Coronavirus: పేగులపైనా కరోనా ప్రభావం

మనిషి శరీరంలో కరోనా మహమ్మారి ప్రభావం చూపని భాగం లేదంటే అతిశయోక్తి కాదు. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, మెదడు వంటి అవయవాలతోపాటు, జీర్ణకోశ వ్యవస్థలోనూ కరోనా వైరస్‌ పలు సమస్యలు

Updated : 08 Jun 2021 08:01 IST

 రక్త సరఫరా నిలిచిపోవడంతో సమస్యలు
 గాంగ్రిన్‌ వస్తే.. అవయవం తొలగించాల్సిందే
 అల్సర్లు ఉంటే యాంటీకొయాగ్యులెంట్లు వాడొద్దు
 డాక్టర్‌ కొడాలి జగన్మోహన్‌రావు సూచనలు

నిషి శరీరంలో కరోనా మహమ్మారి ప్రభావం చూపని భాగం లేదంటే అతిశయోక్తి కాదు. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, మెదడు వంటి అవయవాలతోపాటు, జీర్ణకోశ వ్యవస్థలోనూ కరోనా వైరస్‌ పలు సమస్యలు తెచ్చిపెడుతోంది. వైరస్‌ ప్రభావంతో రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడటంతో రక్తసరఫరా నిలిచిపోయి... కొందరిలో పేగులూ దెబ్బతింటున్నాయి. పేగుకు రక్తప్రసరణ తగ్గడం (మిసెంటెరిక్‌ ఇస్కీమియా), పేగు కుళ్లిపోవడం (గాంగ్రిన్‌ ఆఫ్‌ ద బవెల్‌) వంటి సమస్యలు కొందరు కొవిడ్‌ రోగుల్లో కనిపిస్తున్నాయి. వీటితో పాటు కొవిడ్‌ చికిత్సలో భాగంగా వాడే స్టెరాయిడ్‌ల వల్ల కొందరిలో అన్నవాహిక, పొట్ట, చిన్నపేగుల్లో పుండ్లు (అల్సర్లు) ఏర్పడి రక్తస్రావం జరుగుతోంది. కరోనా రోగుల్లో ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? వీటిని ఎలా గుర్తించాలి? నివారణ మార్గాలేంటి? వంటి అంశాలపై ప్రముఖ జీర్ణకోశవ్యాధుల నిపుణులు డాక్టర్‌ కొడాలి జగన్మోహన్‌రావు విశ్లేషణ, సూచనలు ఇవీ..

మిసెంటెరిక్‌ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్లే..

కరోనా వైరస్‌ ప్రభావం, అది కలిగించే ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల రక్తనాళాల లోపలి గోడలకు రక్షణగా ఉండే సున్నితమైన పొర ఎండోథీలియం దెబ్బతింటోంది. రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడుతున్నాయి. ప్రాథమిక దశలో గుర్తిస్తే మందుల ద్వారా, శస్త్రచికిత్స ద్వారా రక్తపు గడ్డలు తొలగించొచ్చు. అలక్ష్యం చేస్తే సమస్య ముదిరి... కాలికి రక్తసరఫరా చేసే నాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడితే, గాంగ్రిన్‌కు దారితీస్తోంది. కొన్ని సందర్భాల్లో అంతవరకూ కాలు తొలగించాల్సి వస్తోంది. గుండెలోని కండరాలకు రక్తం సరఫరా చేసే సూక్ష్మనాళాల్లో గడ్డలు ఏర్పడితే గుండె పనితీరు దెబ్బతినడం, గుండెకు రక్తం వెళ్లే ప్రధాన రక్తనాళాల్లో రక్తపు గడ్డలు వస్తే గుండెపోటు సంభవిస్తున్నాయి. పేగులకు రక్త సరఫరా జరిగే ధమనుల్ని మిసెంటెరిక్‌ రక్తనాళాలు అంటారు. కరోనా ప్రభావంతో వీటిలో రక్తపు గడ్డలు ఏర్పడటం వల్ల చిన్న పేగులకు అవసరమైనంత రక్త సరఫరా జరగదు. దీన్ని మిసెంటెరిక్‌ ఆర్టెరీ థ్రాంబోసిస్‌ అంటారు.

కుళ్లిపోయిన పేగు భాగం తొలగించాలి

కరోనాతో రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడటం వల్ల చిన్న పేగులకు పాక్షికంగా రక్తసరఫరా నిలిచిపోవడాన్ని మిసెంటెరిక్‌ ఇస్కీమియా అంటారు. రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోతే... అంత మేర పేగు కుళ్లిపోతుంది. దాన్ని ‘గ్యాంగ్రిన్‌ ఆఫ్‌ ద బవెల్‌’గా పిలుస్తారు. మిసెంటెరిక్‌ ఇస్కీమియాను కొంతవరకూ మందులతో నయం చేయవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి కొందరికి యాంజియోప్లాస్టీ, శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. గాంగ్రిన్‌ ఏర్పడి పేగు కుళ్లిపోతే... శస్త్రచికిత్స చేసి కుళ్లిపోయిన మేర పేగు భాగాన్ని తొలగించి, రెండు కొసల్ని కలిపి కుట్టేస్తారు. చిన్న పేగులు ఏడు మీటర్ల వరకు పొడవు ఉంటాయి. దానిలో కొంత తొలగించినా సమస్యేమీ ఉండకపోవచ్చు. సాధారణంగా పెద్ద పేగు కంటే, చిన్న పేగులోనే గాంగ్రిన్‌ ఏర్పడే అవకాశాలు ఎక్కువ. కరోనా వల్ల ఇతర అవయవాల్లో ఏర్పడుతున్న గాంగ్రిన్‌తో పోలిస్తే చిన్న పేగుల్లో మిసెంటెరిక్‌ ఇస్కీమియా, గాంగ్రిన్‌ ఏర్పడటం కొంత అరుదుగానే ఉంది. అలాగని ప్రమాదాన్ని పూర్తిగా తోసిపుచ్చలేం. సమస్య లక్షణాలేంటో తెలుసుకుని, అప్రమత్తంగా ఉండటం అవసరం.

 స్టెరాయిడ్లతో అల్సర్ల ప్రమాదం

ఊపిరితిత్తుల ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించడానికి కొవిడ్‌ బాధితులకు స్టెరాయిడ్స్‌ వాడతారు. అలాగే రక్తం గడ్డకట్టకుండా... హెపారిన్‌ వంటి మందులూ వాడుతున్నారు. చిన్న పేగులకు రక్తం సరఫరా చేసే మిసెంటిరిక్‌ రక్తనాళాల్లో ఏర్పడే గడ్డల్ని యాంటీకొయాగ్యులెంట్‌ మందులతో కొంతవరకూ నివారించవచ్చు. కొవిడ్‌ రోగులకు వాడుతున్న స్టెరాయిడ్స్‌ వల్ల కొందరిలో అన్నవాహిక, పొట్ట, చిన్నపేగుల్లో పుండ్లు (అల్సర్లు) ఏర్పడి రక్తస్రావం జరిగే ప్రమాదముంది. ఇప్పటికే అల్సర్లు ఉంటే యాంటీకొయాగ్యులెంట్‌ మందుల వల్ల రక్తస్రావం పెరిగే అవకాశమూ ఉంది. అందుకే అల్సర్లను నివారించడానికి ఒమెప్రజోల్‌, ఫామొటిడిన్‌ వంటి యాంటీ అల్సర్‌ మందులు వాడాల్సి ఉంటుంది. యాంటీకొయాగ్యులెంట్‌ మందుల్ని కొంత కాలం నిలిపేయాల్సి రావచ్చు.

ఈ లక్షణాలుంటే జాగ్రత్త పడాలి

మిసెంటిరిక్‌ ఇస్కీమియా, గాంగ్రిన్‌ వంటి సమస్యలు కొవిడ్‌ చికిత్స పొందుతున్నప్పుడు, వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత కూడా ఏర్పడే అవకాశముంది.


* పొట్టనొప్పి ఉన్నా, వాంతులు, విరేచనాలు నల్లగా అవుతున్నా, రక్తపు విరేచనాలు అవుతున్నా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.


* కొవిడ్‌ రోగులకు చికిత్స అందించేటప్పుడు వివిధ రంగాల నిపుణులు అందుబాటులో ఉండకపోవచ్చు. కొవిడ్‌ రోగులు, వారికి చికిత్స చేస్తున్న డాక్టర్లు, నర్సులే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. రోగికి పొట్టనొప్పి వంటి సమస్యలుంటే... పేగులకు రక్తసరఫరా జరిగే నాళాల్లో ఏమైనా సమస్య ఏర్పడిందేమోనని అనుమానించాలి. వాంతులు, విరేచనాలు నల్లగా అయినా, రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం తగ్గినా, జీర్ణకోశంలో రక్తస్రావాన్ని అనుమానించాలి.


* కొవిడ్‌ రోగులకు రక్తంలో డి-డైమర్‌, ఐఎల్‌-6, సీఆర్‌పీ వంటి ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్‌ని బట్టి ఈ సమస్యలు ఎవరిలో రావొచ్చో ముందుగా పసిగట్టి డాక్టర్లు నివారణ చర్యలు తీసుకుంటారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాతా డాక్టర్లు సూచించినంత కాలం కొన్నాళ్లు యాంటీకాగ్యులెంట్‌ మందులు వాడాలి.


* ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జయిన తర్వాత కూడా రోగులు అప్రమత్తంగా ఉండటం అవసరం.

- ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని