రుణ భారం రూ.8.71 లక్షల కోట్లు

రాష్ట్రంలో నానాటికీ అప్పులు పెరిగిపోతున్నాయి. తాజా అంచనాల ప్రకారం పెండింగు బిల్లులతోసహా రాష్ట్ర రుణ భారం రూ.8.71 లక్షల కోట్లు.

Updated : 03 Dec 2022 10:10 IST

అంచనాలను దాటి అప్పుల సమీకరణ
అయినా... ఉద్యోగులకూ రూ.వేల కోట్ల బకాయిలే
చేసిన పనులకూ బిల్లులు రావు
అభివృద్ధి పనులూ ముందుకు సాగవు
అస్తవ్యస్తంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో నానాటికీ అప్పులు పెరిగిపోతున్నాయి. తాజా అంచనాల ప్రకారం పెండింగు బిల్లులతోసహా రాష్ట్ర రుణ భారం రూ.8.71 లక్షల కోట్లు. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల కాలానికి చేసిన అప్పులను పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం కనిపిస్తోంది. అదే మిగిలిన రెండు నెలల లెక్కలనూ తీసుకుంటే రుణ మొత్తం మరింత పెరుగుతుందని అంచనా.


ఏవీ ఇవ్వరు... చెల్లించరు

రాష్ట్రంలో ఉద్యోగులకు జీతం సకాలంలో రావడం లేదు. విశ్రాంత ఉద్యోగికి ఒకటో తేదీన పెన్షన్‌ జమ కావడం లేదు. పని చేసిన గుత్తేదారుడికి బిల్లులు చెల్లించడం లేదు. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేస్తే బిల్లులు దక్కుతాయన్న నమ్మకం లేదు. పనులు చేసే ధైర్యం కాంట్రాక్టరుకు లేదు. కొత్త టెండర్లు దాఖలు చేసేందుకు చాలాచోట్ల ఎవరూ ముందుకు రావడం లేదు. ఉద్యోగులు దాచుకున్న సొమ్ములు ఇవ్వాలని అడుగుతున్నా ప్రభుత్వం నెలల తరబడి చెల్లింపులు జరపడం లేదు. డీఏ బకాయిలూ ఇవ్వడం లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థ పరిస్థితికి ఇవన్నీ అద్దం పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికారులు న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వస్తోంది. కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కోర్టులు చెప్పినా బిల్లులు ఇవ్వకపోవడంతో అధికారులు బాధ్యులవుతున్నారు. నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్లు జారీ అవుతున్నాయి.


తొలి 6 నెలల కాలానికే రూ.49,278 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తొలి 6 నెలల కాలానికే రూ.49,278 కోట్ల రుణాలను సమీకరించినట్ల్లు సాక్షాత్తూ ప్రభుత్వమే కాగ్‌కు అందించిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది.  కాగ్‌ ఈ లెక్కలను తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. వీటికి మరో 2 నెలల గణాంకాలను జత చేయాల్సి ఉంది. ఎంత లేదన్నా మరో రూ.10వేల కోట్ల వరకు ఆ మొత్తం పెరిగే అవకాశం ఉంది. ఇంకా బేవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న రూ.8,300 కోట్ల అప్పును జత చేయాల్సి ఉంటుంది. ఇతర కార్పొరేషన్ల ద్వారా మరో రూ.10వేల కోట్ల రుణాలను సమీకరించినట్లు సమాచారం. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీ వినియోగించుకున్న రుణం తొలి 6 నెలల్లోనే రూ.67,578 కోట్లుగా తేలుతుంది. అక్టోబరు, నవంబరు నెలల్లో అప్పులను కలిపితే ఇది మరింత పెరగనుంది.


ఈ ఏడాదీ అదే పెరుగుదల

అప్పులు చేసి కుదేలవుతున్న దేశాల అనుభవాలు కళ్లముందు కనిపిస్తున్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్ర ప్రభుత్వ సరళి మారలేదు. 2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రాష్ట్రంలో రూ.48,724 కోట్ల రుణాలనే వినియోగించుకుంటామని బడ్జెట్‌ గణాంకాల్లో ప్రతిపాదించారు. ఇదే మొత్తానికి     చట్టసభల ఆమోదం పొందారు. అలాంటిది తొలి 6 నెలల్లోనే ఆ అంచనాలు దాటిపోయాయి. ఇదే  తీరున అప్పులు చేస్తూ పోతే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్లను దాటి రుణాలు తీసుకునే పరిస్థితులున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అనేక కొత్త నమూనాల్లో ప్రభుత్వం జాతీయ బ్యాంకుల నుంచి రుణాలను సమీకరిస్తోంది. భవిష్యత్తు ఆదాయాలను కార్పొరేషన్లకు తాకట్టు పెట్టి మరీ రూ.వేల కోట్ల రుణాలు పొందుతున్న వైనాన్ని రిజర్వు బ్యాంకు, కేంద్ర ఆర్థికశాఖలు తప్పుబట్టినా రుణాలను సమీకరిస్తూనే ఉంది.

అన్నీ రహస్యమే..

రాష్ట్రంలో అప్పుల గణాంకాలన్నీ రహస్యమే. సాక్షాత్తూ కంప్ట్రోరల్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌లోని ఒక విభాగం నిరంతరం రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కార్పొరేషన్ల ద్వారా ఎన్ని రుణాలు ఎప్పటికి సేకరించారో తెలియజేయాలని అడుగుతూనే ఉంది. గతంలో కార్పొరేషన్ల అప్పులను కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసేది కాదు. బడ్జెట్‌ ద్వారా తిరిగి తీర్చే ఏ రుణమైనా రాష్ట్ర ప్రభుత్వ అప్పు అని ఆర్థిక సంఘం స్పష్టంగా పేర్కొంది. మరోవైపు కేంద్ర ఆర్థికశాఖ ఇదే విషయం పేర్కొంది. కిందటి ఆర్థిక సంవత్సరం నుంచి ఈ వివరాలు ఇమ్మని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్‌ కోరుతోంది. ఎన్ని నెలలైనా వాటిని కాగ్‌కు అందించడం లేదు.

పెండింగు బిల్లులే అతి పెద్ద సమస్య

పెండింగు బిల్లులు రాష్ట్రంలో అతి పెద్ద సమస్యగా ఉన్నాయి. మూడున్నరేళ్లుగా పెద్ద ఎత్తున బిల్లులు పేరుకుపోయాయి. దీనికితోడు అదనంగా ఎప్పటికప్పుడు కొత్త బిల్లులు వచ్చి చేరుతున్నాయి. ఉన్న బిల్లులకు, చెల్లింపులకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటోందని పేర్కొంటున్నారు. దాదాపు రూ.1.50 లక్షల కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయని అంచనా. ఆర్థికశాఖ అధికారులుగానీ, ప్రభుత్వ ఆర్థిక సలహాదారులుగానీ ఈ పెండింగు బిల్లుల మొత్తం ఎంతో వెల్లడించడం లేదు. ఆ మొత్తం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందని చెప్పి తప్పించుకుంటున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో బిల్లులను విడుదల చేయాలని ఆదేశించినా ఫలితం కనిపించడం లేదు. ముఖ్యమంత్రి సూచించిన 3 నెలల తర్వాతా జల వనరులశాఖ ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో తేటతెల్లమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని