Pak TV: ల్యాప్‌టాప్‌ తెచ్చిన తంటా! 17 మంది ఉద్యోగులను తొలగించిన పాక్‌ టీవీ

పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ లాహోర్ పర్యటనకు సరైన కవరేజీ ఇవ్వడంలో విఫలమైనందుకుగానూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్థాన్ టెలివిజన్(పీటీవీ).. 17 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయడం గమనార్హం. కొత్తగా...

Published : 02 May 2022 01:34 IST

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ లాహోర్ పర్యటనకు సరైన కవరేజీ ఇవ్వడంలో విఫలమైనందుకుగానూ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్థాన్ టెలివిజన్(పీటీవీ).. 17 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. కొత్తగా ఎన్నికైన ప్రధాని షరీఫ్‌ ఏప్రిల్‌ 24న లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలు, రంజాన్ బజార్‌లను సందర్శించారు. అయితే, ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్(ఎఫ్‌టీపీ) ద్వారా సంబంధిత వీడియో ఫుటేజీని అప్‌లోడ్ చేయడానికి అవసరమైన అధునాతన ల్యాప్‌టాప్ అందుబాటులో లేనందున.. పీటీవీ బృందం సరైన కవరేజీని అందించలేకపోయిందని ఓ వార్తాసంస్థ పేర్కొంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం.. రిపోర్టర్‌లు, ప్రొడ్యూసర్‌లతో కూడిన బృందం ప్రధానమంత్రి కవరేజీకి బాధ్యత వహిస్తుంది. లైవ్ స్ట్రీమింగ్, సకాలంలో వీడియో ఫుటేజీల అప్‌లోడ్‌ కోసం వారి వద్ద ల్యాప్‌టాప్‌లు, ఇతర గాడ్జెట్‌లు ఉంటాయి. కానీ, పీటీవీ లాహోర్‌ కేంద్రంలోని సిబ్బంది వద్ద అధునాతన ల్యాప్‌టాప్‌ లేకపోయింది.

పీఎం పర్యటన నేపథ్యంలో.. తమకు ల్యాప్‌టాప్ కావాలని అక్కడి సిబ్బంది ఛానెల్‌ ప్రధాన కార్యాలయాన్ని కోరారు. అంతకుముందు ఏప్రిల్ 18న కూడా ఈ మేరకు ఓ లేఖ రాశారు. ‘లాహోర్ కేంద్రంలో ల్యాప్‌టాప్ ఎడిటింగ్ సదుపాయం లేదు. కాబట్టి, ఓదాన్ని అద్దెకు తీసుకున్నాం. కానీ, సొంత ల్యాప్‌టాప్‌ అత్యవసరం’ అని అందులో పేర్కొన్నారు. అయినా.. యాజమాన్యం పట్టించుకోలేదు. పైగా, మరోసారి అద్దెకు తీసుకోవాలని సూచించింది. దీంతో వారు.. ఓ అధికారి వ్యక్తిగత ల్యాప్‌టాప్‌ తీసుకున్నారు. ప్రధాని కార్యక్రమం కవరేజ్ తర్వాత ఫుటేజీని ఎఫ్‌టీపీ ద్వారా కార్యాలయానికి పంపించేందుకు యత్నించగా.. దాంట్లో బ్యాటరీ అయిపోయింది. ఫలితంగా పీటీవీ స్పాట్‌ దృశ్యాలను ప్రసారం చేయలేకపోయింది. దీంతో.. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన యాజమాన్యం.. వీవీఐపీ కవరేజ్ డిప్యూటీ కంట్రోలర్ ఇమ్రాన్ బషీర్ ఖాన్‌సహా మొత్తం 17 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఇంజినీర్లు, కెమెరామెన్లనూ తొలగించింది. అయితే, కొంతమందిని కాపాడేందుకే తమను బలిపశువులను చేశారని సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగులు ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని