చుట్టాల దీవి!

అక్కడ ప్రభుత్వం ఉండదు... ప్రజలే ఉంటారు! అదో దీవి... అంతా సరస్సుతోనే నిండి ఉంటుంది! మరి జనం ఉండేదెక్కడ? వాళ్లు చేసేది ఏంటి?ఈ గమ్మత్తయిన దీవిలో మొత్తం సరస్సే. ఆ సరస్సుకి సముద్రానికీ మధ్యలో పగడపు దిబ్బల వల్ల ఏర్పడిన ఎత్తయిన ప్రాంతం ఉంటుంది. దాని మీదే అక్కడక్కడా భూభాగమూ ఉంటుంది. అక్కడే కొంత మంది జనం నివసిస్తుంటారు. పైగా వాళ్లంతా చుట్టాలే.

Published : 12 Apr 2019 00:11 IST

అక్కడ ప్రభుత్వం ఉండదు... ప్రజలే ఉంటారు! అదో దీవి... అంతా సరస్సుతోనే నిండి ఉంటుంది! మరి జనం ఉండేదెక్కడ? వాళ్లు చేసేది ఏంటి?
ఈ గమ్మత్తయిన దీవిలో మొత్తం సరస్సే. ఆ సరస్సుకి సముద్రానికీ మధ్యలో పగడపు దిబ్బల వల్ల ఏర్పడిన ఎత్తయిన ప్రాంతం ఉంటుంది. దాని మీదే అక్కడక్కడా భూభాగమూ ఉంటుంది. అక్కడే కొంత మంది జనం నివసిస్తుంటారు. పైగా వాళ్లంతా చుట్టాలే.

* ఈ విచిత్రమైన దీవి ఎక్కడుందంటే పసిఫిక్‌ మహా సముద్రంలో. న్యూజీలాండ్‌కు 3200 కిలోమీటర్ల దూరంలో.

* ఇంతకీ ఈ దీవి పేరేంటో చెప్పలేదు కదూ. పాల్మర్‌స్టోన్‌ ఐలాండ్‌.

* దీని మధ్యలో అంతా మరో పెద్ద సరస్సు నిండిపోయి ఉంటుంది. ఏదో చెరువుకు గట్టు ఉన్నట్టు ఇక్కడి సరస్సుకు చుట్టూ గట్టులా ఈ దీవి మొత్తం దర్శనమిస్తుంది.

* దానిలో అక్కడక్కడా నివాసయోగ్యమైన భూభాగాలున్నాయి. అంటే ఆ దీవిలో మళ్లీ బుల్లి ద్వీపాలన్నమాట. వాటిలో ఇప్పుడు 62 మంది నివసిస్తున్నారు.

* బయటి ప్రపంచానికి అత్యంత దూరతీరాల్లో ఉన్న దీవిగా దీనికి గుర్తింపు ఉంది. ఇది 11కిలోమీటర్ల పొడవుంటుంది.

* ఇక్కడి ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధమే ఉండదు.

* 1777లో కెప్టెన్‌ కుక్‌ అనే ఆయన మొదట ఈ దీవిలో ప్రవేశించారు. దీనికి హెన్రీ టెంపుల్‌ అనే పేరు పెట్టారు. అయితే ఆ పేరు ఇప్పుడు వాడుకలో లేదు.

* ఇది జరిగిన దాదాపు శతాబ్దం తర్వాత వడ్రంగి అయిన విలియమ్‌ మార్స్‌టర్‌ అనే ఆయన ఈ దీవిని చూసి ఇక్కడి అందాలకు ముగ్ధుడైపోయాడు. ఆయన బ్రిటిషర్‌. తన భార్య, పిల్లలు, బంధువులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అలా వారి కుటుంబానికి చెందిన వారే ఇప్పుడు ఇక్కడో కమ్యునిటీలా ఏర్పడ్డారు. వారే 62 మంది వరకూ ఉన్నారు.

* వారంతా అక్కడి చిన్న దీవుల్ని తలా ఒకటన్నట్టుగా పంచుకున్నారు. వాళ్లకు సొంత కౌన్సిల్‌ ఉంది. అయితే వాళ్లు ఇప్పటికీ బ్రిటిషర్లమనే భావిస్తారు. ఆ జండానే అక్కడ ఎగరేస్తారు. కానీ నిజానికి ఈ భూభాగం న్యూజీలాండ్‌ పరిధిలోకి వస్తుందట.

* ఇప్పుడు అక్కడ ఇళ్లు, స్కూలు, చర్చిలాంటివన్నీ ఉన్నాయి. అయితే దుకాణాలేం ఉండవు. అక్కడ సహజంగా దొరికే వాటితోనే వీరు జీవిస్తుంటారు. రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి.

* ఇక్కడ తాగడానికి మంచి నీళ్లే దొరకవు. అందుకే వాన నీరును సేకరించి వాటినే తాగుతారు.

* ఏడాదికి రెండు సార్లు వస్తువుల నౌక ఈ దీవిని చేరుతుంది. బియ్యం, ఇంధనంలాంటివి తీసుకొస్తుంది. అలా బయటి నుంచి వచ్చే వస్తువుల్ని కొనుక్కోవాలనుకున్నప్పుడే వీరికి డబ్బు అవసరం. ఆ డబ్బు కోసం వీరు ఇక్కడి పేరెట్‌ ఫిష్‌లను ఎండబెట్టి, లేదా గడ్డకట్టించి అదే ఓడలో ఎగుమతి చేస్తారు.

* డజను వరకూ పర్యటక బోట్లూ ఇక్కడికి వచ్చి వెళుతుంటాయి. వారికి రిసార్టుల్లాంటివేవీ ఇక్కడుండవు. ఈ కుటుంబ సభ్యులే స్వాగతం పలుకుతారు. వీళ్ల ఇళ్లలోనే ఆతిథ్యం ఇచ్చేస్తారు. భలే చుట్టాల దీవే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని