News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 1 (07-08-2022)
Updated : 07 Aug 2022 12:38 IST
1/24
చిత్రంలో కనిపిస్తున్న సైకిల్ పూర్తిగా చెక్కతో తయారు చేయబడింది. సిద్దిపేట గ్రామీణ మండలం చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి నరేశ్చారి, సురేశ్చారి సోదరులు కర్రతో వివిధ రకాల కళాకృతులు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. నరేశ్చారి ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. సురేశ్చారి ఐటీఐ, డిగ్రీ అభ్యసించారు. వారి నాన్న రామచంద్రానికి వడ్రంగి వృత్తిలో సహకారం అందిస్తున్నారు. పనిలో ప్రత్యేకత చాటేలా వీరిద్దరూ ఇప్పటి వరకు 40 రకాల బొమ్మలు, పరికరాలను తయారు చేశారు.
2/24
ఎత్తులో ఉన్న అలుగుపై నుంచి పడుతున్న నీరు చిన్నపాటి జలపాతాన్ని తలపిస్తోంది కదా.. ఇది నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లిలోని జానకీబాయి చెరువు వద్ద దృశ్యం. చుట్టూ దట్టమైన అడవి.. మధ్యలో చెరువు.. 40 అడుగుల ఎత్తుతో దీనికి అలుగు ఉంటుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇక్కడ అలుగు పారుతోంది. పైనుంచి పడుతున్న జలధారలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.
3/24
ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు జలకళను సంతరించుకున్నాయి. చేపలు బయటకు పోకుండా పలు చెరువుల వద్ద జాలర్లు వలలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని పోచారం చెరువు అలుగు వద్ద ఏర్పాటు చేసిన వలలో శనివారం కొండచిలువ చిక్కుకుంది. గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకొన్న వారు కొండచిలువను తీసుకువెళ్లి అటవీప్రాంతంలో వదిలిపెట్టారు.
4/24
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద ఉద్ధృతికి ఆర్మూర్ పట్టణం మామిడిపల్లి రైల్వేగేటు వద్ద రోడ్డు కోతకు గురైంది. పక్కన ఉన్న ఇనుప కడ్డీలు కుంగిపోయాయి. నిత్యం రైల్వే గేటు వేసినప్పుడు, ఇతర సమయాల్లో వందల వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. ఈ సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వాహనం నడిపినా గుంతలో పడే ప్రమాదం ఉంది. సంబంధిత అధికారులు మరమ్మతులు చేయించకుండా కేవలం బండరాళ్లు, తాడు కట్టి చేతులు దులుపుకోవడం గమనార్హం.
5/24
స్వరాష్ట్ర సాధనకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు, ఆరు దశాబ్దాలపాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం, తెలంగాణ సిద్ధాంతకర్త, స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా శనివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్కు చెందిన ప్రముఖ చిత్రకారుడు గుండు శివకుమార్ రావి ఆకుపై జయశంకర్ చిత్రాన్ని మలిచి ఘనంగా చిత్ర నివాళి అర్పించారు.
6/24
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. సింగూరు జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఆలయం వద్ద వరద ప్రవాహం పెరిగింది. శనివారం తెల్లవారుజామున వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అర్చకులు సైతం గర్భగుడిలోకి వెళ్లలేకపోయారు. మధ్యాహ్నానికి వరద కాస్త తగ్గింది. రాజగోపురంలో ప్రతిష్ఠించిన అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగాయి.
7/24
దెబ్బమీద దెబ్బలా...వరసగా కురుస్తున్న భారీ వర్షాలకు కరీంనగర్ జిల్లా గంగాధర, నారాయణపూర్ చెరువుల కట్టలు తెగి పంట పొలాలు నీటమునిగాయి. రహదారులు తెగి ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మూడు వారాల వ్యవధిలోనే వర్షాలు మూడుసార్లు రైతన్నలను ముంచాయి. వరి, పత్తి, ఇతర పంటలు నీట మునిగి నష్టాలను మిగిల్చింది. పంటల్లో ఇసుక మేటలు, రాళ్లతో నిండాయి. పెట్టుబడులూ వర్షార్పణమయ్యాయి. గంగాధరకు చెందిన ఓ రైతు మునిగిన పొలంలో తిరుగుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యమిది...
8/24
అరకు, అనంతగిరి కొండల్లో కురుస్తున్న వర్షాలతో తాటిపూడికి వరదనీరు పోటెత్తుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 297 అడుగులు కాగా శనివారం సాయంత్రానికి 295.90 అడుగులు నమోదైనట్లు ప్రాజెక్టు ఏఈ వి.తమ్మునాయుడు తెలిపారు. 897 క్యూసెక్కుల వరద వస్తోందని, సుమారు 170 క్యూసెక్కుల సాగునీటిని కాలువల ద్వారా విడిచిపెడుతున్నామన్నారు. 296 అడుగులు దాటిన తర్వాత ఉన్నతాధికారుల అనుమతితో జలాశయం దిగువ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి నీటిని విడుదల చేస్తామన్నారు.
9/24
కొన్నేళ్లుగా వాతావరణంలో వస్తున్న మార్పులు మానవాళిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కోనపాపపేట వద్ద కోతకు గురైన సముద్రతీరం ఇది. పదేళ్ల క్రితం 200 మీటర్ల లోపల ఉండే సముద్రం.. ఇప్పుడు ముందుకు దూసుకు రావడంతో తీరంలో ఉన్న కొన్ని ఇళ్లు, హేచరీలు, కట్టడాలు సముద్రంలో కలిసిపోయాయి. అలల తాకిడి ఎక్కువగా ఉన్న సమయంలో సముద్రం నీరు గ్రామంలోకి వస్తుందని గ్రామస్థులు తెలిపారు.
10/24
అవనిగడ్డ మండలం చల్లపల్లి రైతు బజారులో శనివారం పెండలం దుంప ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రైతు బజారులో అమ్మకానికి వచ్చిన ఈ దుంపను పెరటిలో పెంచినట్లు దుకాణదారు చెప్పారు. రెండు అడుగులకుపైగా పొడవు పెరిగింది. 5.45 కిలోల బరువుంది. వినియోగదారులు ఇంత పెద్ద దుంపను ప్రత్యేకంగా చూస్తున్నారు. సహజంగా కిలో, కిలోన్నర ఉండే పెండలం దుంప 5.45 కిలోలు ఉండడంతో పలువురు ఆసక్తితో చూస్తున్నారు.
11/24
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజును మువ్వన్నెల విద్యుద్దీపాలతో అలంకరించారు. రాత్రి సమయంలో వాహనాల రాకపోకల నడుమ బురుజు అందాలు కనువిందు చేస్తున్నాయి.
12/24
కుప్పం పట్టణంలోని శాంతినగర్, కుప్పం-పలమనేరు జాతీయ రహదారి, పట్టణ రోడ్లలో కొందరు యువకులు తమ ద్విచక్రవాహన ముందు చక్రాన్ని గాల్లోకి లేపి నడుపుతున్నారు. ఈ సమయంలో చిన్న పొరపాటు జరిగినా ఎదురుగా వచ్చే అమాయక ప్రజలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి యువతపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అర్బన్ సీఐ శ్రీధర్ను వివరణ కోరగా.. వాహనాల తనిఖీ నిర్వహించి ఇలాంటి సాహసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
13/24
14/24
చిత్రంలో కనిపిస్తోంది కడప-చిత్తూరు జాతీయ రహదారిని ఆనుకుని చెన్నూరు సమీపంలోని హజ్హౌస్ భవనం, రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ముస్లిం సోదరులు హజ్యాత్రకు వెళ్లే క్రమంలో వారి కోసం గత ప్రభుత్వం రూ.27 కోట్లతో నిర్మించింది. దీనిని కరోనా సమయంలో కొవిడ్ ఆసుపత్రిగా వినియోగించారు. మహమ్మారి ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన అనంతరం అందులోని సామగ్రిని కొందరు ఎత్తుకెళ్లడంతో అధికారులు తాళాలు వేశారు. ప్రస్తుతం పిచ్చిమొక్కలు, ముళ్లచెట్లతో భవనం ప్రాంగణం కళాహీనంగా దర్శనమిస్తోంది. ఇటీవల హజ్ కమిటీ సభ్యులు భవనాన్ని తమకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం.
15/24
స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా దిల్లీలో శనివారం నిర్వహించిన తిరంగ ర్యాలీలో భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తున్న భాజపా శ్రేణులు
16/24
పార్లమెంట్ హౌస్లో శనివారం ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ
17/24
అయినవారిని కోల్పోయి కన్నీటి పర్యంతమయ్యే కుటుంబీకులు.. మృతదేహాన్ని ఖననం చేసేందుకు పెద్ద సాహసమే చేస్తున్నారు. కర్నూలు జిల్లా నందవరం మండలం రాయచోటి గ్రామంలో శ్మశాన వాటికకు చేరుకోవాలంటే తుంగభద్ర నదిలోంచి వెళ్లాల్సి వస్తోంది. గతంలో శ్మశానానికి ఉన్న దారిని కొందరు కబ్జా చేశారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఉద్ధృతంగా ప్రవహించే తుంగభద్రలోంచి పాడె మోసుకుంటూ వెళ్తున్నారు. అధికారులు స్పందించి శ్మశాన వాటికకు రహదారి చూపాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.
18/24
ప్రతి వ్యక్తికీ ఓ వాహనం తప్పనిసరైన ప్రస్తుత పరిస్థితుల్లో అప్పో సప్పో తెచ్చి బండి కొనుక్కున్నా దాన్ని నిలిపి ఉంచటానికి మహానగరంలో చోటు దొరకడం గగనమైపోతోంది. అందరూ ఇలా ఇంటి ముందు నిలిపి ఉంచటం వల్ల గల్లీలో అడుగు కూడా పెట్టలేని విధంగా మారిపోతున్నాయి. ఫిలింనగర్లోని ఓ వీధిలో కనిపించిన దృశ్యమిది.
19/24
శునకాలు చక్కగా కునుకు తీస్తోంది ఓ పోలీస్స్టేషన్లో.. అలాగని ఇవేమీ శిక్షణ పొందిన జాగిలాలూ కాదు.. వీటిని పోలీసు సిబ్బంది పోషించడమూ లేదు. నగరంలో వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లతోపాటు ఇప్పుడు ఠాణాల్లోనూ తిష్ఠ వేస్తున్నాయి. వెస్ట్ జోన్ పరిధి నల్లకుంట పోలీస్స్టేషన్లో రాత్రి వేళ నిద్రించాయిలా..
20/24
డబీర్పురలోని బీబీకాఆలంను శనివారం వైతెపా అధ్యక్షురాలు షర్మిల సందర్శించారు. ఆమెకు ముస్లిం పెద్దలు దట్టీ కట్టారు.
21/24
కాకినాడలో వందేమాతర నినాదం మార్మోగింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా శనివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 600 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ర్యాలీ తీశారు. స్థానిక రెండో పట్టణ పోలీస్స్టేషన్ వద్ద నుంచి మొయిన్ రోడ్డు, మసీదు కూడలి, బాలాజీ చెరువు కూడలి మీదుగా జడ్పీ కూడలి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.
22/24
హైదరాబాద్ నగరంలో చాలాచోట్ల గోవులకు మేత వెయ్యకుండా యజమానులు వదిలేస్తున్నారు. ఆహారం కోసం అవి రోడ్లపై సంచరిస్తున్నాయి. వాటిని తప్పించే ప్రయత్నంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొన్నిసార్లు గోవులూ గాయపడుతున్నాయి. అబ్దుల్లాపూర్మెట్ వద్ద జాతీయ రహదారిపై తీసిన చిత్రమిది.
23/24
చార్మినార్కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 5 నుంచి 15 వరకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ఉచిత ప్రవేశానికి తోడు శనివారం కావడంతో ఆరు వేలకు పైగానే సందర్శకులు వచ్చారు.
24/24
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!