కలల దారిలో..చదువుల మెరికలు

కొన్ని సినిమాలు మనల్ని కుదురుగా ఉండనీయవు... ఏడిపిస్తాయి.. నవ్విస్తాయి.. కవ్విస్తాయి.. ఊహల్లో తేలేలా చేస్తాయి! ఆ భావోద్వేగాల సృష్టికర్తలుగా మారాలనుకునే ఔత్సాహికులూ కుదురుగా ఉండరు..

Updated : 25 Feb 2023 02:26 IST

కొన్ని సినిమాలు మనల్ని కుదురుగా ఉండనీయవు... ఏడిపిస్తాయి.. నవ్విస్తాయి.. కవ్విస్తాయి.. ఊహల్లో తేలేలా చేస్తాయి! ఆ భావోద్వేగాల సృష్టికర్తలుగా మారాలనుకునే ఔత్సాహికులూ కుదురుగా ఉండరు... ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయరు.. పట్టిన పట్టు వదలరు... ఇలాంటి ప్రయత్నంలో విజేతలుగా నిలిచారు ఇద్దరు తెలుగు యువకులు. అందులో ఒకరు ప్రతిష్ఠాత్మక ఆస్కార్స్‌ ఫెలోషిప్‌ అందుకోగా.. జాతీయ అవార్డు గెల్చుకున్న చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ మరొకరు. వారి కలల ప్రయాణం ఇదిగో..


విశాఖ నుంచి ఆస్కార్స్‌ దాకా..

కొన్ని సినిమాలు మనల్ని కుదురుగా ఉండనీయవు... ఏడిపిస్తాయి.. నవ్విస్తాయి.. కవ్విస్తాయి.. ఊహల్లో తేలేలా చేస్తాయి! ఆ భావోద్వేగాల సృష్టికర్తలుగా మారాలనుకునే ఔత్సాహికులూ కుదురుగా ఉండరుaa

చదువుల్లో మెరిట్‌. ప్రఖ్యాత సంస్థలో విద్యాసం. కెరియర్‌లో ఉతంగా స్థిరపడే అవకాశం. అయినా మెగాఫోన్‌పై మమకారంతో సినిమాలవైపు వచ్చాడు  విశాఖపట్నం కుర్రాడు సాగి శ్రీహరివర్మ. లఘు చిత్రాలతో మొదలుపెట్టి ప్రతిష్ఠాత్మక ఆస్కార్స్‌ గోల్డ్‌ ఫెలోషిప్‌ దాకా వెళ్లాడు. ఈ అవకాశం దక్కించుకున్న తొలి భారతీయ యువదర్శకుడు తనే.

శ్రీహరివర్మ చదువుల్లో ముందునుంచీ చురుకే. ఫొటోగ్రఫీ అన్నా, వీడియోగ్రఫీ అన్నా విపరీతమైన ఆసక్తి. రాష్ట్రం నుంచి ఒకరిద్దరికే అవకాశం లభించే రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌ (ఆర్‌.ఐ.ఎం.సి.)లో 2007లో ప్రవేశం పొందాడు. డెహ్రాడూన్‌లో ఇంటర్‌, బెంగళూరులో బీటెక్‌ పూర్తి చేశాడు. ఈ సమయంలోనే తన బుర్రకు, కెమెరాకు పని చెబుతూ లఘుచిత్రాలు తీసేవాడు. జంతు సంక్షేమంపై తను నిర్మించిన ఓ లఘుచిత్రంలో నాటి కేంద్రమంత్రి మేనకా గాంధీ సైతం చిన్న పాత్ర పోషించారు. 2017లో రష్యా ప్రభుత్వం తమ దేశ అభ్యున్నతి, సంస్కృతి, అభివృద్ధికి అద్దం పట్టేలా షార్ట్‌ఫిల్మ్‌ తీయడానికి ప్రపంచవ్యాప్తంగా ఐదుగురు యువ దర్శకులను ఎంపిక చేసింది. అనేక వడపోతల అనంతరం ఆ ఐదుగురిలో ఒకడిగా ఎంపికై రష్యా ముఖచిత్రాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించాడు. అక్కడే ‘ఫిఫా వరల్డ్‌ కప్‌’ పోటీలపై లఘుచిత్రం తీసి పలువురి ప్రశంసలు పొందాడు. అంతటితో సంతృప్తి చెందకుండా తన దర్శకత్వ ప్రతిభకు మరిన్ని మెరుగులు దిద్దుకునేందుకు వి.జి.ఐ.కె. అనే ప్రతిష్ఠాత్మక సంస్థలో చేరి ఏడాది శిక్షణ పొందాడు. కొత్త విషయాలు నేర్చుకోవడం.. వాటిని అమల్లో పెట్టడం.. ముందు నుంచి శ్రీహరికి అలవాటు. రష్యా నుంచి రాగానే అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా స్కూల్‌ ఆఫ్‌ సినిమాటిక్‌ ఆర్ట్స్‌’లో చేరి దర్శకత్వ నైపుణ్యాలపై సంవత్సరం పాటు శిక్షణ పొందాడు. అప్పుడే హాలీవుడ్‌ సినిమా చిత్రీకరణపై సమగ్ర అవగాహన పెంచుకున్నాడు. కోర్సు సమయంలోనే ఐక్యరాజ్యసమితి శాంతి స్థాపన దళాలు (పీస్‌ కీపింగ్‌ ఫోర్సెస్‌)పై డాక్యుమెంటరీ రూపొందించాడు. తర్వాత వ్యక్తిగత ఆసక్తితో యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ఏజెంల్స్‌ నుంచి జర్నలిజంలోనూ పట్టా పొందాడు.

వరించిన ఫెలోషిప్‌

సినిమా అవార్డుల్లో తలమానికం ఆస్కార్‌ పురస్కారాలు. వీటిని అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ సంస్థ ఏటా అందజేస్తుంటుంది. ఈ సంస్థే ప్రతిభావంతులైన దర్శకులను తీర్చిదిద్దేందుకు ‘ఆస్కార్స్‌ గోల్డ్‌ ఫెలోషిప్‌’ అందజేస్తుంది. దీనికోసం ఏటా ప్రపంచవ్యాప్తంగా 20 మంది ప్రతిభావంతులను ఎంపిక చేస్తుంది. ఈ ఫెలోషిప్‌లో భాగంగా.. యువ దర్శకులు, ప్రముఖ హలీవుడ్‌ దర్శకుల దగ్గర శిష్యరికం చేసే అవకాశం పొందుతారు. దీనికి ఎంపికై, ‘గేమ్‌ ఆఫ్‌ లైఫ్‌’, ‘హిడ్డెన్‌ ఫిగర్స్‌’, ‘అమెరికన్‌ డ్రీమర్‌’ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు టెడ్‌ మెల్ఫీ అనే దర్శకుడి దగ్గర శిక్షణ పొందాడు శ్రీహరి. శిక్షణలో భాగంగానే ప్రఖ్యాత వార్నర్‌ బ్రదర్స్‌ స్టూడియోలో లఘుచిత్రం తెరకెక్కించాడు. 2021 ఫిబ్రవరిలో జరిగిన ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనే అరుదైన అవకాశం చేజిక్కించుకున్నాడు.
బీఎస్‌ రామకృష్ణబీఎస్‌ రామకృష్ణ - ఎ.రమేష్‌, మిర్యాలగూడ పట్టణం


బిట్స్‌ పిలానీ నుంచి కలల ప్రపంచానికి

బిట్స్‌ పిలానీ నుంచి బీటెక్‌ పూర్తైంది. ఆరంకెల జీతంతో ఉద్యోగం సిద్ధంగా ఉంది. దాన్ని వదిలి కెమెరా అందుకున్నాడు వెంకట్‌ ఆర్‌ శాకమూరి. మూడు పదుల వయసులోనే పదుల సినిమాలకు పని చేశాడు. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు సాధించిన ‘కలర్‌ ఫొటో’తోపాటు ఈమధ్యే వచ్చిన ‘రైటర్‌ పద్మభూషణ్‌’కి తనే సినిమాటోగ్రాఫర్‌.

వెంకట్‌ది నల్గొండ జిల్లా మిర్యాలగూడ. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. తెరపై బొమ్మ కనబడగానే ఒంట్లో హుషారు చెలరేగేది. క్లాసులు బంక్‌ కొట్టి మరీ థియేటర్‌లలో దూరిపోయేవాడు. అమ్మానాన్నలు భయపడి ‘ముందు చదువు పూర్తి చెయ్‌.. తర్వాత ఆలోచిద్దాం’ అనడంతో పుస్తకం పట్టాడు. 2013లో బిట్్స పిలానీ-హైదరాబాద్‌ నుంచి ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. మంచి వేతనంతో కార్పొరేట్‌ కొలువులో చేరే అవకాశం వచ్చింది. అది వదులుకొని సినిమాల్లోకి వెళ్తానన్నాడు. కన్నవాళ్లు అడ్డు చెప్పారు. ‘రెండేళ్లు సమయం ఇవ్వండి. అవకాశాలు రాకపోతే తిరిగొస్తా’ అని చెప్పి చెన్నై రైలెక్కాడు. అక్కడికెళ్లాక ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్‌ రాజీవ్‌ మీనన్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో కెమెరా విభాగంలో కోర్సు చేశాడు. 2014లో హైదరాబాద్‌ తిరిగొచ్చి కొన్ని లఘుచిత్రాలు, ఓటీటీ వెబ్‌సిరీస్‌లకు కెమెరామెన్‌గా పని చేశాడు. ‘సూర్య వర్సెస్‌ సూర్య’ చిత్రానికి కార్తీక్‌ ఘట్టమనేని దగ్గర అసోసియేట్‌ కెమెరామెన్‌గా చేరాడు. అది తొలి చిత్రం. తర్వాత ‘నిన్ను కోరి’కి సెకండ్‌ యూనిట్‌ కెమెరామన్‌ అయ్యాడు. 2019లో లక్ష్మీరాయ్‌ ప్రధాన పాత్రలో వచ్చిన ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి’తో పూర్తిస్థాయి కెమెరామన్‌గా మారాడు. ‘కలర్‌ ఫొటో’ దర్శకుడు సందీప్‌, హీరో సుహాస్‌లతో గతంలో ఉన్న పరిచయంతో ఆ చిత్రానికి అవకాశం దక్కింది. ఓటీటీలో చిన్న చిత్రంగా విడుదలైన ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవలే ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది ‘కలర్‌ ఫొటో’. అప్పట్నుంచి వెంకట్‌ వెనుదిరిగి చూసుకోలేదు. ‘అర్ధశతాబ్దం’, ‘హెడ్స్‌ అండ్‌ టేల్స్‌’, ‘ఫ్యామిలీ డ్రామా’లతోపాటు ఇటీవల వచ్చిన ‘రైటర్‌ పద్మభూషణ్‌’కి సినిమాటోగ్రాఫర్‌గా చేశాడు. ‘సినిమాల్లోకి వెళ్తే చెడిపోతానని భయపడ్డ నా తల్లిదండ్రులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఈ స్థాయికి చేరడానికి కొంచెం కష్టంతోపాటు ఎంతో ఇష్టమూ ఉంది. బలమైన కోరిక, దానికి తగ్గ శ్రమ ఉంటే ఎవరైనా అనుకున్నది సాధిస్తారు అంటున్నాడు వెంకట్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని