హెరాన్బా ఐపీఓ..మీరు పెట్టుబడి పెట్టొచ్చా?

జరాత్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘హెరాన్బా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌’ పంటలకు రక్షణకు సంబంధించిన రసాయనాలను తయారు చేస్తుంటుంది. సొంతంగా క్రిమి సంహారిణిలు, కలుపు సంహారిణిలు, శిలీంద్ర నాశకాలను విక్రయిస్తుంటుంది........

Updated : 23 Feb 2021 16:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘హెరాన్బా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌’ పంటల రక్షణకు సంబంధించిన రసాయనాలను తయారు చేస్తుంది. సొంతంగా క్రిమి సంహారిణిలు, కలుపు సంహారిణిలు, శిలీంద్ర నాశకాలను విక్రయిస్తుంటుంది. అలాగే ఇతర అగ్రో కెమికల్‌ కంపెనీలకు ముడి రసాయనాలను తయారు చేసి విక్రయిస్తుంటుంది. భారత్‌లో సింథటిక్ పైరెథ్రాయిడ్ల తయారీలో హెరాన్బాదే అగ్రస్థానం. భవిష్యత్తు విస్తరణ కోసం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌(ఐపీఓ)కు వచ్చిన ఈ కంపెనీ సబ్‌స్క్రిప్షన్‌ నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. రూ.60 కోట్ల విలువ చేసే షేర్లు తాజా ఇష్యూ కాగా.. 90.15 లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయిస్తున్నారు.

ఈ ఐపీవోకి సంబంధించిన కీలక విషయాలు...

ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 23, 2021
ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ ముగింపు తేదీ: ఫిబ్రవరి 25, 2021
బేసిస్‌ ఆఫ్‌ అలాట్‌మెంట్‌ తేదీ: మార్చి 2, 2021
రీఫండ్‌ ప్రారంభ తేదీ: మార్చి 3, 2021
డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ తేదీ: మార్చి 4, 2021
మార్కెట్‌లో లిస్టయ్యే తేదీ: మార్చి 5, 2021

ముఖ విలువ: రూ.10(ఒక్కో ఈక్విటీ షేరుకు)
లాట్‌ సైజు: 23 షేర్లు
కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 23 షేర్లు
గరిష్ఠంగా ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 299
ఐపీవో ధర శ్రేణి: రూ.626-627(ఒక్కో ఈక్విటీ షేరుకు)

సంస్థ వివరాలు...

హెరాన్బా ఇండస్ట్రీస్‌కు సైపర్‌మెథ్రిన్, ఆల్ఫాసైపెర్మెథ్రిన్‌, డెల్టామెథ్రిన్, పెర్మిథెరిన్, లాంబ్డా సిహలోథ్రిన్ వంటి సింథటిక్ పైరెథ్రాయిడ్ల తయారీలో అపార అనుభవం ఉంది. పైరెథ్రాయిడ్‌ విపణిలో 19.5 శాతం వాటా ఈ కంపెనీదే. దాదాపు 60కి పైగా దేశాలకు ఈ కంపెనీ తమ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తుంటుంది. ఈ సంస్థకు భారతదేశంలో విస్తృతమైన పంపిణీ నెట్‌వర్క్‌ ఉంది. 16 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో 21 డిపోలు, 8600 మంది డీలర్లున్నారు. వాపిలో మూడు తయారీ కేంద్రాలున్నాయి. అలాగే రెండు ఆర్‌ అండ్‌ డీ సెంటర్లున్నాయి. శెట్టి బ్రదర్స్‌గా పేరుగాంచిన సదాశివ శెట్టి, రఘురాం శెట్టి ప్రమోటర్లుగా ఉన్నారు. ఈ ఐపీవోలో వీరు కూడా తమ ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయానికి ఉంచారు. ఇక ఆర్థిక విషయాలకు వస్తే.. గత మూడేళ్లలో ఈ సంస్ధ ఆదాయం 13.3 శాతం సీఏజీర్‌(కాంపౌండ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేటు)తో రూ.951 కోట్లకు పెరిగింది. ఇక ఇదే వ్యవధిలో కంపెనీ లాభాలు 44.4 శాతం పెరిగినట్లు బ్రోకరేరజీ సంస్థ ఏంజిల్‌ బ్రోకింగ్‌ తెలిపింది.  

బ్రోకరేజీలు ఏమంటున్నాయంటే...

‘‘గత కొన్నేళ్లలో కంపెనీ పనితీరు బాగుంది. భవిష్యత్తులో మార్కెట్లో విస్తరణకు అవకాశాలున్నాయి. తద్వారా లాభాలు పెరిగే అవకాశం ఉంది. ప్రత్యర్థులతో పోలిస్తే ఈ కంపెనీ రాబడి మెరుగ్గా ఉంది. ఈ కంపెనీ ఆర్థికంగా బలంగా ఉంది. పాజిటివ్‌ క్యాష్‌ఫ్లో జనరేట్‌ చేస్తోంది. దీర్ఘకాలంలో ఈ కంపెనీ పట్ల మా అభిప్రాయం సానుకూలంగానే ఉంది’’ అని ఏంజిల్‌ బ్రోకింగ్ తెలిపింది. 

‘‘భౌగోళిక విస్తరణతో పాటు పైరెథ్రాయిడ్‌ తయారీలో ఉన్న విస్తృత అనుభవం దృష్ట్యా భవిష్యత్తులో మంచి వృద్ధి ఉంటుందని భావిస్తున్నాం. అలాగే బలమైన బ్యాలెన్స్‌ షీట్‌తో పాటు రాబడులు బాగానే ఉన్నాయి’’ అని ఐసీఐసీఐ డైరెక్ట్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని