Crime news : విద్యార్థిని నీటి సీసాలో మూత్రం పోసిన విద్యార్థులు.. రాజస్థాన్‌లోని ఓ పాఠశాలలో అకృత్యం

పాఠశాలలో చదువు, సంస్కారం నేర్వాల్సిన విద్యార్థులు (Students) కొందరు తీవ్ర అకృత్యానికి పాల్పడ్డారు. సహచర విద్యార్థిని మంచి నీటి సీసాలో మూత్రం పోశారు.

Updated : 31 Jul 2023 16:23 IST

జైపుర్‌ : రాజస్థాన్‌లో (Rajasthan) ఓ అనాగరిక ఘటన చోటు చేసుకుంది. తోటి విద్యార్థిని మంచి నీటి సీసాలో కొందరు విద్యార్థులు మూత్రం పోశారు. అంతే కాదు ఓ ప్రేమ లేఖ రాసి ఆమె పుస్తకాల సంచిలో పెట్టారు. భిల్వాడా జిల్లా లుహారియా గ్రామలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ అమానుషం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లుహారియా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలిక చదువుతోంది. అదే పాఠశాలకు చెందిన కొందరు బాలురు గత శుక్రవారం ఆమె మంచి నీటి సీసాలో మూత్రం కలిపారు. అంతే కాదు ‘లవ్‌ యూ’ అని రాసిన ఓ పేపర్‌ను కూడా ఆమె సంచిలో పెట్టి వెళ్లారు. 

అతడికి షార్ట్‌ టెంపర్‌.. కనిపించిన వారిని కాల్చుకుంటూ పోయాడు..!

ఇవేమీ తెలియని బాలిక ఆ సీసాలోని నీటిని తాగింది. దుర్వాసన వస్తుండటం గ్రహించి పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. తన పుస్తకాల సంచిలో ఓ ప్రేమలేఖ కూడా ఉన్నట్లు వారికి తెలిపింది. అయితే ఈ విషయం తన దృష్టికి వచ్చినా.. ప్రధానోపాధ్యాయుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బాలిక ఇంటి వద్ద ఈ విషయం తెలియడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఇవాళ పాఠశాలకు వెళ్లి ఆందోళన చేపట్టారు. తహసీల్దార్‌, పోలీసులు, ప్రిన్సిపల్‌ దృష్టికి ఈ దురాగతాన్ని తీసుకెళ్లారు. 

అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో విద్యార్థిని బంధువులు కోపోద్రిక్తులయ్యారు. వెంటనే నిందితుల ఇళ్ల వైపు దూసుకెళ్లి రాళ్ల దాడి చేశారు. దీనిపై ఏఎస్పీ ఘనశ్యామ్‌ శర్మ మాట్లాడుతూ ‘విద్యార్థిని పోలీసులకు అధికారికంగా ఇంకా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. నిందితుల ప్రాంతంలోకి ప్రవేశించి రాళ్ల దాడి చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని’ చెప్పారు. ప్రస్తుతం ఆయన ఘటన జరిగిన గ్రామంలోనే ఉండి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని