గోవులకు గోరోజనం

ఒకసారి దేవతలు ఆకలితో బ్రహ్మ దగ్గరకు వెళ్లారు. వారికి తనివితీరేట్లు అమృతాన్నిచ్చాడు బ్రహ్మ. ఆ పరిమళాన్ని ఆఘ్రాణించిన కామధేనువుకు దూడలు పుట్టాయి.

Updated : 08 Dec 2022 03:34 IST

ఒకసారి దేవతలు ఆకలితో బ్రహ్మ దగ్గరకు వెళ్లారు. వారికి తనివితీరేట్లు అమృతాన్నిచ్చాడు బ్రహ్మ. ఆ పరిమళాన్ని ఆఘ్రాణించిన కామధేనువుకు దూడలు పుట్టాయి. అవి ఆవులై హిమాలయాల్లో తిరుగాడుతుండేవి. ఆ ఆవుల వద్ద దూడలు పాలు తాగుతుండగా వాటి నోటి నుంచి పాలనురుగు గాలికి ఎగిరి తపస్సు చేసుకుంటున్న శివుడి తల మీద పడింది. ఆగ్రహించిన శివుడి మూడో కన్ను తెరుచుకుంది. అందులోంచి నిప్పులు వచ్చాయి. ఆ వేడికి అక్కడ గడ్డి మేస్తున్న ఆవుల శరీరం గోరోజన వర్ణంగా (గోధుమరంగు) మారింది. దూరంగా ఉన్న ఆవులన్నీ అది చూసి భయంతో పారిపోయాయి.

ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మ ‘దేవా! నువ్వు అమృతంతో తడిశావు. ఆవులకు ఎంగిలి లేదు. చంద్రుడు అమృతాన్ని ఇచ్చినట్టుగా ఆవులు పాలు ఇస్తాయి. వాటి దూడలు తాగిన పాలు కూడా పరిశుద్ధమైనవే. కనుక కోపాన్ని విడిచిపెట్టి గో జాతిని రక్షించు’ అంటూ శివుణ్ణి ప్రార్థించి, ఒక బలమైన ఎద్దును కానుకగా ఇచ్చాడు. శివుడు సంప్రీతుడై దాన్ని వాహనంగా చేసుకున్నాడు. తన ధ్వజం పైన కూడా ఆ సంకేతాన్ని పెట్టుకున్నాడు. అలా ఈశ్వరుడు వృషభ కేతనుడు, వృషభ వాహనుడు అయ్యాడు. గోవులు ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగొచ్చు అన్నాడు. తన చూపుతో గోరోజన వర్ణం పొందిన గోవులు మరింత పవిత్రమైనవిగా మన్ననలందుకుంటాయని వరమిచ్చాడు. అందుకే కపిల గోవును దానమివ్వడం మరింత శ్రేష్ఠమంటారు.

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని