Bullet Train: ప్రాణనష్టం ఎరుగని బుల్లెట్‌

జపాన్‌ అనగానే మనకు గుర్తొచ్చేది బుల్లెట్‌ రైలు. సురక్షిత ప్రయాణం, సమయపాలనకు అవి పెట్టింది పేరు. శరవేగంగా దూసుకుపోతున్నప్పటికీ వాటిలో ప్రమాదాలకు ఆస్కారం ఉండదు.

Updated : 05 Jun 2023 09:29 IST

జపాన్‌ షింకాన్‌సెన్‌ రైళ్ల తీరు అద్భుతం
శరవేగంగా ప్రయాణం.. ఆపదలకు దూరం

జపాన్‌ అనగానే మనకు గుర్తొచ్చేది బుల్లెట్‌ రైలు. సురక్షిత ప్రయాణం, సమయపాలనకు అవి పెట్టింది పేరు. శరవేగంగా దూసుకుపోతున్నప్పటికీ వాటిలో ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. సాంకేతిక వైఫల్యంతో జపాన్‌లో ఇప్పటివరకూ ఒక్క బుల్లెట్‌ ట్రైన్‌ ప్రమాదం కూడా జరగకపోవడం గమనార్హం. ఒడిశాలోని బాలేశ్వర్‌లో రైలు దుర్ఘటన నేపథ్యంలో జపాన్‌ బుల్లెట్‌ రైలు వ్యవస్థ ఎలా నడుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఏమిటీ రైలు?

బుల్లెట్‌ రైలును జపాన్‌లో షింకాన్‌సెన్‌ అని పిలుస్తారు. షింకాన్‌సెన్‌ అంటే జపనీస్‌ భాషలో ‘కొత్త ట్రంక్‌లైన్‌’ అని అర్థం. ఇది నిజానికి హైస్పీడ్‌ రైలు వ్యవస్థ. 1964 అక్టోబరు 1న.. టోక్యో ఒలింపిక్స్‌కు 9 రోజుల ముందు ప్రారంభమైంది. తొలుత టోక్యో నుంచి ఒసాకా మధ్య దీని రాకపోకలు సాగాయి. ప్రస్తుతం జపాన్‌లో షింకాన్‌సెన్‌ నెట్‌వర్క్‌.. 2,700 కిలోమీటర్లకు విస్తరించింది.

* మొదట్లో ఈ రైలు గరిష్ఠ వేగం గంటకు 210 కిలోమీటర్లుగా ఉండేది. ఆ తర్వాత ఇది ఆధునికతను సంతరించుకుంది. ఫలితంగా దీని వేగం గంటకు 300 కిలోమీటర్లకు పెరిగింది. రోజూ లక్షల మందికి ఇదే ప్రయాణ సాధనం.

* గత 60 ఏళ్లలో ఈ రైళ్లవల్ల ప్రాణనష్టం లేకపోవడం వీటి సమర్థతకు నిదర్శనం. రెండు సందర్భాల్లో ఈ రైళ్లు పట్టాలు తప్పినా.. వాటికి సాంకేతిక వైఫల్యం కారణం కాదు. ఈ ఘటనల్లో మరణాలు చోటుచేసుకోలేదు.

భూకంపాన్ని ముందుగానే పసిగట్టి..

జపాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. షింకాన్‌సెన్‌ రూపకర్తలు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. భూకంప మూలస్థానం నుంచి ప్రాథమిక తరంగాలు వెలువడిన వెంటనే ఈ రైల్వే వ్యవస్థ వేగంగా స్పందిస్తుంది. ఆటోమేటిక్‌గా విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తుంది. ఆ వెంటనే రైలులోని ‘పవర్‌ ఫెయిల్యూర్‌ డిటెక్షన్‌ సాధనం’ స్పందించి.. రైలుకు అత్యవసర బ్రేక్‌ వేసి, దాన్ని నిలిపివేస్తుంది. ఇది ప్రయాణికుల ప్రాణాలను, రైలు కీలక మౌలిక వసతులను రక్షిస్తుంది.


అడ్వాన్స్డ్‌ డ్రైవర్‌ సపోర్ట్‌ సిస్టమ్‌

బుల్లెట్‌ రైలుకు సంబంధించిన డ్రైవింగ్‌ యూనిట్‌లో అనేక డిస్‌ప్లే, కమ్యూనికేషన్‌, ఇతర ఆధునిక వ్యవస్థలు ఉంటాయి. అవి.. నియంత్రణ కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ డ్రైవర్‌కు ఎప్పటికప్పుడు పూర్తిస్థాయి సమాచారం అందిస్తాయి. వాటి ఆధారంగా చోదకుడు సకాలంలో నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది.

* షింకాన్‌సెన్‌ వ్యవస్థ.. ‘క్రాష్‌ అవాయిడెన్స్‌’ అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఢీ కొట్టుకోవడానికి అవకాశం లేకుండా దీన్ని రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేక హైస్పీడ్‌ రైల్వే ట్రాక్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ మార్గాల్లో ఎలాంటి లెవల్‌ క్రాసింగ్‌లు ఉండవు. ఆటోమేటిక్‌ ట్రైన్‌ కంట్రోల్‌ (ఏటీసీ) వ్యవస్థ ఎప్పటికప్పుడు రైలును వేయి కళ్లతో పరిశీలిస్తుంది. మితిమీరిన వేగంతో రైలు ప్రయాణించకుండా జాగ్రత్త వహిస్తుంది.

* బుల్లెట్‌ రైళ్లు పట్టాలు తప్పినప్పుడు వాటి బోగీలు.. పక్కనున్న రైల్వే ట్రాక్‌పై పడి ఆ మార్గంలో వచ్చే రైళ్లను ఢీకొట్టే పరిస్థితి తలెత్తకుండా చూసే ఏర్పాటు ఈ వ్యవస్థలో ఉంది.  

* షింకాన్‌సెన్‌ రైలు వ్యవస్థ విశ్వసనీయత చాలా ఎక్కువ. ఒక ట్రిప్‌నకు ఈ రైళ్ల ఆలస్యం.. సరాసరిన ఒక నిమిషం కన్నా చాలా తక్కువే ఉంటుంది. అందువల్ల ప్రయాణికులు సకాలంలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు.


నిరంతర రైలు ఉష్ణోగ్రత పర్యవేక్షణ

ఈ హైస్పీడ్‌ రైల్వే వ్యవస్థలో అనేక సెన్సర్లతో కూడిన నెట్‌వర్క్‌ ఉంటుంది. అది రైలు పట్టాల ఉష్ణోగ్రత, వర్షాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. గాలి తీరుతెన్నులను పరిశీలించడానికి ఎనెమోమీటర్లను ఏర్పాటు చేశారు. ప్రతికూల దిశ నుంచి వీచే గాలి వేగం సెకనుకు 30 మీటర్లు మించితే నియంత్రణ కేంద్రానికి హెచ్చరిక సందేశం వస్తుంది. ఆ వెంటనే సమీపంలోని బుల్లెట్‌ రైలు నిలిచిపోతుంది.


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని