సొంతింటికి దారి చూపుతున్నారు

ఇల్లు కొనేటప్పుడు ఎక్కువ మంది మొదట చూసేది రవాణా సౌకర్యం. నగరానికి కాస్త దూరమైనా మెరుగైన రవాణా సదుపాయం ఉంటే కొనుగోలుకు ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ ధరలు సైతం అందరికీ అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం శివార్ల నుంచి నగరాన్ని అనుసంధానం చేసే...

Published : 10 Jul 2021 02:21 IST

ఈనాడు, హైదరాబాద్‌

ల్లు కొనేటప్పుడు ఎక్కువ మంది మొదట చూసేది రవాణా సౌకర్యం. నగరానికి కాస్త దూరమైనా మెరుగైన రవాణా సదుపాయం ఉంటే కొనుగోలుకు ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ ధరలు సైతం అందరికీ అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం శివార్ల నుంచి నగరాన్ని అనుసంధానం చేసే పలు రహదారి అభివృద్ధి ప్రాజెక్ట్‌లు చేపట్టడంతో నిర్మాణరంగ వృద్ధికి ఇది దోహదం చేస్తుందని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి.

ప్రధాన నగరంలో స్థిరాస్తి ధరలను అందరూ అందుకోలేని పరిస్థితులు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు లోపలి వరకు ప్రధాన నగరంగా భావిస్తే..  వీటి చుట్టూ ఉన్న ప్రాంతాలు ఇప్పటికే అభివృద్ధి చెందాయి. ఒకప్పుడు శివార్లు అనేవారు.. ఇప్పుడు సిటీనే మించిపోయాయి. ఇక్కడ వ్యక్తిగత ఇళ్లు అనేది అత్యంత ఖరీదైన వ్యవహారం. ఇన్నర్‌ రింగ్‌కి కాస్త దూరంగా ఉన్న ప్రాంతాలు అనుసంధానం లేక అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ఇలాంటి చోట్ల ప్రస్తుతం మౌలిక వసతులు అభివృద్ధిపై సర్కారు దృష్టి పెట్టింది. ముఖ్యంగా రహదారుల విస్తరణ, కొత్త రహదారులు వేయడం, లింకు రోడ్లు, మూసీపై వంతెనల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లోనూ మున్ముందు మరింత అభివృద్ధి చెందనున్నాయని రియల్టర్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మూసీకి అటుఇటు ఉన్న ప్రాంతాలు కొన్ని నది దాటే వీలు లేక నెమ్మదిగా వృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో ఇళ్లు అందుబాటు ధరల్లో ఉన్నాయి. లింకురోడ్లు, వంతెనలతో అనుసంధానం పెరిగితే ధరలు సైతం పెరగనున్నాయి. ఈలోపే అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం మేలని నిర్మాణదారులు సూచిస్తున్నారు.

దూరం దగ్గరవుతోంది.. ప్రభుత్వం ప్రతిపాదించిన లింకురోడ్లు, వంతెనలు  ఏడాది నుంచి మూడేళ్ల వ్యవధిలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పనులన్నీ పూర్తయ్యేనాటికి ఆ ప్రాంత రూపురేఖలే మారిపోతున్నాయి. గతంలో ప్రభుత్వం అవుటర్‌కు అనుసంధానంగా నిర్మించిన రేడియల్‌ రోడ్లే ఇందుకు నిదర్శనం. రోడ్డు లేనంత వరకు ఒక ధర ఉంటే.. ఆ మార్గంలో తారు పనులు మొదలయ్యాయో లేదో ధరలను అమాంతం పెంచడం గమనించే ఉంటారు. బీహెచ్‌ఈఎల్‌ దాటిన జాతీయ రహదారి నుంచి బీరంగూడ, కిష్టరెడ్డిపేట మీదుగా ఓఆర్‌ఆర్‌ వరకు విశాలమైన రహదారి వేస్తున్నారు. ఇక్కడ క్రితం వారం చెప్పిన ధరలకి ఈవారం ధరలకు పొంతనే ఉండటం లేదని... ధరలు పెంచి చెబుతున్నారని కొనుగోలుదారుడు ఒకరు తన స్వీయ అనుభవాన్ని ‘ఈనాడు’తో పంచుకున్నారు. 

కొత్త వంతెనలతో అనుసంధానం మెరుగు  (వ్యయం రూ.కోట్లలో)

* ఇబ్రహీంబాగ్‌ కలుపుతూ హైలెవల్‌ బ్రిడ్జి 24.50

* మంచిరేవుల-నార్సింగ్‌ కలుపుతూ వంతెన 24.50

* అత్తాపూర్‌ వద్ద  46 

* ఉప్పల్‌ లేఅవుట్‌ నుంచి 51

* ప్రతాపసింగారం నుంచి గౌరెల్లికి 16

* సన్‌సిటీ-చింతల్‌మెట్‌ కలుపుతూ.. 19.10

* బండ్లగూడ జాగీర్‌ కిస్మత్‌పూర్‌ కలుపుతూ.. 19.10

* బుద్వేల్‌.. ఐటీ పార్కులు నదికి సమాంతరంగా.. 11.10

* హైదర్‌షా కోట్ల నుంచి రాందేవ్‌గూడ కలుపుతూ.. 11

* బుద్వేల్‌ వద్ద రెండో కొత్త బ్రిడ్జి 43

* మంచిరేవుల నుంచి కొత్త వంతెన వరకు లింకురోడ్లు 11


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని