విడుదలైన రోజే.. ఇంట్లోనే సినిమా!

సినిమా విడుదలైన రోజున మొదటి ఆటను ఇంట్లోనే చూసేలా దేశంలోనే ఒక వినూత్న విధానాన్ని ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) తీసుకొచ్చిందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

Updated : 03 Jun 2023 06:14 IST

ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ద్వారా వినూత్న విధానం
నిరీక్షణ సినిమాను విడుదల చేసిన మంత్రి అమర్‌నాథ్‌

ఈనాడు, విశాఖపట్నం: సినిమా విడుదలైన రోజున మొదటి ఆటను ఇంట్లోనే చూసేలా దేశంలోనే ఒక వినూత్న విధానాన్ని ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) తీసుకొచ్చిందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. ఈ విధానంలో నిరీక్షణ సినిమాను విశాఖలో ఆయన శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘థియేటర్లతో పాటు ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ద్వారా విడుదల చేయడం వల్ల చిన్న సినిమాలకు ఊతం ఇచ్చినట్లు అవుతుంది. గ్రామీణ ప్రాంతాలకూ ఫైబర్‌నెట్‌ సేవలు అందడంతో ఆయా ప్రాంతాల ప్రజలు కూడా ఇంట్లోనే సినిమా చూడొచ్చు. రాష్ట్రంలోని థియేటర్లు కొద్దిమంది చేతుల్లో ఉన్నందున చాలా సినిమాలకు థియేటర్లు దొరకట్లేదు. ఈ నేపథ్యంలో చిన్న సినిమాల మనుగడకు ఈ విధానం దోహదపడుతుంది. రాష్ట్రంలో 9.50 లక్షల సెట్‌టాప్‌ బాక్సులు ఉన్నాయి. ఆ సంఖ్యను 50 లక్షలకు పెంచుతాం. వాటిని ఏపీలోనే తయారుచేసేలా ప్రణాళిక రూపొందిస్తాం’’ అని తెలిపారు.

ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఛైర్మన్‌ గౌతంరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపడుతున్నామని, దీన్ని విజయవంతం చేయాలన్నారు. పైరసీ సమస్యలు తలెత్తకుండా అత్యాధునిక పరిజ్ఞానంతో తమ సాంకేతిక బృందం పనిచేసిందని చెప్పారు. యాప్‌, ఆపరేటర్‌ ద్వారా రూ.99 చెల్లించి సబ్‌స్క్రిప్షన్‌ చేసుకోవచ్చని, అప్పట్నుంచి 24 గంటల్లోగా సినిమాను చూడొచ్చని తెలిపారు. పెద్ద సినిమాలు కూడా ఇలా విడుదల చేసేందుకు చర్చిస్తామన్నారు. నిర్మాతలు సి.కల్యాణ్‌, రామ్‌సత్యనారాయణ మాట్లాడుతూ చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలకు ఈ వేదిక బాగా ఉపకరిస్తుందని పేర్కొన్నారు. పంపిణీదారులు, థియేటర్‌ వ్యవస్థకు దీంతో ఎలాంటి ముప్పూ ఉండదని స్పష్టం చేశారు. నిర్మాతలకు ఇష్టమై తేనే ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు. ఫైబర్‌నెట్‌ ద్వారా విడుదల చేయడంతో పైరసీని చాలా వరకు నియంత్రించొచ్చని చెప్పారు. థియేటర్లలో పాప్‌కార్న్‌, శీతల పానీయాలు అమ్మే వ్యక్తుల ద్వారా దీనికి వ్యతిరేకత వస్తుందని.. వారి మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలన్నారు. ఇందులో ఏపీ సృజనాత్మక, సాంస్కృతిక విభాగాధిపతి జోగినాయుడు, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నిరీక్షణ సినిమా బృందం పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని