logo

Ap News: పుష్పరాజ్‌లు ఎక్కడ?

 ప్రపంచంలోనే అరుదైన ఎర్రబంగారం (ఎర్రచందనం) కడప జిల్లాలోని శేషాచలం అడవుల్లో లభ్యమవుతోంది. సుమారు 5 లక్షల హెక్టార్లకు పైగానే ఎర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. దశాబ్దాల తరబడి అక్రమ రవాణా సాగుతున్నా... పోలీసు, అటవీశాఖలు పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నాయి.

Updated : 21 Dec 2021 11:41 IST

ఇతర రాష్ట్రాల నుంచి చక్రం తిప్పుతున్న బడా స్మగ్లర్లు 
జిల్లాలో తమిళ కూలీలతో ఎర్రచందనం నరికివేత 
పోలీసులకు చిక్కుతున్న వారిలో ఎక్కువమంది కూలీలే 
ఏటా విదేశాలకు తరలిపోతున్న విలువైన ఎర్ర బంగారం 

ఈటీవీ, కడప ప్రపంచంలోనే అరుదైన ఎర్రబంగారం (ఎర్రచందనం) కడప జిల్లాలోని శేషాచలం అడవుల్లో లభ్యమవుతోంది. సుమారు 5 లక్షల హెక్టార్లకు పైగానే ఎర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. దశాబ్దాల తరబడి అక్రమ రవాణా సాగుతున్నా... పోలీసు, అటవీశాఖలు పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నాయి.  తగినంత మంది సిబ్బంది లేకపోవడం, ఉన్నవారు సరైన తనిఖీలు నిర్వహించకపోవడం వెరసి అరుదైన ఎర్ర బంగారం విదేశాలకు తరలిపోతోంది. ఎర్రచందనం రవాణా ఇతివృత్తంగా తెరకెక్కించిన ఓ సినిమా ఇటీవల విడుదలైంది. 
* ఎర్రచందనం దుంగలకు అంతర్జాతీయంగా మంచి డిమాండు ఉండటంతో బడా స్మగ్లర్లు వాటిని విదేశాలకు తరలించడానికి ఎంతటికైనా తెగపడుతున్నారు. జిల్లాలో ఎర్రచందనం చెట్లను నరికి వాటిని లారీల్లోకి తరలించాలంటే తమిళ కూలీలదే ముఖ్య భూమిక. ప్రధానంగా రైల్వేకోడూరు శేషాచల అడువుల్లోకి పోలీసుల కళ్లు గప్పి చొరబడుతున్నారు. రైల్వేకోడూరు, రాయచోటి, నందలూరు, రాజంపేట, సిద్దవటం అటవీ ప్రాంతాల్లోకి చెట్లను నరకడానికి వస్తున్నారు. వారం, పది రోజులపాటు అడవిలోనే ఉండి మేలు రకం చెట్లను నరికి దుంగలుగా మార్చి లారీల్లో తరలిస్తున్నారు.
* జిల్లా నుంచి కర్ణాటక, తమిళనాడు ప్రాంతానికి అక్కడ నుంచి విదేశాలకు యథేచ్చగా ఎర్రచందనం తరలిపోతోంది. బెంగళూరు సమీపంలోని కటిగెనహళ్లి ప్రాంతంలో అంతర్జాతీయ స్మగ్లర్లు ముంబయి  మీదుగా విదేశాలకు చేరవేస్తున్నట్లు పోలీసు అధికారుల పరిశీలనలో తేలింది. చాలా సందర్భాల్లో పోలీసులు కటిగెనహళ్లి, తమిళనాడు ప్రాంతాలకు వెళ్లి కొంతమంది స్మగ్లర్లను పట్టుకున్న సందర్భాలున్నాయి. ఇలా పట్టుబడినవారిలో 80 శాతం మంది తమిళ కూలీలే. చెన్నై, బెంగళూరు, ముంబయి, దుబాయి ప్రాంతాల్లో ఉంటున్న బడా స్మగ్లర్లు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎర్రచందనం టన్ను ధర రూ.కోటి పలుకుతోంది. గతంలో ప్రభుత్వం ఈ-వేలం ద్వారా విక్రయించిన సందర్భాల్లోనూ అదే ధర పలకడం గమనార్హం. 
* తమిళనాడు నుంచి కూలీలను జిల్లాలోని అటవీ ప్రాంతాలకు తరలించేది అంతా మేస్త్రీలే. వీరికి వారం నుంచి పది రోజులకు రూ.లక్షల్లో ముడుతుండడంతో కూలీలు కూడా ప్రాణాలకు తెగిస్తున్నారు. పోలీసులు దాడులు చేసిన సమయంలో వారిపైకి రాళ్లు, గొడ్డళ్లతో దాడులు చేసిన సందర్భాలు లేకపోలేదు. పోలీసులకు కూలీలు చిక్కినా వారి కుటుంబాలకు డబ్బులు చేరుతుండడంతో చెట్లు నరకడానికి వెనకాడటం లేదు. పోలీసు, అటవీశాఖలు మరింత నిఘా ఉంచి బడా స్మగర్లను పట్టుకుంటేనే ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుంది.

22 మందిపై పీడీ యాక్టు నమోదు
ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ముమ్మరంగా దాడులు చేస్తున్నాం. అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేయడమే కాకుండా తనిఖీ కేంద్రాల్లో సోదాలు సాగిస్తున్నాం. ఈ ఏడాదిలోనే చాలామంది స్మగ్లర్లను పట్టుకున్నాం. 22 మందిపై పీడీ యాక్టు నమోదు చేసి వారి ఆస్తులను జప్తు చేస్తున్నాం. పట్టుబడిన వారిచ్చిన సమాచారంతో బడా స్మగ్లర్లపై నిఘా పెడుతున్నాం. - అన్బురాజన్, ఎస్పీ  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని