22న రూ.20,000 కోట్ల బాండ్ల కొనుగోలు

జి-సెక్‌ అక్విజిషన్‌ ప్రోగ్రామ్‌ (జి-శాప్‌ 2.0) కింద రూ.20,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. జులై 22న ఈ కొనుగోళ్లు చేపట్టనున్నారు.

Updated : 16 Jul 2021 07:42 IST

ముంబయి: జి-సెక్‌ అక్విజిషన్‌ ప్రోగ్రామ్‌ (జి-శాప్‌ 2.0) కింద రూ.20,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. జులై 22న ఈ కొనుగోళ్లు చేపట్టనున్నారు. జి-శాప్‌ 2.0 కింద జులై-సెప్టెంబరులో రూ.1.2 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను బహిరంగ విపణిలో కొనుగోలు చేస్తామని జూన్‌ 4న ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 


ఏప్రిల్‌-జూన్‌లో రెండంకెల వృద్ధి
2019 స్థాయి కంటే తక్కువే
రికవరీ ‘అసంపూర్తి’గానే ఉంది: ఇక్రా

ముంబయి: కరోనా మలి విడత తర్వాత స్థానిక లాక్‌డౌన్‌లు సడలించడంతో ఆర్థిక రికవరీ గాడిన పడుతోందని.. అయితే అది ఇంకా ‘అసంపూర్తి’గానే ఉందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంటోంది. ఏప్రిల్‌-జూన్‌లో భారత ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధిని నమోదు చేసిందనే అంచనాను సంస్థ వ్యక్తం వేసింది. 2020-21 ఇదే త్రైమాసికంలోని తక్కువ ప్రాతిపదిక ఇందుకు కారణమని.. అయితే 2019-20 ఇదే త్రైమాసికంలో నమోదైన వృద్ధితో పోలిస్తే ఇది తక్కువే ఉంటుందని అభిప్రాయపడింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా 2020-21 జూన్‌ త్రైమాసికంలో జీడీపీ 23.7 శాతం క్షీణించడంతో, మొత్తం ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.3 శాతం డీలా పడ్డ విషయం తెలిసిందే.
జూన్‌ 2021లో 15 అంశాల్లో 13 అంశాల పనితీరు అంతక్రితం నెలతో పోలిస్తే పెద్దగా మార్పు లేదు. అయితే 2020 జూన్‌తో పోలిస్తే మెరుగ్గా ఉంది. అయితే ఏప్రిల్‌ 2021, జూన్‌ 2019లతో పోలిస్తే మాత్రం జూన్‌ 2021లో చాలా వరకు ఆర్థికేతర సంకేతాల పరిమాణాలు బలహీనంగానే ఉన్నాయి. అంటే రికవరీ ఇంకా ‘అసంపూర్తి’గానే ఉన్నాయి.


ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌పై సుప్రీంకు సెబీ

దిల్లీ: రెండేళ్ల పాటు కొత్త డెట్‌ పథకాలను ప్రారంభించకుండా ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌పై తాము నిషేధం విధించగా, వాటికి సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌) జూన్‌ 28న స్టే ఇవ్వడంపై సుప్రీం కోర్టును మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆశ్రయించింది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ను రూ.512 కోట్లు రిఫండ్‌ చేయాల్సిందిగా కూడా సెబీ కోరింది. ఫండ్‌ సంస్థ ఆరు ఎంఎఫ్‌ పథకాలను నిలిపివేయడంపై సుప్రీం కోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇందుకు మెజారిటీ యూనిట్‌దారుల అనుమతి కోరాలని తీర్పు ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని