గర్భిణులకు హైబీపీ చికిత్స సురక్షితమే

గర్భిణులకు అధిక రక్తపోటు ఉంటే మందులు ఇవ్వాలా? వద్దా? అనేది చాలాకాలంగా సందిగ్ధంగానే ఉండిపోయింది. రక్తపోటు తగ్గించే మందులు పిండం మీద దుష్ప్రభావాలు చూపొచ్చని అనుమానించటమే దీనికి కారణం

Updated : 21 Dec 2021 06:13 IST

ర్భిణులకు అధిక రక్తపోటు ఉంటే మందులు ఇవ్వాలా? వద్దా? అనేది చాలాకాలంగా సందిగ్ధంగానే ఉండిపోయింది. రక్తపోటు తగ్గించే మందులు పిండం మీద దుష్ప్రభావాలు చూపొచ్చని అనుమానించటమే దీనికి కారణం. అయితే గర్భిణుల్లో చాలామందికి అధిక రక్తపోటు చికిత్స సురక్షితమేనని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ (ఏహెచ్‌ఏ) తాజాగా పేర్కొంది. ఇది తల్లికి అధిక రక్తపోటు తీవ్రం కాకుండా చూస్తుందని.. పిండానికి, పుట్టిన తర్వాత శిశువులకు ముప్పేమీ పెరగకపోవచ్చని తెలిపింది. గర్భిణుల్లో రక్తపోటును సూచించే పై అంకె (సిస్టాలిక్‌ ప్రెషర్‌) 140, అంతకన్నా ఎక్కువుంటే అధిక రక్తపోటుగా భావిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా గర్భిణుల మరణాలకు రెండో అతిపెద్ద కారణమిదే. సమస్య తీవ్రమైతే గర్భిణిలో గుండెజబ్బులకు దారితీయొచ్చు. కాన్పు అయిన వెంటనే లేదా కొన్నేళ్ల తర్వాత కూడా గుండెజబ్బు తలెత్తొచ్చు. నెలలు నిండక ముందే కాన్పు కావొచ్చు. పిల్లలు తక్కువ బరువుతో పుట్టొచ్చు. ఇలాంటి ఇబ్బందులు తప్పించటానికే చికిత్స ఉపయోగపడుతుంది. కానీ దశాబ్దాలుగా వీరికి మందుల వాడకంపై మల్లగుల్లాలు పడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏహెచ్‌ఏ శాస్త్రీయ సూచన ఎంతగానో ఉపయోగపడగలదని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటు మూలంగా సుమారు 5% నుంచి 7% మంది గర్భిణులు గర్భవాతం (ప్రిఎక్లాంప్సియా) బారినపడుతున్నారు. దీంతో 70వేల మంది గర్భిణులు, 5 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారని అంచనా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని