YSRCP: ‘నోరు మూసుకో..!’

ప్రజల విజ్ఞప్తులపై నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పందించిన తీరు. ఆదివారం కావలి మండలం బట్లదిన్నెకు ఎమ్మెల్యే వస్తున్నారన్న సమాచారంతో గ్రామస్థులు కూడలి వద్ద గుమికూడారు. హైవే నుంచి తమ గ్రామానికి వచ్చే రోడ్డు నిర్మాణానికి...

Updated : 08 Aug 2022 07:58 IST

సమస్య నివేదించిన గ్రామస్థులపై కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ఆగ్రహం

‘నీ ఇంటికొచ్చానమ్మా.. నిద్రపోతున్నావ్‌’ అంటూ మహిళతో వ్యాఖ్య

కావలి, న్యూస్‌టుడే

యువకుడు: సార్‌, మా ఊరికొచ్చే రోడ్డు అధ్వానంగా ఉంది. కొత్త రోడ్డు వేస్తామని చెప్పి ఏడాదైంది. ఇంతవరకు పనులు చేయలేదు.
ఎమ్మెల్యే రామిరెడ్డి: మూసుకో.. పగిలిపోద్ది. నువ్వు తెలుగుదేశం పార్టీకి చెందిన వాడివి. ఆ పార్టీ వాళ్లు రెచ్చగొడుతుంటే మేం సహించం.

మహిళ: మా ఏరియాకు వస్తే సమస్యలు తెలుస్తాయి సార్‌.
ఎమ్మెల్యే: మీ ఏరియాకు ఏంటమ్మా. నీ ఇంటికి కూడా వచ్చా. నువ్వు నిద్రపోతున్నావ్‌.

మహిళలు: మా కాలనీలో నీరు నిలిచి ఇళ్లలోకి పాములు వస్తున్నాయి.
ఎమ్మెల్యే: నా ఇంటి ఆవరణలోకి కూడా పాములు వస్తున్నాయమ్మా.. తీసేస్తున్నాం.

ఇదీ ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో ప్రజల విజ్ఞప్తులపై నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పందించిన తీరు. ఆదివారం కావలి మండలం బట్లదిన్నెకు ఎమ్మెల్యే వస్తున్నారన్న సమాచారంతో గ్రామస్థులు కూడలి వద్ద గుమికూడారు. హైవే నుంచి తమ గ్రామానికి వచ్చే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడాదైనా పనులు చేయలేదని వివరించారు. ఊరికి స్కూలు బస్సులు రావడం లేదని, మార్గమధ్యలో చెరువు అలుగు ప్రమాదకరంగా ఉందని చెప్పారు. సమస్యలు చెబుతున్న యువకుడిపై ఎమ్మెల్యే రామిరెడ్డి మండిపడ్డారు. తెదేపా వాళ్లు రెచ్చగొడితే మీరు నమ్మొద్దని గ్రామస్థులకు తెలిపారు. సుదీర్ఘకాలం పాలించిన పార్టీ రోడ్డు వేయలేదని, తమ పార్టీ అధికారంలో వచ్చి మూడేళ్లే అయ్యిందని చెప్పారు. మీ ఊరికి రోడ్డు వేశాకే మళ్లీ వస్తానని, లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు రానని స్పష్టంచేశారు. అంతకుముందు ఇందిరమ్మకాలనీ వాసులు స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సందర్భంలోనూ మహిళల వినతులపై ఎమ్మెల్యే స్పందించిన తీరుతో పలువురు నొచ్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని