alcohol: వయసుకు మద్యం దెబ్బ!

వృద్ధాప్యం త్వరగా మీద పడొద్దని కోరుకుంటున్నారా? అయితే సమతులాహారం తినటం, వ్యాయామం చేయటం మీదే కాదు.. మద్యం అలవాటుంటే తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది.

Updated : 31 Dec 2022 16:41 IST

వృద్ధాప్యం త్వరగా మీద పడొద్దని కోరుకుంటున్నారా? అయితే సమతులాహారం తినటం, వ్యాయామం చేయటం మీదే కాదు.. మద్యం అలవాటుంటే తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. మద్యం వృద్ధాప్య ప్రక్రియ మీద చాలా రకాలుగా ప్రభావం చూపుతుంది మరి. వయసు మీద పడుతున్నకొద్దీ ఆయా అవయవాలను, మానసిక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇలా త్వరగా వృద్ధాప్య ఛాయలు ముంచుకొచ్చేలా చేస్తుంది.

నీటిశాతాన్ని తగ్గిస్తూ..

కారణమేంటో స్పష్టంగా తెలియదు గానీ వయసు మీద పడుతూ వస్తున్నకొద్దీ ఒంట్లో నీరు తగ్గిపోతూ ఉంటుంది. దాహం వేయటమూ తగ్గుతుంటుంది. అందుకే వృద్ధులకు శరీరంలో నీటి శాతం తగ్గే ముప్పు ఎక్కువ. దీనికి మద్యం తోడైతే అగ్నికి ఆజ్యం తోడైనట్టే. ఎందుకంటే మద్యం ఒంట్లోంచి మరింత ఎక్కువ నీరు బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది. శరీరంలో నీరు తగ్గితే నీరసం, నిస్సత్తువ వంటివి తలెత్తుతాయి. ముఖకళ కూడా తగ్గుతుంది.

చర్మాన్ని పొడిబారిస్తూ..

వయసు మీద పడుతున్నకొద్దీ మన చర్మం పలుచగా అవుతుంది. పొడిబారుతూ వస్తుంది. చర్మం కింద కొవ్వు తగ్గుతూ వస్తుంది. ఇది ముడతలు పడటానికి దారితీస్తుంది. ఇదంతా సహజంగా జరిగేదే. దీన్నే అంతర్గత వృద్ధాప్య ప్రక్రియ అంటారు. అయితే ఇదొక్కటే కాదు.. చుట్టుపక్కల పరిసరాలు, వాతావరణం, జీవనశైలి వంటి బయటి అంశాలతోనూ చర్మం ముడతలు పడొచ్చు. మద్యం మూలంగా ఒంట్లో నీటిశాతం తగ్గి, చర్మం ముడతలు పడటం మరింత ఎక్కువవుతుంది.

కీలక అవయవాలను దెబ్బతీస్తూ..

మద్యంతో కాలేయం గట్టిపడే (సిరోసిస్‌) ముప్పు ఎక్కువ. ఒక మాదిరిగా తాగినా కాలేయం మీద విపరీత ప్రభావం చూపుతుంది. కాలేయానికి కొవ్వు పట్టటం వంటి సమస్యలకు దారితీస్తుంది. కిడ్నీల పనితీరునూ దెబ్బతీస్తుంది. ఇలాంటి కీలక అవయవాల సామర్థ్యం మందగిస్తే వృద్ధాప్య సమస్యలు ఇంకాస్త త్వరగా దాడిచేస్తాయి.

మెదడును మొద్దుబారుస్తూ..

వేసే ప్రతి మద్యం గుటక నేరుగా మెదడులోకి వెళ్తుందన్నా అతిశయోక్తి కాదు. దీర్ఘకాలంగా అతిగా మద్యం తాగితే మెదడు కణాలు కుంచించుకపోయే ప్రమాదముంది. మద్యంతో ముడిపడిన మెదడు క్షీణతకు దారితీస్తుంది. కొన్నిరకాల డిమెన్షియాకూ కారణమవుతుంది. దీంతో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోలేకపోవటం, పనుల్లో క్రమబద్ధత లోపించటం, ఏకాగ్రత కుదరకపోవటం, భావోద్వేగాలపై పట్టు తప్పటం, కోపం రావటం వంటి లక్షణాలు పొడసూపుతాయి.

నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తూ..

క్షయ, న్యుమోనియా వంటి ప్రాణాంతక సమస్యలతో శరీరం పోరాడే తీరు మీద మద్యం విపరీత ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వృద్ధులకిది తీవ్రంగా పరిణమిస్తుంది. దీనికి కొంతవరకు మద్యంతో కాలేయం దెబ్బతినటం కారణం కావొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది ఆరోగ్యంగా ఉన్న కణజాలం మీద రోగనిరోధక వ్యవస్థ దాడిచేసేలా పురికొల్పుతుండొచ్చని అనుకుంటున్నారు.

త్వరగా మత్తు కలిగిస్తూ..

వృద్ధాప్యంలో కండరాలు క్షీణిస్తుంటాయి. ఒంట్లో కొవ్వు మోతాదు ఎక్కువవుతుంది. దీంతో శరీరం మద్యాన్ని విచ్ఛిన్నం చేసి, బయటకు వెళ్లగొట్టటానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే వృద్ధాప్యంలో మద్యం చాలా త్వరగా మత్తు ఎక్కేలా చేస్తుంది. మర్నాడు తలనొప్పి వంటి ఇబ్బందులకూ దారితీస్తుంది.

జబ్బులను సంక్లిష్టం చేస్తూ..

వయసు మీద పడుతున్నకొద్దీ ఎముకలు గుల్లబారటం, మధుమేహం, అధిక రక్తపోటు, పక్షవాతం, జీర్ణాశయ పుండ్లు, క్యాన్సర్‌, మతిమరుపు వంటి జబ్బుల ముప్పు పెరుగుతూ వస్తుంది. మద్యంతో ఇది మరింత ఎక్కువవుతుంది. అంతేకాదు.. ఇలాంటి జబ్బులు తీవ్రమయ్యేలా కూడా చేస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

మందులను ఏమారుస్తూ..

వయసు మీద పడుతున్నకొద్దీ మద్యం శరీరంలో ఎక్కువసేపు ఉంటుంది. వేసుకునే మందులపై ఇది విపరీత ప్రభావం చూపుతుంది. తీవ్ర దుష్ప్రభావాలకూ దారితీయొచ్చు. ఉదాహరణకు- ఆస్ప్రిన్‌ వేసుకున్నప్పుడు మద్యం తాగితే పొట్టలో ఇబ్బందులు తలెత్తొచ్చు, లోపల రక్తస్రావం జరగొచ్చు. కొన్నిరకాల నిద్ర మాత్రలు, నొప్పి మందులు, ఆందోళన మందులతో కలిసిపోయి ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు.

తేలికగా కింద పడేలా చేస్తూ..

వృద్ధులకు ఎముకలు తేలికగా విరిగే ప్రమాదముంది. అతిగా మద్యం తాగే అలవాటు గలవారికి దీని ముప్పు పెరుగుతుంది. ఎందుకంటే మద్యంతో శరీరం నియంత్రణ మీద పట్టు తప్పుతుంది. నిర్ణయం తీసుకోవటమూ అస్తవ్యస్తమవుతుంది. మద్యం అలవాటుతో క్రమంగా మెదడులోని సెరిబెల్లం కూడా దెబ్బతింటుంది. శరీర నియంత్రణ, సమన్వయంలో పాలు పంచుకునేది ఇదే.

నిద్ర పట్టకుండా చూస్తూ..

మద్యంతో మొదట్లో మత్తుగా అనిపించటం నిజమే. కానీ దీని ప్రభావం తగ్గాక నిద్ర నుంచి మెలకువ వచ్చేలా చేస్తుంది. తిరిగి నిద్ర పట్టటమూ కష్టమవుతుంది. మామూలుగానే వృద్దులు నిద్ర సమస్యలతో బాధపడుతుంటారు. దీనికి మద్యం తోడైతే ఇవింకా తీవ్రమవుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని