పేడ దిబ్బలో మహిళ అస్తిపంజరం

నాలుగు నెలల కిందట అదృశ్యమైన ఓ మహిళ.. పేడ దిబ్బలో అస్తిపంజరంమై తేలింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని నారాయణపురం పంచాయతీ విశాలక్షి నగర్‌లో ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామీణ సీఐ ఎంఆర్‌

Published : 12 Apr 2021 01:36 IST

శ్రీకాళహస్తి గ్రామీణం: నాలుగు నెలల కిందట అదృశ్యమైన ఓ మహిళ.. పేడ దిబ్బలో అస్తిపంజరంమై తేలింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని నారాయణపురం పంచాయతీ విశాలక్షి నగర్‌లో ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామీణ సీఐ ఎంఆర్‌ కృష్ణమోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. విశాలక్షి నగర్‌కు చెందిన ఉష.. ఖమ్మంకు చెందిన నాగరాజు అలియాస్‌ నిరంజన్‌ను ప్రేమ విహహం చేసుకుంది. తల్లి అమ్ములుతో కలిసి ఉష దంపతులు నివసిస్తున్నారు. వీరు విశాలక్ష్మినగర్‌లో కొద్ది రోజుల క్రితం ఇల్లు కట్టుకున్నారు. దీని నిమిత్తం రూ.5 లక్షల అప్పు చేశారు. ఉషా శ్రీసిటీలోని ఓ మొబైల్‌ కంపెనీలో పని చేస్తుండగా, నాగరాజు ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో పని చేయకుండా ఉంటే అప్పులు ఎలా తీరుతాయని నాగరాజును అత్త అమ్ములు పలుసార్లు మందలించింది. ఇదే సమయంలో గతేడాది డిసెంబర్‌లో అమ్ములు కనిపించకుండా పోయింది. తల్లి అదృశ్యంపై ఉషా ఆందోళన వ్యక్తం చేయగా, భర్త నాగరాజు మాత్రం బంధువుల ఇంటికి వెళ్లి ఉంటుందని వారించాడు. నెల రోజులు గడిచినా తల్లి ఆచూకీ లభించకపోవడంతో జనవరి 9న శ్రీకాళహస్తి గ్రామీణ పోలీసులకు ఉషా ఫిర్యాదు చేసింది. అదే రోజు తన స్వస్థలంలో పని ఉందంటూ ఖమ్మం వెళ్లిన నాగరాజు ఇప్పటి వరకు తిరిగి రాలేదు. 
ఉష ఇంటి ఆవరణలో ఉన్న పేడ దిబ్బను తొలిగించాలని గత కొద్ది రోజులుగా పక్కింటి వారు గొడవ చేస్తున్నారు. దీంతో ఉష ఆదివారం పేడ దిబ్బను వేరే చోటుకు తరలించే క్రమంలో అందులో మనిషి పుర్రె, ఎముకలు బయటపడ్డాయి. దీనిపై ఉష పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ కృష్ణమోహన్‌, ఎస్సై వెంకటేశ్‌, తహసీల్దార్‌ ఉదయసంతోష్‌ ఘటనాస్థలికి చేరుకొని అస్తిపంజరం వెలికితీయించారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఆర్‌సీఎం రెడ్డి, విజయలక్ష్మి శవ పంచనామా నిర్వహించారు. అమ్ములు చీర, నాగరాజు లుంగిని పేడ దిబ్బలో గుర్తించారు. దీంతో చనిపోయింది అమ్ములుగా పోలీసులు గుర్తించారు. అమ్ములు మృతికి కారణం అల్లుడు నాగరాజు అని అనుమానిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని