Andhra News: బకాయిలు చెల్లించకే విద్యుత్‌ కోతలు

ఎన్టీపీసీకి రాష్ట్ర డిస్కంలు బకాయిపడ్డ మొత్తం విషయంలో స్పందించకపోవడం వల్లే అక్కడి నుంచి సరఫరా నిలిచిపోయి రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీకి డిస్కంలు....

Updated : 05 Feb 2022 03:45 IST

ఎన్టీపీసీకి రూ.350 కోట్లు బకాయిపడ్డ డిస్కంలు
కనీసం రూ.30 కోట్లు కడితే ఇస్తామన్న ఎన్టీపీసీ
అదీ చెల్లించకపోవడంతో ఉత్పత్తి నిలిపివేత
ఈనాడు - అమరావతి

ఎన్టీపీసీకి రాష్ట్ర డిస్కంలు బకాయిపడ్డ మొత్తం విషయంలో స్పందించకపోవడం వల్లే అక్కడి నుంచి సరఫరా నిలిచిపోయి రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీకి డిస్కంలు రూ.350 కోట్ల బకాయి పడ్డాయి. వీటికోసం ఎన్టీపీసీ వర్గాలు రెండు నెలలుగా డిస్కంలకు లేఖలు రాస్తున్నాయి. స్పందన లేకపోవడంతో ఎన్టీపీసీ నుంచి రావాల్సిన 800 మెగావాట్ల విద్యుత్‌ను నిలిపేసినట్లు ఒక అధికారి తెలిపారు. ఎన్టీపీసీ బకాయిల వ్యవహారం పరిష్కారమయ్యే వరకూ బహిరంగ మార్కెట్‌లో కొనేందుకూ రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు అవకాశం లేకుండా బ్లాక్‌ చేశారు. డిస్కంలు రెండు రోజులుగా కోతలు విధించాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీకి చెందిన విశాఖ సింహాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి 800 మెగావాట్ల విద్యుత్‌ను డిస్కంలు తీసుకుంటున్నాయి. ఈ సంస్థకు సుమారు రూ.350 కోట్లను డిస్కంలు బకాయి పడ్డాయి. కనీసం రూ.30 కోట్లు చెల్లించాలని అడిగినా, డిస్కంలు అదీ చెల్లించలేదు. ఎన్టీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తి గురువారం నుంచి నిలిచిందని డిస్కంలకు చెందిన ఒక అధికారి తెలిపారు. కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ నిబంధనల ప్రకారం బకాయిలు చెల్లించనందున బహిరంగ మార్కెట్‌ కొనుగోలుకు అవకాశం లేదు. దీంతో గురువారమే 3వేల మెగావాట్ల కొరత ఏర్పడింది. దీని సర్దుబాటుకు జెన్‌కో థర్మల్‌ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి పెంచాలని ఉత్తర్వులు జారీ చేశారు.

* సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శుక్రవారం నుంచి హిందుజా పవర్‌ కార్పొరేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు డిస్కంలు విద్యుత్‌ తీసుకోవాల్సి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నానికి సుమారు 500 మెగావాట్లు అక్కడి నుంచి అందుబాటులోకి వచ్చింది. మరో 500 మెగావాట్లను రాత్రికి తీసుకొచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  కొంత సర్దుబాటు చేయటానికి ఆస్కారం ఏర్పడింది.
* గురువారం రాత్రి నుంచి పవన విద్యుత్‌ అనూహ్యంగా పెరగడంతో రాత్రివేళల్లో ఎక్కువ కోతలు లేకుండా చేయగలిగారు. గురువారం సాయంత్రం నుంచి 9.39 ఎంయూల పవన విద్యుత్‌ వచ్చింది. ఈ సమయంలో 2-5 ఎంయూలకు మించి ఉత్పత్తి ఉండదు. 

రెండో రోజూ తప్పని కోతలు

రాష్ట్రంలో శుక్రవారం కూడా విద్యుత్‌ కోతలు తప్పలేదు. రాష్ట్రంలో డిమాండ్‌ 170.542 మిలియన్‌ యూనిట్లకు,  పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్లకు కోత విధించడంతో 24 ఎంయూలకు డిమాండ్‌ తగ్గినా కోతలు అనివార్యమయ్యాయి. డిస్కంలు మరో 22.38 ఎంయూలను కోతల రూపేణా సర్దుబాటు చేశాయి. శుక్రవారం పీక్‌ డిమాండ్‌ సమయంలో వంతుల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో 2-3 గంటల పాటు కోతలు విధించాయి.


సాంకేతిక లోపం అందుకేనా?

థర్మల్‌ యూనిట్ల నుంచి ఉత్పత్తి పెంచాలంటే కనీసం 6 టైం బ్లాక్‌లు (ఒక్కొక్కటి 15 నిమిషాలు) ముందుగా చెప్పాలి.  వెంటనే ఉత్పత్తి పెంచాలని ఒత్తిడి చేయడంతో జెన్‌కోకు చెందిన కృష్ణపట్నం, విజయవాడలోని వీటీపీఎస్‌ల బాయిలర్లలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఈ రెండింటి నుంచి కలిపి రోజుకు 1300 మెగావాట్ల విద్యుత్‌ వస్తుంది. వీటిని శనివారం ఉదయం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని జెన్‌కో అధికారులు తెలిపారు. ఉత్పత్తిని కొనసాగించాలన్నా థర్మల్‌ప్లాంట్ల దగ్గర బొగ్గునిల్వలు లేవు. ప్రస్తుతం వీటీపీఎస్‌ దగ్గర 1.60లక్షల టన్నులు, కృష్ణపట్నంలో 1.60లక్షల టన్నులు, కడప ఆర్‌టీపీపీలో 65 వేల టన్నుల బొగ్గే ఉంది. థర్మల్‌యూనిట్లు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రోజుకు 65వేల టన్నుల బొగ్గు కావాలి. ప్రస్తుత నిల్వలు రెండుమూడు రోజులకే సరిపోతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని