ఎన్‌ఎంపీఎల్‌ అనుబంధ పిటిషన్ల కొట్టివేత

బందరు పోర్టు ఒప్పందం రద్దు వ్యవహారంలో నవయుగ మచిలీపట్నం పోర్ట్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎంపీఎల్‌) సంస్థ దాఖలు చేసిన అప్పీల్లోని అనుబంధ పిటిషన్లను గురువారం హైకోర్టు

Published : 30 Sep 2022 03:18 IST

బందరు పోర్టు ఒప్పందం రద్దుపై హైకోర్టు ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: బందరు పోర్టు ఒప్పందం రద్దు వ్యవహారంలో నవయుగ మచిలీపట్నం పోర్ట్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎంపీఎల్‌) సంస్థ దాఖలు చేసిన అప్పీల్లోని అనుబంధ పిటిషన్లను గురువారం హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఈ పనులను ఇతరులకు అప్పగించకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలని, సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించాలని, ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో, ప్రాజెక్టు అభివృద్ధి చేసే విధానాన్ని పీపీపీ పద్ధతి నుంచి ల్యాండ్‌లాడ్‌ పద్ధతికి మారుస్తూ ఇచ్చిన జీవోల అమలును నిలిపేయాలని ఎన్‌ఎంపీఎల్‌ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబుతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. అప్పీల్‌పై డిసెంబరు మొదటి వారంలో తుది విచారణ జరుపుతామని తెలిపింది. మచిలీపట్నం పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఏపీ ఇంధన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల (పోర్ట్స్‌) శాఖ ముఖ్య కార్యదర్శి 2019 ఆగస్టు 8న జారీ చేసిన జీవో 66ను సవాలు చేస్తూ ‘నవయుగ మచిలీపట్నం పోర్ట్‌ లిమిటెడ్‌’ సంస్థ డైరెక్టర్‌ వై.రమేశ్‌ 2019 సెప్టెంబరులో హైకోర్టును ఆశ్రయించారు. తుది విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తూ ఈ ఏడాది ఆగస్టు 25న తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ ఎన్‌ఎంపీఎల్‌ ధర్మాసనం ముందు అప్పీల్‌ వేసింది. మధ్యంతర ఉత్తర్వులిచ్చే వ్యవహారంపై దాఖలైన అనుబంధ పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగియడంతో ధర్మాసనం గురువారం నిర్ణయాన్ని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని