AY2021-22: ఐటీఆర్‌ ఫైల్ చేసేట‌ప్పుడు ఇవి గుర్తుంచుకోండి

2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు చివ‌రి తేది సెప్టెంబరు 30, 2021. 

Updated : 21 Aug 2021 16:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ఎప్పుడు ఫైల్ చేసినా కొన్ని ప‌త్రాల‌ను సేక‌రించి క్ర‌మ ప‌ద్ధ‌తిలో పొందుప‌ర‌చుకోవాలి. పెట్టుబ‌డుల‌కు సంబంధించిన రుజువులు, ఫారం-16, టీడీఎస్ స‌ర్టిఫికెట్లు వంటివి ముందుగానే సిద్ధం చేసుకోవాలి. రిట‌ర్నులు ఫైల్ చేసే తొంద‌ర‌లో చాలా మంది చిన్న చిన్న వివ‌రాల‌ను ప‌రిశీలించ‌డం మ‌ర్చిపోతారు. ఒక‌వేళ చిన్న నిర్ల‌క్ష్యం జ‌రిగినా మొత్తం ప్రక్రియ‌కు ఆటంకం క‌లిగే అవ‌కాశం ఉంటుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

మ‌దింపు సంవ‌త్స‌రం (అసెస్‌మెంట్ ఇయ‌ర్‌) ఎంపిక‌: ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన మ‌దింపు సంవ‌త్స‌రం విష‌యంలో గంద‌ర‌గోళానికి లోన‌వుతారు చాలా మంది. ఫ‌లితంగా దాఖ‌లులో త‌రుచుగా త‌ప్పులు జ‌ర‌గుతున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక సంవ‌త్స‌రం 2020-21 ఏప్రిల్‌ 1, 2020 నుంచి మార్చి 31, 2021 వ‌ర‌కు ఉంటుంది. 2021-22 అసెస్మెంట్ సంవ‌త్స‌రం అవుతుంది. కాబట్టి పన్ను చెల్లింపుదారుడు సెప్టెంబర్ 30, 2021కి ముందు ఐటీఆర్‌ను దాఖలు చేస్తుంటే అతడు/ఆమె 2020-21 ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో ఆర్జించిన ఆదాయానికి రిట‌ర్నులు దాఖ‌లు చేస్తున్నార‌ని అర్థం. తదనుగుణంగా మ‌దింపు సంవత్సరాన్ని ఎంచుకోవాలి.

వ్యక్తిగత వివరాలు: ఐటీఆర్ దాఖ‌లు చేసేప్పుడు చాలామంది చేసే మ‌రో సాధార‌ణ త‌ప్పు వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను అప్‌డేట్ చేయ‌క‌పోవ‌డం. మెయిల్ చిరునామా, ఫోన్ నంబర్‌, బ్యాంకు ఖాతా వివ‌రాల‌ను అప్‌డేట్ చేయ‌కుండానే ఇస్తుంటారు. ఇది అంత పెద్ద త‌ప్పుగా అనిపించ‌క‌పోవ‌చ్చు. కానీ ఇలాంటి చిన్న త‌ప్పులే భ‌విష్య‌త్‌లో ఇబ్బంది పెడ‌తాయి. ఐటీ శాఖ ముఖ్య‌మైన ప‌త్రాల‌ను, స‌మ‌చారాన్ని త‌ర‌చుగా ఇ-మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా ప‌న్ను చెల్లింపుదారునికి చేర‌వేస్తుంది. అప్‌డేటెడ్ వివ‌రాల‌ను ఇవ్వ‌క‌పోతే స‌రైన స‌మ‌యానికి స‌మాచారం ప‌న్ను చెల్లింపుదారుల‌కు చేర‌క ఇబ్బందులు ఎద‌ర్కోవాల్సి వస్తుంది. ఒక‌వేళ బ్యాంక్ ఖాతా వివ‌రాల‌ను అప్‌డేట్ చేయ‌క‌పోతే ప‌న్ను రిట‌ర్నులు ఆల‌స్యం అవుతాయి.

కొత్త‌/పాత ప‌న్ను విధానాలు: ప్ర‌స్తుత మదింపు సంవ‌త్స‌రంలో ప‌న్ను చెల్లింపుదారుల‌కు రెండు ప‌న్ను విధానాలు అందుబాటులో ఉన్నాయి. రెండింటిలో ఒకదాన్ని ఎంచుకుని ప‌న్ను దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. అయితే ప‌న్ను చెల్లింపుదారులు పాత‌, కొత్త విధానాల ఎంపిక‌లో గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు. పాత విధానంలో శ్లాబ్‌ల‌ సంఖ్య త‌క్కువ‌. అయితే కొన్ని మిన‌హాయంపుల‌ను పొందే వీలుంది. కొత్త విధానంలో మిన‌హాయింపులు వ‌ర్తించ‌వు.

కొత్త ప‌న్ను విధానాన్ని 2020బ‌డ్జెట్‌లో ప్ర‌వేశ‌పెట్టారు. పాత శ్లాబ్‌ల‌తో పోలిస్తే, కొత్త ప‌న్ను విధానంలో శ్లాబ్‌ల సంఖ్య ఎక్కువ‌. ఉదాహ‌ర‌ణ‌కు పాత ప‌న్ను శ్లాబ్ ప్ర‌కారం ఏటా రూ. 10 ల‌క్ష‌ల‌కు పైగా ఆదాయం ఉన్న వారు 30శాతం ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొత్త విధానంలో దీన్ని మూడు శ్లాబ్‌లుగా విభ‌జించారు. ఏడాదిలో రూ.10 ల‌క్ష‌ల నుంచి రూ.12.5 ల‌క్ష‌ల మ‌ధ్య ఆదాయం ఉన్న వారిని 20 శాతం, రూ. 12.5 ల‌క్ష‌ల  నుంచి రూ. 15 ల‌క్ష‌ల మ‌ధ్య ఆదాయం ఉన్న వారిని 25 శాతం,  రూ. 15 ల‌క్ష‌లు, ఆపైన ఆదాయం ఉన్న వారిని 30శాతం ప‌న్ను శ్లాబ్ కింద‌కి తీసుకొచ్చారు. అయితే పాత ప‌న్ను విధానంలో మిన‌హాయింపులు, త‌గ్గింపులు ఆప్ష‌న్ అందుబాటులో ఉంటుంది కాబ‌ట్టి, ప‌న్ను మిన‌హాయింపు ప‌రిధిలోకి వ‌చ్చే పెట్టుబ‌డులు చేసిన వారు పాత ప‌ద్ధ‌తిని ఎంచుకోవచ్చు. ఈ ప్ర‌యోజ‌నం కొత్త ప‌న్ను విధానంలో అందుబాటులో లేదు. అందువ‌ల్ల చెల్లింపుదారులు రెండు విధానాల్లోనూ ప‌న్ను లెక్కించి త‌మ‌కు లాభం చేకూర్చే విధానాన్ని ఎంచుకోవాలి. 

ఫారం 26A, టీడీఎస్‌ సర్టిఫికెట్లు: ఫారం 26ఏఎస్‌ను క‌న్సాలిడేటెడ్ స్టేట్మెంట్ అని కూడా పిలుస్తారు. నిర్దిష్ట ఆర్థిక లావాదేవీల‌(ఎస్ఎఫ్‌టీ)లో పేర్కొన్న ప‌రిమితికి మించి లావాదేవీలు చేసిన‌ప్పుడు, సంబంధిత స‌మాచారాన్ని ఆయా సంస్థ‌ల నుంచి ఆదాయపు ప‌న్ను శాఖ సేక‌రిస్తుంది. ఈ స‌మాచారం మొత్తం ఫారం 26 ఏఎస్‌లో పొందుప‌రుస్తారు. బ్యాంకులు, మ్యూచువ‌ల్ ఫండ్లు, బ్రోకింగ్ సంస్థ‌లు మొద‌లైన వారు పేర్కొన్న ప‌రిమితి మించి చేసే లావాదేవీల స‌మాచారాన్ని ఆదాయపు శాఖ‌కు అందిస్తాయి. టీడీఎస్ ఫైల్ చేసేప్పుడు ఆదాయంలో త‌గ్గించిన టీడీఎస్‌ను తెలియ‌జేయాలి.

అన్ని ర‌కాల ఆదాయాలు తెలియ‌ప‌ర‌చాలి: ఒక వ్యక్తి ఉద్యోగం, అద్దె, కుటుంబ వ్యాపారం మొదలైన అనేక వనరుల నుంచి ఆదాయం పొందవచ్చు. అలాగే పెట్టుబడుల నుంచి కూడా వడ్డీ ఆదాయం అందుతుండొచ్చు. పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు పెట్టుబడుల నుంచి వ‌చ్చిన‌ లాభనష్టాలు, ఆర్‌డీపై వడ్డీ వంటి ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం.. ఇలా అన్ని ఆదాయ వనరులను వెల్లడించాలి. ఉద్యోగం మారుతుంటే, మునుపటి య‌జ‌మాని నుంచి పొందిన జీతం ఆదాయం కూడా వెల్ల‌డించాలి.

మూలధన లాభ‌నష్టాల వెల్లడి: ప్రస్తుత పన్ను నిబంధనల ప్రకారం, పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌ దాఖలు చేసేటప్పుడు మూలధన లాభాలు లేదా నష్టాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాలి. అలా చేయకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంది. ప‌న్ను ప్ర‌ణాళిక, ప‌న్ను ఆదా చేసే పెట్టుబ‌డులు ఏడాది పొడ‌వునా జ‌రిగే ప్ర‌క్రియ‌. ముందుగానే సిద్ధ‌మైతే చిన్న చిన్న త‌ప్పుల‌ను చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని