్‌(Belarus)కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్‌ బియాలియాత్‌స్కీ(Ales Bialiatski)తో పాటు రష్యా, ఉక్రెయిన్‌లకు చెందిన మానవ హక్కుల సంస్థలు ‘మెమోరియల్‌’, ‘సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌’కు సంయుక్తంగా ఈ పురస్కారం అందజేస్తున్నట్లు నోబెల్‌ కమిటీ ప్రకటించింది.

‘పురస్కార గ్రహీతలు.. వారివారి దేశాల్లో పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార పక్షాన్ని విమర్శించే హక్కుతోపాటు పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఏళ్లుగా పోరాడుతున్నారు. హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం, యుద్ధ నేరాల నమోదులో అద్భుత పనితీరు కనబర్చారు. శాంతి, ప్రజాస్వామ్యాలతో కూడిన పౌర సమాజ ప్రాధాన్యాన్ని వారు చాటుతున్నారు’ అని నోబెల్‌ కమిటీ అభిప్రాయపడింది. గతేడాది ఈ పురస్కారం.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం కృషికి చేసిన జర్నలిస్టులు మరియా రెసా(ఫిలప్పీన్స్‌), దిమిత్రి మురాతోవ్‌(రష్యా)లకు దక్కిన విషయం తెలిసిందే.

బెలారస్‌కు చెందిన అలెస్ బియాలియాత్‌స్కీ 1980ల్లో దేశంలో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ప్రారంభించిన వారిలో ఒకరు. ప్రజాస్వామ్యం, శాంతియుత అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారు. 2021 జులై నుంచి జైల్లో ఉన్నారు. మానవ హక్కుల సంస్థ ‘మెమోరియల్’.. రష్యాలో రాజకీయ అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘనలపై సమాచారాన్ని క్రమబద్ధంగా నమోదు చేసింది. కీవ్‌లోని ‘సివిల్ లిబర్టీస్ సెంటర్’.. ఉక్రెయిన్‌లో మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తోంది. పౌర సమాజాన్ని బలోపేతం చేయడంతోపాటు, ఉక్రెయిన్‌ను పూర్తిస్థాయి ప్రజాస్వామ్య దేశంగా మార్చేందుకు పోరాటం చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని