మళ్లీ పసివాళ్లకు మిస్సీ గండం

అదే పునరావృతమవుతోంది. అదే భయం నిజమవుతోంది. కొవిడ్‌-19 ఉద్ధృతి తగ్గిన తర్వాత పిల్లల్లో మొదలయ్యే వివిధ అవయవాల వాపు రుగ్మత ‘ఎంఐఎస్‌-సి’ (మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌- మిస్సీ) రెండో దశలోనూ విజృంభిస్తోంది. అదీ తొలిదశ కన్నా మరింత ఎక్కువగా. లక్షణాలు ఇతర జబ్బులను తలపిస్తుండటంతో

Updated : 01 Jun 2021 06:06 IST

కొవిడ్‌-19 - ఎంఐఎస్‌-సి

అదే పునరావృతమవుతోంది. అదే భయం నిజమవుతోంది. కొవిడ్‌-19 ఉద్ధృతి తగ్గిన తర్వాత పిల్లల్లో మొదలయ్యే వివిధ అవయవాల వాపు రుగ్మత ‘ఎంఐఎస్‌-సి’ (మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌- మిస్సీ) రెండో దశలోనూ విజృంభిస్తోంది. అదీ తొలిదశ కన్నా మరింత ఎక్కువగా. లక్షణాలు ఇతర జబ్బులను తలపిస్తుండటంతో దీన్ని గుర్తించటమూ కష్టమైపోతోంది. వేరే చికిత్సలు చేస్తుండటమూ కనిపిస్తోంది. ఇది చిన్నారులకు పెద్ద ప్రమాదాన్నే తెచ్చిపెడుతోంది. అదృష్టవశాత్తు మిస్సీకి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కచ్చితంగా నిర్ధరించటం.. సరైన సమయంలో సరైన చికిత్స అందించటమే చేయాల్సింది.
కంచె చేనును మేస్తే? ఇక కాపాడేదెవరు? కొవిడ్‌-19 పిల్లలను ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే పడేస్తోంది. జబ్బు నుంచి కాపాడే యాంటీబాడీలను విపరీతంగా పుట్టించి, శరీరానికి ఎదురు తిరిగేలా చేస్తోంది. సాధారణంగా ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ తగ్గాక గానీ టీకా వేసుకున్నాక గానీ ఒంట్లో నిర్వీర్య (న్యూట్రలైజింగ్‌) యాంటీబాడీలు పుట్టుకొస్తాయి. మళ్లీ ఎప్పుడైనా అవే బ్యాక్టీరియా, వైరస్‌లు దాడిచేస్తే ముందుండి ఎదుర్కొనేవి, వాటిని నిర్వీర్యం చేసేవి ఇవే. ఇలా ఆయా ఇన్‌ఫెక్షన్ల నుంచి జీవితాంతం కాపాడుతూ వస్తుంటాయి. మామూలుగానైతే కొవిడ్‌ యాంటీబాడీ పరీక్ష చేస్తే నిర్వీర్య యాంటీబాడీలు 30-50 వరకు కనిపిస్తుంటాయి. కానీ కొవిడ్‌ తగ్గిన తర్వాత (లక్షణాలు తలెత్తకపోయినా కూడా) పిల్లల్లో ఈ యాంటీబాడీల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కొందరు పిల్లల్లో 100 కన్నా మించిపోతున్నాయి. దీనికి కారణం పిల్లల్లో యాంటీబాడీల ప్రతిస్పందన ఉద్ధృతంగా ఉండటమే. నిజానికి పిల్లల్లో రోగనిరోధకశక్తి పూర్తి స్థాయిలో రూపొందదు. కానీ రోగనిరోధక ప్రతిస్పందన మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరిలో టీకాలు సమర్థంగా పనిచేస్తుంటాయి. చిన్న వయసులోనే టీకాలు ఇవ్వటానికి కారణమూ ఇదే. అయితే కొవిడ్‌-19 బారినపడ్డ పిల్లల్లో జబ్బు తగ్గిన తర్వాత యాంటీబాడీల సంఖ్య అనూహ్యంగా, విపరీతంగా పుట్టుకొస్తుండటమే మిస్సీకి దారితీస్తోంది. యాంటీబాడీలు ఆయా అవయవాల్లో వాపు ప్రక్రియను ప్రేరేపిస్తూ రకరకాల ఇబ్బందులకు బీజం వేస్తున్నాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే- కొవిడ్‌ తగ్గిన తర్వాత 2-3 వారాల నుంచి 2-3 నెలల వరకు మిస్సీ తలెత్తే అవకాశముండటం. కాబట్టి పిల్లల్లో ఎలాంటి అనుమానాస్పద లక్షణాలు కనిపించినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. జబ్బు తీరుతెన్నులు, లక్షణాలు, చికిత్సలపై ప్రజలతో పాటు డాక్టర్లకూ అవగాహన అత్యవసరం.
మూడు రకాలుగా..
మిస్సీలో మూడు రకాలున్నాయి. 1. టాక్సిక్‌ షాక్‌ సిండ్రోమ్‌. ఉన్నట్టుండి దాడి చేసే ఇందులో రక్తపోటు బాగా పడిపోతుంది. గుండె వేగం, ఆయాసం పెరుగుతాయి. చివరికి పిల్లలు షాక్‌లోకి వెళ్లిపోతారు. 2. గుండె పనితీరు మందగించటం. మామూలుగా గుండె పంపింగ్‌ సామర్థ్యం 70% వరకు ఉండాలి. వీరిలో ఇది 40% కన్నా తక్కువకు పడిపోతుంది. దీంతో తగినంత రక్తం సరఫరా కాదు. గుండె చుట్టూ నీరు చేరుతుంది (పెరికార్డియల్‌ ఎఫ్యూజన్‌). ఊపిరితిత్తుల్లో, కడుపులోనూ నీరు చేరుతుంది. రక్తపోటు, గుండె వేగం తగ్గిపోవటంతో పాటు ఆయాసమూ ఎక్కువగా వేధిస్తుంది. 3. కవాసాకి మాదిరి జబ్బు. ఇందులో శరీరమంతా దద్దు, నొప్పులు తలెత్తుతాయి. కళ్లు, పెదాలు, నోరు ఎర్రగా అవుతాయి. పెదాలు పగిలిపోతుంటాయి. చిన్న పిల్లలు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. కాస్త పెద్ద పిల్లలైతే చిరాకు పడుతుంటారు. స్కాన్‌ చేస్తే కొందరిలో గుండె రక్తనాళాలు అక్కడక్కడా ఉబ్బిపోయి (అన్యూరిజమ్‌) కనిపిస్తాయి.  

ఇతర జబ్బుల మాదిరిగానూ..
మిస్సీలో లింఫ్‌ గ్రంథులు, సూక్ష్మ రక్తనాళాలు ఎక్కువగా ప్రభావితం అవుతుండటం వల్ల ఇతరత్రా జబ్బులుగా పొరపడేలా చేస్తోంది. అపెండిక్స్‌ వాపు, పేగుల్లో లింఫ్‌ గ్రంథుల వాపు (మిసెంట్రిక్‌ లింఫాడెనైటిస్‌), జీర్ణకోశవ్యవస్థ వాపు (గ్యాస్ట్రైటిస్‌) మాదిరిగానూ కనిపిస్తోంది. దీంతో వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటివి బయలుదేరుతున్నాయి. అపెండిక్స్‌ వాపుగా భావించి, శస్త్రచికిత్స చేయిస్తున్నవారూ లేకపోలేదు. ఏడాదిలోపు పిల్లల్లో మూత్ర ఇన్‌ఫెక్షన్‌నూ తలపిస్తోంది. వీరిలో మూత్రంలో చీము కణాలు పెద్దమొత్తంలో ఉంటున్నాయి. మూత్రాశయం గోడల్లో వాపు తలెత్తి, ఎర్రగా అవుతుంది. ఇన్‌ఫెక్షన్‌ లేకపోవటం వల్ల మూత్రంలో మంట వంటి ఇబ్బందులేవీ ఉండవు. దీన్నే స్టెరైల్‌ పయూరియా అనీ అంటారు. కొందరిలో మలద్వారం చుట్టూరా ఎర్రగా అయ్యి, చర్మం ఊడిపోవటమూ (పెరియానల్‌ ఎక్స్‌కోరియేషన్‌) కనిపిస్తోంది. మలంలో ఆమ్లగుణం పెరగటం, బ్యాక్టీరియా సంబంధ విషతుల్యాలు దీనికి కారణం కావొచ్చు. కొందరు పిల్లల్లో కాలేయ ఎంజైమ్‌లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగని  కాలేయం వాపు (హెపటైటిస్‌) గానీ ఇన్‌ఫెక్షన్‌ గానీ ఏమీ ఉండవు. మామూలుగా రాళ్లు ఏర్పడినప్పుడు పిత్తాశయం వాపు (కొలిసిస్టైస్‌) తలెత్తుతుంటుంది. కానీ కొందరిలో రాళ్లు లేకుండానే పిత్తాశయం పూర్తిగా పైత్యరసంతో నిండిపోయి, వాపు తలెత్తుతోంది.


ఎప్పుడు అనుమానించాలి?

కొవిడ్‌లో జ్వరం అంతగా రాకపోయి ఉండొచ్చు గానీ మిస్సీలో 101-104 డిగ్రీల ఫారన్‌హీట్‌ వరకు జ్వరం ఉండొచ్చు. ఇది విడవకుండా వేధించొచ్చు. అందువల్ల ఇంట్లో ఎవరికైనా కొవిడ్‌ వచ్చి తగ్గినా.. పిల్లలకు కొవిడ్‌ వచ్చి, తగ్గిన తర్వాతనైనా అకారణంగా తీవ్ర జ్వరం మొదలైతే మిస్సీయేమోనని అనుమానించాలి. చిరాకు, హఠాత్తుగా స్పహ తప్పటం, ఉన్నట్టుండి ఆయాసం రావటం వంటి లక్షణాలు కనిపిస్తే తాత్సారం చేయొద్దు. వీరిలో ప్రొటీన్‌ తగ్గిపోయి కాళ్లలో నీరు చేరొచ్చు. ఇది కాళ్ల వాపులకు దారితీస్తుంది. నాలుగేళ్ల లోపు చిన్నారుల్లో ఇది ఎక్కువ. కాబట్టి కాళ్ల వాపులు గమనిస్తే నిర్లక్ష్యం పనికిరాదు. శరీరం మీద దద్దు, నాలుక, పెదాలు ఎర్రగా అయ్యి పెదాలు పగిలిపోయినా, కళ్లు ఎర్రబడినా మిస్సీగా అనుమానించాలి.


కచ్చితంగా నిర్ధరిస్తేనే..

ఇతరత్రా జబ్బులను పోలి ఉంటుండటంతో మిస్సీని కచ్చితంగా నిర్ధరణ చేయటం చాలా ముఖ్యం. ఇందుకు కొన్ని పరీక్షలు ఉపయోగపడతాయి. ఇవి చికిత్స తీరుతెన్నులను నిర్ణయించుకోవటానికీ సాయం చేస్తాయి.
ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష: నిజానికి మిస్సీ కొవిడ్‌ తగ్గిన తర్వాత మొదలయ్యేదే అయినా కొందరికి కొవిడ్‌ ఉన్నప్పుడూ ఆరంభం కావొచ్చు. అందువల్ల ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయటం మంచిది.
యాంటీబాడీ పరీక్ష: మిస్సీని అనుమానిస్తే యాంటీబాడీ పరీక్ష తప్పనిసరి. ఐజీజీ, ఐజీఎం.. రెండింటిలో ఏది పాజిటివ్‌గా ఉన్నా కొవిడ్‌ వచ్చిపోయిందనే అర్థం. వీటి సంఖ్య విపరీతంగా పెరిగినట్టు తేలితే మిస్సీగానే భావించాలి.
హిమోగ్లోబిన్‌: మిస్సీ బారినపడ్డ పిల్లల్లో హిమోగ్లోబిన్‌ మోతాదులు తక్కువగా ఉండొచ్చు.
ప్లేట్‌లెట్లు: ఇవి తగ్గొచ్చు, పెరగొచ్చు. షాక్‌ సిండ్రోమ్‌, కవాసాకి మాదిరి జబ్బు ఆరంభంలో (అక్యూట్‌ దశలో) ప్లేట్‌లెట్లు తక్కువగా ఉంటాయి. ఆ తర్వాత పెరుగుతూ వస్తుంటాయి. ప్లేట్‌లెట్లు తగ్గినప్పుడు లక్షణాలు చాలా తీవ్రంగా వేధిస్తాయి. ప్లేట్‌లెట్లు ఎక్కువున్నప్పుడు గుండెలోని రక్తనాళాలు ఉబ్బిపోవచ్చు (ఎన్యూరిజమ్‌).
అల్బుమిన్‌, గ్లోబులిన్‌ నిష్పత్తి: మామూలుగా అల్బుమిన్‌ ఎక్కువగా, గ్లోబులిన్‌ తక్కువగా ఉంటాయి. కానీ మిస్సీలో అల్బుమిన్‌ తగ్గుతుంది. గ్లోబులిన్‌ పెరుగుతుంది.
సీఆర్‌పీ: వాపు ప్రక్రియ తీవ్రతను తెలిపే ఇది చాలా ముఖ్యమైన పరీక్ష. ఇది మామూలుగా 3 ఎంజీ/డీఎల్‌ కన్నా తక్కువగా ఉండాలి. మిస్సీ తలెత్తినవారిలో 60 ఎంజీ కన్నా మించిపోతోంది. కొందరు పిల్లల్లో 100 కూడా దాటిపోతోంది.
ఈఎస్‌ఆర్‌: ఎరిత్రోసైటిక్‌ సెడిమెంటేషన్‌ రేటు పెరుగుతుంది. ఇది పెరిగితే వాపు ప్రక్రియ ఉందనే అర్థం. తగ్గుతుంటే చికిత్స బాగా పనిచేస్తున్నట్టే.
డీడైమర్‌: మామూలుగా దీని స్థాయులు ఆయా ప్రమాణాలను బట్టి 0.5 లేదా 500 కన్నా తక్కువగా ఉండాలి. మిస్సీ గలవారిలో ఇది 3-5 రెట్లు ఎక్కువగా ఉంటోంది. డీడైమర్‌ పెరిగితే రక్తం గడ్డకట్టే ముప్పు ఎక్కువవుతుంది.  
ఫెరిటిన్‌: ఒంట్లో వాపు ప్రక్రియ తలెత్తితే రక్తంలో ఫెరిటిన్‌ మోతాదులూ పెరుగుతాయి. మిస్సీలో దీని స్థాయులూ ఎక్కువవుతాయి. అంటే వాపు ప్రక్రియ ఎక్కువగా ఉందనే అర్థం.
ఐఎల్‌6: యాంటీబాడీల ప్రతిస్పందన, వాపు ప్రక్రియ తీరుతెన్నులను తెలుసుకోవటానికిది ఉపయోగపడుతుంది. మిస్సీలో ఐఎల్‌6 చాలా ఎక్కువగా ఉంటుంది.
ప్రొ-బీఎన్‌పీ: గుండె కష్టపడి పనిచేయాల్సి వచ్చినప్పుడు గుండెలోని గ్రాహకాలు సాగిపోతాయి. దీంతో రక్తంలోకి బీఎన్‌పీ ఎక్కువగా విడుదలవుతుంది.
ఈసీజీ: ఇందులో గుండె వేగం పెరిగినట్టు, వోల్టేజ్‌లు తగ్గినట్టు కనిపిస్తుంది. రీపోలరైజేషన్‌ మార్పులు కనిపిస్తాయి.


చికిత్స: ఆయా సమస్యలను బట్టి

షాక్‌ సిండ్రోమ్‌కు గురైన పిల్లలను వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాలి. ముందుగా రక్తపోటు పెంచటం ముఖ్యం. ఇందుకు అడ్రినలిన్‌, నార్‌అడ్రినలిన్‌ ఉపయోగపడతాయి. అలాగే సెలైన్‌ ఎక్కించాలి. గుండె పనితీరు మందగించిన వారికి ముందుగా మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే ప్రూసిమైడ్‌ (లాసిక్స్‌) ఇస్తారు. గుండె పనితీరు పుంజుకోవటానికి డోబుటమైన్‌, మిల్రనోన్‌, అడ్రినలిన్‌ ఉపయోగపడతాయి. కవాసాకి మాదిరి రుగ్మత గలవారికి ముందుగా జ్వరం తగ్గటానికి పారాసిటమాల్‌ ఇస్తారు. సెలైన్‌ ఎక్కిస్తారు.
స్టిరాయిడ్లు ప్రత్యేకం: షాక్‌ సిండ్రోమ్‌, గుండె పనితీరు మందగించటం, కవాసాకి మాదిరి జబ్బు.. వీటిల్లో దేనికైనా అవసరాన్ని బట్టి మిథైల్‌ ప్రెడ్నిసోలోన్‌ స్టిరాయిడ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని శరీర బరువును బట్టి ప్రతి కిలోకు 1-2 మి.గ్రా చొప్పున 3-5 రోజులు ఇస్తారు. అదే షాక్‌కు గురైనా, గుండె పనితీరు మందగించినా పల్స్‌డ్‌ మిథైల్‌ ప్రెడ్నిసోలోన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని ప్రతి కిలో శరీర బరువుకు 30 మి.గ్రా. చొప్పున ఇస్తారు. పల్స్‌డ్‌ మిథైల్‌ ప్రెడ్నిసోలోన్‌తో దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్తగా గమనిస్తూ ఇవ్వాలి.
గామా గ్లోబులిన్‌: షాక్‌ సిండ్రోమ్‌, గుండె పనితీరు మందగించటం, కవాసాకి మాదిరి జబ్బు.. మూడింటిలోనూ ప్రతి కిలో శరీర బరువుకు 2 గ్రాముల గామా గ్లోబులిన్‌ ఇవాల్సి ఉంటుంది. ఒకసారి ఇస్తే సరిపోతుంది. మాటిమాటికి అవసరం లేదు. దీన్ని 2 గ్రాముల మోతాదులో  ఒకేసారి ఇవ్వచ్చు. లేదంటే ఒక గ్రాము చొప్పున రెండు రోజులు ఇవ్వచ్చు.
మోనోక్లోనల్‌ యాంటీబాడీలు: ఒకవేళ సమస్య తీవ్రమైనా, సంప్రదాయ చికిత్సలతో ఫలితం కనిపించకపోయినా టొసిలిజుమాబ్‌ లేదా ఇన్‌ఫ్లిక్స్‌మాబ్‌ అనే మోనోక్లోనల్‌ యాంటీబాడీలు అవసరమవుతాయి.  
అనంతరం ఆస్ప్రిన్‌: రెండు రోజుల పాటు మిస్సీ చికిత్స చేశాక ప్రతి కిలో శరీర బరువుకు 30-50 మి.గ్రా. చొప్పున ఆస్ప్రిన్‌ ఇస్తారు.  దీన్ని రెండు వారాల వరకు కొనసాగించాల్సి ఉంటుంది. అనంతరం ఆస్ప్రిన్‌ మోతాదు తగ్గిస్తారు. ప్రతి కిలోకు 2-3 మి.గ్రా. చొప్పున ఆరు వారాల పాటు ఇస్తారు. గుండె రక్తనాళాలు ఉబ్బినవారికైతే తగ్గేంతవరకు ఆస్ప్రిన్‌ అవసరమవుతుంది.
వార్ఫారిన్‌: గుండె పెద్ద రక్తనాళాల్లో  ఉబ్బు తగ్గకపోతే జీవితాంతం రక్తాన్ని    పలుచగా చేసే వార్ఫారిన్‌ వంటి మందులు వేసుకోవాల్సి ఉంటుంది.


జాగ్రత్తలు తప్పనిసరి

మిస్సీ నయమైన తర్వాతా ఆరు వారాల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరికి రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడొచ్చు. మళ్లీ న్యుమోనియా రావొచ్చు. ఇతరత్రా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. కాబట్టి ఏదైనా అనుమానం వచ్చినా, జలుబు మాదిరి లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
* మిస్సీ నుంచి కోలుకున్నవారిలో రక్తహీనత, ప్రొటీన్ల లోపం ఉండొచ్చు. కాబట్టి తగినన్ని ప్రొటీన్లు, విటమిన్లు లభించే ఆహారం ఇవ్వాలి. అన్ని రకాల పండ్లు తినిపించాలి. మాంసాహారులైతే గుడ్లు, మాంసం, చికెన్‌ పెట్టొచ్చు.
* బీ కాంప్లెక్స్‌, విటమిన్‌ సి, విటమిన్‌ డి, జింక్‌, క్యాల్షియం మాత్రలు, సిరప్‌లు తప్పకుండా ఇవ్వాలి.
* కనీసం మూడు నెలల వరకు ఎలాంటి టీకాలూ ఇప్పించకూడదు.
* రక్తనాళాలు ఉబ్బినవారిని వేగంగా పరుగెత్తనివ్వద్దు. కష్టమైన ఆటలు ఆడనివ్వద్దు. ఉబ్బినచోట రక్తనాళం చిట్లిపోవచ్చు. రక్తం గడ్డ కట్టొచ్చు. ఇది తీవ్ర ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే అవసరమైతే ఆరు నెలల తర్వాత సీటీ స్కాన్‌ లేదా యాంజియోగ్రామ్‌, ట్రెడ్‌మిల్‌ పరీక్షలు చేస్తారు. వీటి ఫలితాలను బట్టి ఆటలు ఆడొచ్చా? లేదా? అన్నది డాక్టర్లు నిర్ణయిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని