Justice Chandru: జస్టిస్‌ చంద్రు వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం

మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు చేసిన వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. హైకోర్టు మొత్తాన్ని నిందిస్తూ వ్యాఖ్యలు చేయడమేమిటని ప్రశ్నించింది. కొన్ని ఘటనలు, కొందరు న్యాయమూర్తులపై అభ్యంతరం ఉంటే ఆ విషయం

Updated : 14 Dec 2021 10:19 IST

రాష్ట్రంలో పరిస్థితుల గురించి ఆయన అవగాహన లేకుండా మాట్లాడినట్లుంది

జై భీమ్‌ సినిమా చూశాక గౌరవం పెరిగింది

ఇప్పుడు ఆయన వ్యాఖ్యలతో ఆ గౌరవం పోయింది

సుమోటోగా క్రిమినల్‌ కోర్టుధిక్కరణ తీసుకోవాలని సీజేకు లేఖ రాద్దామనుకున్నా

ఆయన వయసు, న్యాయవాదిగా చేసిన సేవను చూసి విరమించుకున్నా

హైకోర్టు మొత్తాన్ని నిందించడమేంటని నిలదీత

కక్షిదారుల హక్కుల రక్షణకు ఆదేశాలిస్తే తప్పు ఎలా అవుతుంది?

ఆయన వ్యాఖ్యలు కోర్టు ప్రతిష్ఠను దిగజార్చడమే

జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఘాటు వ్యాఖ్యలు

ఈనాడు - అమరావతి

ద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు చేసిన వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. హైకోర్టు మొత్తాన్ని నిందిస్తూ వ్యాఖ్యలు చేయడమేమిటని ప్రశ్నించింది. కొన్ని ఘటనలు, కొందరు న్యాయమూర్తులపై అభ్యంతరం ఉంటే ఆ విషయం మేరకే పరిమితమై పోరాడాలి తప్ప.. హైకోర్టు మొత్తంపై నింద మోపడం సరికాదంది. ప్రజల ప్రాథమిక, మానహ హక్కుల పరిరక్షణ కోసం హైకోర్టు ఆదేశాలిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుతో పోరాడాల్సి వస్తోందని జస్టిస్‌ చంద్రు అనడం ఏ విధంగా సమంజసమని ప్రశ్నించింది. రాష్ట్రంలో పరిస్థితుల గురించి అవగాహన లేకుండా ఆయన మాట్లాడినట్లుందని.. ఆ వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమని పేర్కొంది. ఆయన వ్యాఖ్యలు నిరాధారమని, హైకోర్టు ప్రతిష్ఠను దిగజార్చడమేనని స్పష్టం చేసింది. ‘జై భీమ్‌’ సినిమాలో న్యాయవాదిగా కథానాయకుడి పాత్ర చూశాక.. జస్టిస్‌ చంద్రుపై గౌరవం పెరిగిందని, విజయవాడ వచ్చి ఏపీ హైకోర్టుపై చేసిన వ్యాఖ్యలతో ఆయనపై గౌరవం పోయిందని జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. 

డాక్టర్‌ సుధాకర్‌పై సినిమా తీయించండి

సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను మాటలతో చెప్పనలవికాని విధంగా పోస్టులు పెడుతుంటే సీబీఐతో కేసు పెట్టించి, దర్యాప్తు చేయించడం తప్పెలా అవుతుందని జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ప్రశ్నించారు. ‘నర్సీపట్నం మత్తువైద్య నిపుణులు డాక్టర్‌ సుధాకర్‌ను విశాఖ పోలీసులు దారుణంగా కొట్టి హింసించారు. ఆయన (జస్టిస్‌ చంద్రు) విశాఖ వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడి సుధాకర్‌ వ్యవహారంలో మానవ హక్కుల ఉల్లంఘనపై మంచి డైరెక్టర్‌తో సినిమా తీయించాలి. పాఠశాల ప్రాంగణాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్వహిస్తుంటే వాటిని తొలగించాలని ఆదేశాలిస్తే ఏడాది వరకు అధికారులు కన్నెత్తి చూడలేదు. సుమోటోగా కోర్టుధిక్కరణ చర్యలు ప్రారంభించాక తొలగించారు. ఇలాంటి చర్య పేద విద్యార్థుల హక్కులను కాపాడటం కాదా? ప్రభుత్వం ఉపాధి బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో పలువురు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అలాంటి ఘటనలకు పాల్పడొద్దు.. న్యాయం జరుగుతుందని వారికి కోర్టు విజ్ఞప్తి చేయలేదా? పౌరుల పట్ల ఠాణాల్లో జరిగే వేధింపులే హక్కుల ఉల్లంఘన కాదు. సమాజంలో చాలారకాలుగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వాటిని నియంత్రించడంలో న్యాయస్థానాలది కీలకపాత్ర. కోర్టు తీర్పులపై అభ్యంతరం ఉంటే అప్పీల్‌కు వెళ్లాలి. అంతే కానీ హక్కుల రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న హైకోర్టుపై అనుచితంగా ఎలా మాట్లాడతారు? జస్టిస్‌ చంద్రు వ్యాఖ్యాలపై సుమోటోగా క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ కేసు తీసుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాద్దామనుకున్నా. ఆయన సామాజిక పరిస్థితి, వయసు, న్యాయవాదిగా సమాజానికి చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని లేఖ రాయాలనే ఆలోచన విరమించుకున్నా’ అని జస్టిస్‌ దేవానంద్‌ చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తిగా తాను బాధ్యతలు చేపట్టాక 4వేలకు పైగా కేసులను పరిష్కరించానని, న్యాయమూర్తిగా చేసిన ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించానని ఏ ఒక్క కేసులో రుజువు చేసినా తక్షణం బాధ్యతల నుంచి తప్పుకొంటానని చెప్పారు. ప్రతి వ్యవస్థలోనూ ఒకటి రెండు లోపాలుంటాయన్నారు. అంతమాత్రాన వ్యవస్థ అంతటికీ దురుద్దేశాలు ఆపాదించడం సమర్థనీయం కాదని చెప్పారు. తమకు దురుద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యానించినా తాము పత్రికా సమావేశాలు పెట్టి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. లేదంటే తమపై వచ్చిన ఆరోపణకు గట్టి జవాబిచ్చేవారమని వ్యాఖ్యానించారు.

అసౌకర్యాల మధ్య పని చేస్తున్నాం

దేశంలోని అన్ని హైకోర్టులతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అసౌకర్యాల మధ్యే పనిచేస్తోందని న్యాయమూర్తి అన్నారు. జడ్జీలు, న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులకు సౌకర్యాల లేమి వెంటాడుతోందని.. అయినా ప్రజలకు న్యాయం అందించాలనే తపనతో పనిచేస్తున్నామని చెప్పారు. కనీస సౌకర్యాలు    కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని  నిలదీశారు. గ్రామ, వార్డు సచివాలయాలకు ఫర్నిచర్‌ సరఫరా చేసినందుకు బిల్లుల చెల్లింపులో  జరుగుతున్న జాప్యాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై   విచారణ సందర్భంగా జస్టిస్‌ దేవానంద్‌ తీవ్రంగా స్పందించారు. బిల్లులు చెల్లించకపోవడం పిటిషనర్లు గౌరవప్రదంగా జీవించే హక్కును హరించడం కాదా అని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ   ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ సోమవారం న్యాయస్థానం ముందు హాజరయ్యారు. బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని అంగీకరించారు. బడ్జెట్‌ విడుదల చేశామని, కొందరికి బిల్లులు చెల్లించామని చెప్పారు. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ వేయాలని ఆదేశించిన న్యాయమూర్తి.. విచారణను వారానికి వాయిదా వేశారు.


ప్రాచుర్యంలో ఉండేందుకే ఇలాంటి వ్యాఖ్యలు

  మానవ హక్కుల దినోత్సవానికే ఆయన  మాటలు పరిమితమైతే బాగుండేది

  జస్టిస్‌ చంద్రు వ్యాఖ్యల నేపథ్యంలో హైకోర్టు స్పందన

ఈనాడు, అమరావతి: ఇటీవల ఓ పెద్దమనిషి ఏపీ హైకోర్టు గురించి చేసిన వ్యాఖ్యలను తాము పత్రికల్లో చూశామని.. మానవ హక్కుల దినోత్సవం గురించి మాట్లాడటానికి వచ్చిన ఆయన దానికే పరిమితమై ఉండాల్సిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొంతమంది జ్యుడిషియల్‌ సెలబ్రిటీలు లైమ్‌లైట్‌ (వెలుగు)లో ఉండేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారంది. అలాంటి వెలుగులను ఆపేస్తామని వ్యాఖ్యానించింది. ఆ వెలుగు మంచిది కాదని, ఎక్కువ రోజులు మిగలదని పేర్కొంది. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడి హైకోర్టు గురించి మాట్లాడటం ఏమిటని నిలదీసింది. ఏ పనిమీద వచ్చారో.. దాని పరిధి మరిచిపోయినట్లున్నారని వ్యాఖ్యానించింది. మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు ఇటీవల ఏపీ హైకోర్టుపై చేసిన వ్యాఖ్యల విషయంలో ధర్మాసనం పై విధంగా స్పందించింది. జడ్జిల వల్లా కొన్ని తప్పులు జరగొచ్చనీ, వారూ మానవమాత్రులేనని తెలిపింది. న్యాయమూర్తులకు రక్షణ ఉంటుందని గుర్తుచేసింది. హైకోర్టు తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ స్పందిస్తూ.. ఓటీటీలో సినిమాలకు నెల తర్వాత ఆదరణ తగ్గుతుందని, దానిని 100 రోజులు కొనసాగించడానికి ప్రేక్షకులను ఆకర్షించేలా విశ్రాంత న్యాయమూర్తి వ్యాఖ్యాలు ఉన్నాయన్నారు.

దర్యాప్తు పురోగతిపై అఫిడవిట్‌ వేయండి

న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజారుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంపై అప్పటి ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ) దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ కేసు దర్యాప్తులో పురోగతిపై కోర్టులో అఫిడవిట్‌ వేయాలని సీబీఐ దర్యాప్తు అధికారిని ఆదేశించింది. పంచ్‌ ప్రభాకర్‌తో పాటు విదేశాల్లో ఉన్న ఇతర నిందితులను పట్టుకొని కేసు తార్కిక ముగింపు పలికేందుకు ఏం చేస్తున్నారో అఫిడవిట్లో పేర్కొనాలని స్పష్టం చేసింది. విచారణను జనవరి 25కి వాయిదా వేసింది. అంతకు ముందు హైకోర్టు తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. సీబీఐ డైరెక్టర్‌ అఫిడవిట్‌ వేసినప్పటికీ దర్యాప్తుపై పురోగతి వివరాలు పేర్కొనలేదన్నారు. పంచ్‌ ప్రభాకర్‌ భారతదేశ చట్టాలకు అతీతుడిని అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు వాదనలు వినిపిస్తూ.. పోస్టులు పెడుతున్నవారి ప్రాథమిక సమాచారం సామాజిక మాధ్యమాలు ఇవ్వడం లేదన్నారు. కొన్ని స్థానిక ఛానళ్లు పంచ్‌ ప్రభాకర్‌ ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తున్నాయని.. వాటిని నిలువరిస్తూ (గ్యాగ్‌) ఉత్తర్వులివ్వాలన్నారు. ఫేస్‌బుక్‌, గూగుల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, సజన్‌ పూవయ్య వాదనలు వినిపిస్తూ.. సీబీఐ కోరిన వివరాలివ్వడానికి అభ్యంతరం లేదన్నారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ ద్వారా విజ్ఞప్తి రావాలన్నారు.

కత్తి మహేశ్‌పై కేసు మూసివేత

కత్తి మహేశ్‌ చనిపోయారని, అందుకు సంబంధించిన ధ్రువపత్రం కోర్టు ముందు ఉంచామని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో ధర్మాసనం ఆయనపై కోర్టుధిక్కరణ కేసు మూసివేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని