Azadi Ka Amrit Mahotsav: మన ఆంగ్లం వద్దు.. అమ్మభాషే మేలు

బోధన మాతృభాషలోనా? ఆంగ్లంలోనా? మనమిప్పుడు తరచూ చర్చిస్తున్న ఈ సమస్య ఆంగ్లేయుల పాలనలోనూ ఎదురైంది. దీనిపై తెల్లవారి మధ్యే తీవ్ర వాదోపవాదాలు సాగాయి.

Updated : 12 Nov 2021 04:53 IST

తగువులాడుకున్న తెల్లవారు

బోధన మాతృభాషలోనా? ఆంగ్లంలోనా? మనమిప్పుడు తరచూ చర్చిస్తున్న ఈ సమస్య ఆంగ్లేయుల పాలనలోనూ ఎదురైంది. దీనిపై తెల్లవారి మధ్యే తీవ్ర వాదోపవాదాలు సాగాయి. గమ్మత్తేమంటే... చాలామంది ఆంగ్లేయ ఉన్నతాధికారులు స్థానిక మాతృభాషల్లోనే బోధించాలని వాదించారు. కానీ మెకాలే, బెంటింక్‌లాంటివారు - మానసిక బానిసల్ని తయారు చేయాలంటే ఆంగ్లమే అసలైన మార్గమని వాదించి ఒప్పించారు.

ఈస్టిండియా కంపెనీ పాలన మొదలైన తర్వాత చాలామంది ఆంగ్లేయ అధికారులు స్థానిక భాషలపై మక్కువ పెంచుకున్నారు. 1770లో గవర్నర్‌ జనరల్‌గా వ్యవహరించిన వారెన్‌ హేస్టింగ్స్‌... సంస్కృతం, పర్షియన్‌, అరబిక్‌ భాషల్లో పట్టు సంపాదించారు. 1820 నుంచి 1833 దాకా కంపెనీ తరఫున విద్యా విషయాల్లో నిర్ణయాలు తీసుకున్న హోరేస్‌ హేమన్‌ విల్సన్‌... కాళిదాసు రచనల్ని ఆంగ్లంలోకి అనువదించారు. కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలలు, యూనివర్సిటీల్లో సంస్కృతం, పర్షియన్‌లకు ప్రాధాన్యం ఇస్తూ ఆంగ్లాన్ని ఓ సబ్జెక్ట్‌గా బోధించేవారు.

1823లో జనరల్‌ కమిటీ ఆఫ్‌ పబ్లిక్‌ ఇన్‌స్ట్రక్షన్‌ (జీసీపీఐ)ని ఏర్పాటు చేసి విద్యారంగం బాధ్యతలు అప్పగించారు. పదేళ్లపాటు ఈ కమిటీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. కోల్‌కతా మదర్సాలను, బనారస్‌ సంస్కృత కళాశాలను ఆధునికీకరించటం; కోల్‌కతా, ఆగ్రా, దిల్లీల్లో సంస్కృత కళాశాలల ఏర్పాటు, భారీస్థాయిలో సంస్కృత, అరబిక్‌ పుస్తకాల ముద్రణ; వివిధ సబ్జెక్టులకు చెందిన ఆంగ్ల పుస్తకాలను స్థానిక భాషల్లోకి అనువదించటం..... ఇలా జీసీపీఐ తీసుకున్న చర్యలు చాలామటుకు భారతీయ భాషల్ని గౌరవించినవే.
1833లో కంపెనీ ఛార్టర్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రిటన్‌తో పాటు మిగిలిన దేశాల మిషినరీలనూ భారత్‌లోకి అనుమతించారు. ప్రభుత్వంలో ఉన్నతపదవులకు ఆంగ్ల విద్య తప్పనిసరి చేశారు. విద్యారంగానికి నిధులను లక్ష నుంచి రూ.10లక్షలకు పెంచారు. వీటన్నింటితో పాటు... గవర్నర్‌ జనరల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి కొత్తగా ఓ సభ్యుడి (న్యాయ)ని చేర్చి... లార్డ్‌ మెకాలేను భారత్‌కు పంపించారు. 1834 జూన్‌ 10న మెకాలే భారత్‌లో అడుగుపెట్టడంతో భారత విద్యారంగం ముఖచిత్రం మారిపోయింది.

విద్యా కమిటీ (జీసీపీఐ)లో విభేదాలు మొదలయ్యాయి. స్థానికభాషలకు ప్రాధాన్యమిస్తూ, ఆంగ్లాన్ని నేర్పాలనే వారు (ఓరియెంటలిస్టులు); స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఆంగ్లంలోనే బోధించాలని పట్టుబట్టేవారు (ఆంగ్లిసిస్ట్‌లు)గా కమిటీ విడిపోయింది. అప్పటి బెంగాల్‌ ప్రభుత్వానికి విద్యా కార్యదర్శిగా పనిచేసిన హెచ్‌టీ ప్రిన్సెప్‌ ఓరియెంటలిస్టులకు నాయకత్వం వహిస్తే... ఆంగ్లిసిస్ట్‌లు లార్డ్‌ మెకాలేను నమ్ముకున్నారు. భారతీయుడైన రాజా రామ్‌ మోహన్‌రాయ్‌లాంటి వారి నుంచీ మెకాలేకు మద్దతు లభించింది.

కమిటీలో ఇరువర్గాల బలం సమంగా ఉండటంతో... ఏ నిర్ణయానికీ రాలేక... గవర్నర్‌ జనరల్‌ కౌన్సిల్‌కు సమస్యను నివేదించారు. 1835 ఫిబ్రవరి 2న మెకాలే ఓ నివేదికను కౌన్సిల్‌ ముందుంచి ఆంగ్లవిద్య కోసం బలంగా వాదించారు.
గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ విలియం బెంటింక్‌ ఈ వాదనతో ఏకీభవించారు. దీంతో ఓరియెంటలిస్టులు ఓడిపోయారు. బెంటింక్‌ ఆమోదంతో 1835 మార్చి 7 నుంచి మెకాలే నివేదిక అమల్లోకి వచ్చేసింది. ఆయన కోరుకున్న వారసుల తయారీ మొదలైంది.

పుట్టుకే వారిది..

‘మన ఆంగ్ల భాష పాలకుల భాష. వాణిజ్య భాష. ఇది ప్రపంచ భాష. భారతీయ స్థానిక భాషలు అత్యంత హీనమైనవి. పాశ్చాత్య అభ్యసనానికి ఇవి సరిపోవు. సాహిత్యమంటే ఆంగ్ల సాహిత్యమే. హిందూ, ముస్లింల సాహిత్యం కాదు. యూరోపియన్‌ పుస్తకాలతో కూడిన ఒక చిన్న గూడు (షెల్ఫ్‌) మొత్తం భారతీయ, అరేబియా సాహిత్యం కంటే ఎంతో విలువైంది. పాశ్చాత్య సైన్స్‌ను నేర్చుకోవాలంటే ఆంగ్ల మాధ్యమంలో చదవాల్సిందే. ఇక్కడి చదువులన్నీ భారతీయులకు అనుగుణంగా ఉన్నాయి. వారి సాహిత్యాన్ని ముద్రిస్తే మనకేం వస్తుంది? వాటిని తక్షణమే మూసేయాలి. భారతీయులను మార్చాలంటే ఆంగ్లం తప్పనిసరి. పుట్టుక ఒక్కటే భారతీయం. ఆ తర్వాత వారి ఆలోచనలు, అభిప్రాయాలు, విలువలు, విజ్ఞానం అన్నీ ఆంగ్లమయం కావాలి. అందుకు ఆంగ్లమాధ్యమమే మార్గం.’

- మెకాలే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని