Chandrababu: రైతుల మెడకు ఉరితాళ్లు వేయొద్దు

అన్నదాతల మంచి కోసమే వ్యవసాయ విద్యుత్తు మోటర్లకు మీటర్లు పెడుతున్నామని పుంగనూరు పుడింగి చెబుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విద్యుత్తుశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీటర్లు

Updated : 13 May 2022 06:01 IST

మోటార్లకు మీటర్లు మంచిదే అయితే నీ పొలంలో పెట్టుకో

మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబు హితవు

కుప్పం నియోజకవర్గంలో రెండో రోజూ పర్యటన

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు- న్యూస్‌టుడే, గుడుపల్లె: అన్నదాతల మంచి కోసమే వ్యవసాయ విద్యుత్తు మోటర్లకు మీటర్లు పెడుతున్నామని పుంగనూరు పుడింగి చెబుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విద్యుత్తుశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీటర్లు మంచివే అయితే నీ పొలానికి పెట్టుకో.. మా పొలానికి పెట్టొద్దని స్పష్టం చేశారు. రైతుల మెడకు ఉరితాళ్లు వేయొద్దని సీఎం జగన్‌, మంత్రి పెద్దిరెడ్డిని హెచ్చరించారు. సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు గురువారం రెండోరోజు పర్యటించారు. వర్షంలోనూ కుప్పం, గుడుపల్లె మండలాల్లో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం, రోడ్‌షో నిర్వహించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘వ్యవసాయానికి మీటర్లు పెడితే ప్రమాదమని భావించి ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాటిని తొలగించారు. ఇప్పుడు మీటర్లు పెడితే రైతులకు లాభమని వైకాపా నాయకులు అంటున్నారు. నేను అన్నదాతలను రెచ్చగొడుతున్నానని మాట్లాడుతున్నారు. కేసులకు భయపడి, అప్పుల కోసమే రాష్ట్రంలో మీటర్లు పెడుతున్నారు’ అని ధ్వజమెత్తారు. 

రోజుకో అత్యాచారం

‘రాష్ట్రంలో రోజుకో అత్యాచారం జరుగుతోంది. సీఎం జగన్‌ ఇలాకా కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై 6 నెలలుగా 10 మంది అత్యాచారం చేస్తే.. గర్భం దాల్చింది. పోలీసులకు చెబితే కేసు నమోదు చేయడానికి వెనుకాడారు. ఇదేంటని అడిగితే.. కొన్ని అలా జరుగుతుంటాయ్‌. మద్యం మత్తులో అలా చేస్తుంటారు.. తల్లుల పెంపకం సరిగా లేకపోవడమే కారణమని ఓ మహిళా మంత్రి అంటున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్‌, మద్యం వినియోగం పెరిగి కొందరు మృగాల్లా తయారై అత్యాచారాలు చేస్తున్నారు. మహిళలపై దారుణాలు ఆపలేని ప్రభుత్వాలు ప్రజలకు అవసరమా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

బాబు రావాలి.. బాధలు తీరాలన్న విద్యార్థిని

మార్గంమధ్యలో ద్రవిడ విశ్వవిద్యాలయం వద్ద మాట్లాడాలని విద్యార్థులు కోరడంతో షెడ్యూల్‌లో లేకపోయినా చంద్రబాబు ప్రసంగించారు. ఉపకార వేతనాలు రావడం లేదని, వర్సిటీలో ప్రాంగణ నియామకాలు లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ విద్యార్థిని ‘బాబు రావాలి.. బాధలు తీరాలి. మీరు సీఎంగా లేకపోవడంతో ఎన్నో తరాలు వెనుకబడ్డాయి’ అనడంతో అక్కడున్న వారు ‘సీఎం సీబీఎన్‌’ అని నినదించారు. ద్రవిడ విశ్వవిద్యాలయంలో కుల రాజకీయాలు చేస్తున్నారని, రిజిస్ట్రార్‌ వేణుగోపాలరెడ్డి వర్సిటీని సొంత ఆస్తిలా చూస్తున్నారని సీనియర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగిగా నేను మాట్లాడకూడదనే నిబంధనలున్నా.. ఆవేదనతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పారు. రిజిస్ట్రార్‌ 20 మందికి రూ.50 లక్షలు ఇచ్చి వర్సిటీలో క్వారీలు నడుపుతున్నారని పూర్వ విద్యార్థి చెప్పారు. పర్యటనలో నాయకులు గౌనివారి శ్రీనివాసులు, పీఎస్‌ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.


సీబీఐనే బెదిరించారు.. 

‘వివేకా హత్య కేసు విచారణకు వచ్చిన సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టి, బాంబులేస్తామని బెదిరించిన వారికి జనాల ప్రాణాలు ఓ లెక్కా? చిత్తూరు జిల్లాలో హంద్రీ-నీవా పనులు 12 శాతం పూర్తి చేస్తే.. కుప్పానికి నీళ్లు అందుతాయి. అదీ చేయని వీరు 3 రాజధానులు కడతారా?’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని