Corona Virus: కొవిడ్‌ అన్ని రకాల వైరస్‌లకు ఒకే టీకా ఆవిష్కరణలో ముందడుగు

కొవిడ్‌ వైరస్‌ రకం (వేరియంట్‌) ఏదైనా, దానిపై సమర్థంగా పనిచేసే టీకాను అభివృద్ధి చేసే దిశగా తొలి అడుగులు పడుతున్నాయి. ఇటువంటి టీకా కోసం భారత్‌ బయోటెక్‌

Updated : 27 Jul 2022 05:19 IST

కొత్త రకం స్పైజ్‌ యాంటీజెన్స్‌ ఆవిష్కరించిన ఎక్సెల్‌కేర్‌

భారత్‌ బయోటెక్‌, యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ, సెపి భాగస్వామ్యం

ఈనాడు, బిజినెస్‌బ్యూరో: కొవిడ్‌ వైరస్‌ రకం (వేరియంట్‌) ఏదైనా, దానిపై సమర్థంగా పనిచేసే టీకాను అభివృద్ధి చేసే దిశగా తొలి అడుగులు పడుతున్నాయి. ఇటువంటి టీకా కోసం భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌, స్విస్‌ సంస్థ అయిన ఎక్సెల్‌జీన్‌ ఎస్‌ఏ, యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ, సెపి (కోయిలేషన్‌ ఫర్‌ ఎపిడమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌) జట్టు కట్టాయి. ఈ ప్రాజెక్టుకు సెపీ తనవంతుగా 19.3 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.154 కోట్లు) సమకూర్చుతోంది. కొవిడ్‌ వైరస్‌ అన్ని వేరియంట్లపై పనిచేసే టీకా అందించడానికి అవసరమైన ‘కైమెరిక్‌ స్పైక్‌ యాంటీజెన్స్‌’ ను ఆవిష్కరించినట్లు ఎక్సెల్‌జీన్‌ ఎస్‌ఏ తాజాగా వెల్లడించింది. సీహెచ్‌ఓ ఎక్స్‌ప్రెస్‌ సెల్‌ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో స్పైక్‌ యాంటీజెన్స్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. అత్యంత సంక్లిష్ట ప్రొటీన్లను ఆవిష్కరించడంలో ఈ సంస్థకు విశేష అనుభవం ఉంది. కైమరిక్‌ స్పైక్‌ యాంటీజెన్స్‌ను ఎక్సెల్‌కేర్‌, భారత్‌ బయోటెక్‌, యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ- ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పరిశీలించి, కరోనా టీకా రూపొందించడానికి అనువైన ప్రొటీన్లను గుర్తిస్తారు. దీనిపై భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల స్పందిస్తూ, కొత్త వేరియంట్ల ఫలితంగా కొవిడ్‌ ముప్పు కొనసాగుతూనే ఉందని, అందువల్ల పరిశోధనలను ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. గత రెండేళ్లలో గడించిన అనుభవాలు, నిర్వహించిన అధ్యయనాల ఆధారంగా కొత్త యాంటీజెన్లను ఎంపిక చేసి, విశ్లేషించాల్సి ఉందని అన్నారు. ఇప్పటికే కొవిడ్‌ టీకాల విభాగంలో విశేషంగా కృషి చేసిన భారత్‌ బయోటెక్‌ శాస్త్రవేత్తల బృందం, భవిష్యత్తు సవాళ్లపై తనవంతుగా కసరత్తు చేస్తుందని తెలిపారు. మూడు ఖండాలకు చెందిన అగ్రశ్రేణి సంస్థల భాగస్వామ్యానికి సెపీ అండ దొరికిందని, తద్వారా మంచి ఫలితాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని