కన్నతల్లికే ప్రాణం పోశాడు!

‘‘వంద దేవుళ్లే కలిసొచ్చిన అమ్మ నీలాగా చూడలేరమ్మ కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమ దొరకదమ్మ నా రక్తము ఎంతిచ్చినా నీ త్యాగాలనే మించున నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మమైన సరిపోదమ్మ...’’

Published : 27 Mar 2022 00:48 IST

‘‘వంద దేవుళ్లే కలిసొచ్చిన అమ్మ నీలాగా చూడలేరమ్మ కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమ దొరకదమ్మ నా రక్తము ఎంతిచ్చినా నీ త్యాగాలనే మించున నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మమైన సరిపోదమ్మ...’’

ఇది ఓ సినిమాలోని పాట..  ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకంటే.. కన్నతల్లి రుణం తీర్చుకోలేనిది. కానీ ఓ బుడతడు తీర్చుకునే ప్రయత్నం చేశాడు. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి ప్రాణాలు కాపాడి ఆమెకు మరుజన్మనే ఇచ్చాడు. ఆ వివరాలేంటో తెలుసుకుందామా!

కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా కుడ్లూరుకు చెందిన దీక్షిత్‌కు ప్రస్తుతం ఎనిమిదేళ్లు. నాన్న రవికుమార్‌, అమ్మ అర్పిత. దీక్షిత్‌ ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఓ సంవత్సరం క్రితం దీక్షిత్‌ వాళ్ల అమ్మ ప్రమాదంలో ఎలా చిక్కుకున్నారంటే..

ఏడాది క్రితం ఏం జరిగిందంటే..

దీక్షిత్‌కు వాళ్ల అమ్మ అంటే చాలా ఇష్టం. తల్లి మాట జవదాటేవాడు కాదు. ఏడాది క్రితం ప్రమాదవశాత్తు వాళ్ల అమ్మ జుట్టు రైస్‌మిల్లు బెల్టులో ఇరుక్కుపోయింది. ఆమె బాధ భరించలేక గట్టిగా అరిచారు. ఇదంతా క్షణాల్లో జరిగింది. అప్పుడు మన దీక్షిత్‌ మెదడు పాదరసంలా పనిచేసింది. యంత్రానికి విద్యుత్తు సరఫరా చేసే మీటను వెంటనే ఆపేశాడు. మరో క్షణం ఆలస్యమైతే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. ఇలాంటి ప్రమాదాలు జరిగేటప్పుడు పెద్దవాళ్లే సరిగా స్పందించరు. కానీ ఈ చిన్నారి మాత్రం అత్యంత వేగంగా సరైన నిర్ణయం తీసుకుని వాళ్ల అమ్మకే పునర్జన్మను ప్రసాదించాడు.

తనే లేకపోతే..

‘మా దీక్షిత్‌.. ఇంత చిన్న వయసులోనే అంత వేగంగా స్పందించడం నిజంగా అద్భుతం. నా చిట్టితండ్రి వల్లే నేను ఇప్పటికీ బతికి ఉన్నాను. లేకపోతే ఆనాడే ప్రాణాలు పోయేవి’ అని ఈ చిన్నారి తల్లి చెబుతోంది.

గుర్తింపు దక్కింది..

దీక్షిత్‌ ధైర్యసాహసాలను ప్రభుత్వం గుర్తించి ‘హోసల శౌర్య అవార్డ్‌’ను ప్రకటించింది. ఇటీవలే ఆ అవార్డును బెంగళూరులోని ‘రవీంద్ర కన్నడ భవన్‌’లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిన్నారికి అందించారు. ఎంతైనా కన్నతల్లిని కాపాడుకున్న మన దీక్షిత్‌ నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని