బాలిక అపహరణ కేసులో ఒకరి అరెస్టు

విజయవాడ రైల్వే స్టేషన్‌లో చిన్నారి హనీఫా(3)ని అపహరించింది గుడివాడకు చెందిన మహిళలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడ పోలీసులు సేకరించిన సీసీ ఫుటేజీ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేయడంతో సోమవారం...

Updated : 14 Jun 2022 06:28 IST

నిందితులు గుడివాడ మహిళలు!


నిందితులుగా అనుమానిస్తున్న దొండపాటి పద్మజ , కోరుకొండ విజయలక్ష్మి

గుడివాడ గ్రామీణం, రైల్వేస్టేషన్‌(విజయవాడ), న్యూస్‌టుడే : విజయవాడ రైల్వే స్టేషన్‌లో చిన్నారి హనీఫా(3)ని అపహరించింది గుడివాడకు చెందిన మహిళలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడ పోలీసులు సేకరించిన సీసీ ఫుటేజీ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేయడంతో సోమవారం ఉదయం గుడివాడ కార్మికనగర్‌ వాసులు స్థానికంగా ఉన్న 413వ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి కార్యకర్త డి.జయలక్ష్మిని నిలదీశారు. ఈ గొడవపై స్థానిక సచివాలయ మహిళా పోలీసు వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చేసరికి నిందితులుగా అనుమానిస్తున్న అంగన్‌వాడీ కేంద్రం ఆయా దొండపాటి పద్మజ(చిన్నారి), అదే ప్రాంతానికి చెందిన మరో నిందితురాలైన తాపీ కార్మికురాలు కోరుకొండ విజయలక్ష్మి పరారయ్యారు. పోలీసులు వెంటనే పద్మజ కుమారుడు సందీప్‌ను అదుపులోకి తీసుకోగా వాస్తవాలు వెలుగులోకి రావడంతో విజయవాడ జీఆర్‌పీకి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో వారు విజయలక్ష్మిని కంచికచర్ల టోల్‌ గేట్‌ సమీపంలో అరెస్టు చేసినట్లు తెలిసింది. నిందితురాలు పద్మజ అంగన్‌వాడీ కేంద్రం కార్యకర్త జయలక్ష్మికి సొంత చెల్లెలు. స్థానికులు అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చి అక్కను ఆరా తీస్తున్న విషయాన్ని ఆమె ద్వారా తెలుసుకొని పద్మజ పరారైనట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా సదరు మహిళలు చిన్నారిని విక్రయించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఇందులో పిల్లల్ని విక్రయించే ముఠా హస్తం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా ఏలూరుకు చెందిన చిన్నారి తల్లి ముస్లిం మహిళ కాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఆంజనేయులను రెండో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ఆంజనేయులు విజయవాడలో కూలీ పనులు చేస్తుండగా భార్య చెత్తకాగితాలు ఏరుతుంది. ఇద్దరూ కలిసి తారాపేట రైల్వేస్టేషన్‌లో ఉంటున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకొని పాపను తల్లిదండ్రులకు అప్పగిస్తామని జీఆర్పీ పోలీసులు చెపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని