పీపీఎఫ్, ఈపీఎఫ్‌తో కోటి రూపాయ‌లు సంపాదించ‌డానికి ఎన్ని సంవ‌త్స‌రాలు ప‌డుతుంది?

పీపీఎఫ్‌తో వేగంగా కోటి రూపాయ‌ల‌ను సంపాదించ‌వ‌చ్చు

Updated : 15 Jun 2021 12:17 IST

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) లేదా ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు కోటీ రూపాయ‌లు కూడబెట్టడానికి ఎంత సమయం పడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?

రెండింటిలో పెట్టుబ‌డి ఒకేలా ఉంటే, ఈపీఎఫ్ అధిక వడ్డీ రేట్లు ఇచ్చినప్పటికీ మీరు పీపీఎఫ్‌తో వేగంగా కోటి రూపాయ‌ల‌ను సంపాదించ‌వ‌చ్చు. 


ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం పీపీఎఫ్‌లో రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.  ఇది ప్ర‌స్తుతం 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. పీపీఎఫ్ పెట్టుబ‌డుల‌తో కోటి రూపాయ‌ల‌ కార్పస్‌ను చేరుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూద్దాం.

రెండింటికీ వడ్డీ రేట్లను ప్ర‌భుత్వం త్రైమాసికానికి ఒక‌సారి  స‌వ‌రిస్తుంది కాబ‌ట్టి, స్థిరంగా లేనందున, ఇటీవలి రేట్ల ఆధారంగా లెక్కలను పరిశీలిద్దాం. మీరు ఈ సంవత్సరం రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టి, ప్రతి సంవత్సరం అదే మొత్తాన్ని జోడిస్తూ ఉంటే, సగటున 7.1 శాతం వడ్డీ రేటుతో  25 సంవత్సరాల్లో కోటి రూపాయ‌ల‌ను సంపాదించ‌వ‌చ్చు. 

ఇక ఈపీఎఫ్‌ విషయానికి వస్తే.. ఈ పథకంలో, పెట్టుబడులపై పరిమితి లేదు - ఇది జీతం ఆధారంగా ఉంటుంది. మీ ప్రాథమిక జీతం పెరిగేకొద్దీ, మీ పెట్టుబడులు  కూడా పెరుగుతాయి.

 ఉద్యోగికి ప్రాథమిక నెలవారీ ఆదాయం రూ. 50,000 ఉందని అనుకుందాం. ప్రతి ఉద్యోగి,  సంవత్సరానికి ఈపీఎఫ్‌లో చేసే డిపాజిట్ ప్రాథ‌మిక వేత‌నంలో 12 శాతం, అంటే రూ. 72,000 ఉద్యోగి వేత‌నం నుంచి ఈపీఎఫ్ ఖాతాలో చేరుతుంది. అయితే కంపెనీ చేసే 12 శాతం డిపాజిట్‌లో 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ పథకానికి వెళ్తుంది కాబ‌ట్టి, 3.67 శాతం మాత్రమే ఈపీఎఫ్ ఖాతాలో జ‌మ‌వుతుంది. అంటే మొత్తం ఒక సంవ‌త్స‌రానికి సంస్థ మీ ఖాతాలో చేసే డిపాజిట్ రూ.22,000 అవుతుంది.

 గ‌త‌ ఆర్థిక సంవ‌త్స‌రానికి వ‌డ్డీ రేటు 8.5 శాతంగా నివేదిక‌లు చెప్తున్నాయి.  వడ్డీ రేటు, డిపాజిట్ ఇదే విధంగా కొన‌సాగిస్తే, కోటీ రూపాయ‌ల‌ కార్పస్‌ను నిర్మించడానికి 28 సంవత్సరాలు పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని