News in pics : చిత్రం చెప్పే విశేషాలు (29-03-2024/1)
నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..
Updated : 29 Mar 2024 04:11 IST
1/10
హైదరాబాద్: రాయదుర్గం ఐటీ కారిడార్లోని టీ హబ్ ఎదురుగా ఖాళీ స్థలంలో ఓ విమానంలో హోటల్ పనులు మొదలు పెట్టనున్నారు. ఇలాంటిది శామీర్పేటలో ఒకటి సిద్ధమవుతుండగా ఇది రెండోది. చుట్టూ అద్దాలతో భారీ భవనాలుండగా ఇది ప్రారంభమైతే ఈ ప్రాంగణం మరింత ఆకట్టుకోనుంది.
2/10
హైదరాబాద్: వికారాబాద్ - రాజీవ్నగర్ రహదారిలో వాహనదారులకు భవిష్యత్తులో నీడనందిస్తాయనే ఉద్దేశంతో 30 ఏళ్ల క్రితం మొక్కలు నాటారు. అవి మహా వృక్షాలై ఇప్పుడు దారంతా పచ్చందాలను పంచడమే కాదు చల్లటి నీడను, గాలులను అందిస్తున్నాయి. మండే ఎండల నుంచి పాదచారులకు, వాహనదారులకు ఉపశమనం కలిగిస్తున్నాయి. కాసేపు వాహనాలను ఆపి చోదకులు సేద తీరుతూ వెళ్తున్నారు.
3/10
హైదరాబాద్: వన్యప్రాణులకు నెలవు.. అనంతగిరి అటవీ ప్రాంతం. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. వీటికి తాగు నీటిని అందించేందుకు అటవీ సిబ్బంది సాసర్పిట్లు అక్కడక్కడా ఏర్పాటుచేశారు. అందుబాటులో లేని చోట సమీపంలోని పైప్లైన్ లీకేజీ నీరు, మడుగులు, చిన్నపాటి కాలువల్లో దొరికే నీటిని తాగి దప్పిక తీర్చుకుంటున్నాయి. అందుకు నిదర్శనమే ఈ మర్కట చిత్రాలు.
4/10
ఏలూరు: శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన 1938 సంవత్సరానికి చెందిన పాత రోల్స్ రాయిస్ కారును తిప్పుతున్నారు. తణుకుకు చెందిన గిరి ఈ వాహనాన్ని వేలంలో కొనుగోలు చేసి రాజస్థాన్ నుంచి రప్పించారని చోదకుడు సాధిక్ తెలిపారు. మచిలీపట్నంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో కలపర్రు టోల్గేటు సమీపంలో కనిపించిన చిత్రమిది.
5/10
అనంతపురం: లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం ఖాద్రీశుడు గరుడ వాహనంపై తిరువీధుల్లో విహరించారు. ఉత్సవం సందర్భంగా స్వామివారికి ఆలయంలో ప్రధాన అర్చకులు పార్థసారథి, వసంత ఆచార్యులు ప్రత్యేక పూజలు జరిపారు. పెద్దసంఖ్యలో భక్తులు హాజరై స్వామిని దర్శించుకొని పులకించారు.
6/10
హైదరాబాద్: మధ్యాహ్నం వేళ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. తప్పనిసరి బయటకెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చార్మినార్, నాంపల్లి ప్రాంతాల్లో గురువారం తీసిన చిత్రాలివి.
7/10
మెదక్: హత్నూర మండలం శేర్ఖాన్పల్లిలో దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం భక్తులు బోనాలను ఊరేగింపుగా తీసుకొచ్చి సమర్పించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పూజల్లో పాల్గొన్నారు.
8/10
వరంగల్: జనగామ జిల్లా సరిహద్దు నుంచి జనగామ హనుమకొండ సరిహద్దు వరకు ప్రస్తుతం హైవేకు ఇరువైపులా కిలోమీటరుకు సుమారు 10 వేల చొప్పున మొక్కలు నాటుతున్నారు. పెంబర్తి నుంచి పెండ్యాల వరకు రోడ్డు మధ్యలో నాటిన పూల మొక్కలు రహదారికి పచ్చల తోరణంలా మారింది. పుష్ప సోయగం బాటసారులకు కనువిందు చేస్తోంది.
9/10
హైదరాబాద్: ఓటరుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటివి దూరం పెట్టాలనేది వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. ఖైరతాబాద్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నియోజకవర్గ అధికారులు గురువారం ఇలా వైకుంఠపాళి చిత్రంతో అవగాహన కల్పించారు.
10/10
చిత్తూరు: వేసవి నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణిలో భక్తులు, చిన్నారులు ఉత్సాహంగా పుష్కర స్నానం చేస్తున్నారు. ఒకవైపు ఎండ మరోవైపు తలనీలాలు సమర్పించడంతో భక్తులు ఇబ్బంది పడుతుంటారు. ఈ నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణి స్నానం వారిలో నూతన ఉత్తేజాన్ని నింపుతోంది.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా